కనువిందు చేస్తున్న మబ్బుల గుంపులు
(డాక్టర్ వైజయంతి పురాణపండ)
మేఘం.. మబ్బు.. జలధరం.. అంబుదం.. మొయిలు..
ఎన్ని పేర్లు కావాలంటే అన్ని పేర్లు ఉన్నాయి మేఘాలకి.
మేఘాలకి గుడి కట్టేసి (మేఘ + ఆలయ – సవర్ణదీర్ఘసంధి), మేఘాలయ అనే రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం.

మబ్బుల్ని చూడగానే ఎంతటివాళ్లకైనా మహాకవి కాళిదాసు రచించిన ‘మేఘ సందేశం’ మదిలో మెదులుతుంది. వేలమైళ్లు ప్రయాణించే మేఘాలతో మన వారికి మనం మన సమాచారాన్ని పంపుతూనే ఉన్నాం కదా. వైఫై అంటే అదే మరి. మన సమాచారమంతా క్షణాలలో గాలిలో ప్రయాణించి, మన వారికి చేరుతుంది.
ఎవరి దృక్కోణం వారిది…
సృష్టిలోని ఏ అంశాన్నయినా వారి వారి దృష్టికోణంతోనే చూస్తారు. ముత్యాలముగ్గులో కాంట్రాక్టర్ కనకారావు పాత్రలో రావుగోపాలరావు గారి చేత మంచి మాట పలికించారు ముళ్లపూడి రమణ గారు.. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టు లేదు.. అంటూ. నిజమే ఎవరి మనసు ఎలా ఉంటుందో, వారి ఆలోచనాధోరణి కూడా అలాగే ఉంటుందనడానికి మంచి ఉదాహరణ. మా చిన్నప్పుడు ఆకాశం ఎర్రగా ఉంటే, ‘సీతమ్మ వారు కుంకుమ ఆరబోసుకుంది’ అనేవారు. కొద్దిగా పసుపు రంగులో ఉంటే, ‘పసుపు ఆరబోసుకుంది’ అనేవారు. మేఘాలు అవే. కానీ చూసేవారి దృష్టికోణం తేడాగా ఉంది.

ఒకరికి రక్తంలా ఉంటే, ఒకరికి కుంకుమలా ఉంది. ఆలోచనలో ఎంత తేడా, ఎంత వ్యత్యాసం. ఎవరి ధోరణి వారిది. వాస్తవానికి ఆకాశంలో ఉండేవి మేఘాలు మాత్రమే. ఈ రెండు చూసిన తరవాత నాకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మబ్బుల్ని నా కెమెరాలో బంధించాను. వాటి మీద ఒక వ్యాసం రాస్తే ఎలా ఉంటుందా అని. ఆ ఫోటోలను ఒక వరుసలో ఏర్పరచి, సృజనాత్మక రచన చేయాలనుకుంటున్నాను. మేఘనాథుడు (ఇంద్రజిత్తు కాదు, ఇంద్రుడు) అనుగ్రహించాలి నన్ను. నాలో ఆలోచనలు రేకెత్తించాలి. అందుకోసం ప్రయత్నిస్తాను.

మబ్బులపై వర్ణనలు…
ఇంద్రుడు తన ధనుస్సు సంధించి, రంగురంగుల ఆలోచనలను మేల్కొలపాలి.
మబ్బులు నీలి రంగులోనే ఎందుకుంటాయి.
ఎర్రగా ఉంటే బావుండవు కనుక అని శ్రీలక్ష్మి నోట ఒక తవిక పలికించవచ్చు.
మబ్బులకి కూడా వర్ణాలున్నాయి.
నీలి రంగు, ఎరుపు రంగు, కమలాపండు రంగు, పసుపు రంగు, నల్ల రంగు… ఎన్నో రంగులు.
ఇవి ఎందుకు వచ్చుంటాయని కాస్తంత చిలిపిగా ఆలోచిద్దాం.
ముఖ్యంగా ఎండాకాలం నుంచి బయలుదేరదీద్దాం ఈ మబ్బుల్ని.

నోరూరించే ఎండాకాలం….
ఎండాకాలమంటే ఊరగాయలు, వడియాలు, అప్పడాలు, నిలవ సరుకులు..
అబ్బో ఎండను పూర్తిగా వాడేసుకుంటాం.
ఓ పక్కన చెమటలకు అష్షు బుష్షు అనుకుంటూనే పనులను కానిచ్చేస్తాం.
ఆవకాయ తయారుచేయడానికి –
ఆవాలు, ఎండు మిర్చి, ఉప్పు, మెంతులు ఎండలో పెట్టి, బాగా గుల్లగా అయ్యాక వాటిని పొడి చేసుకుంటాం.
అసలవి గుల్లగా ఎందుకయ్యాయని ఎప్పుడైనా ఆలోచించామా.
ఆవాలలోని తడిని పీల్చేసి, ముదురు పసుపు రంగు మేఘం ఏర్పడుతుంది.

ఎండు మిర్చిలోని తడితో పాటు కారపు ఘాటును పీలుస్తూ, హచ్చి, హచ్చి అంటూ తుమ్ములు తుమ్ముతూనే, ఎర్రగా మారిపోతాడు మేఘుడు. ఇక ఉప్పు సంగతి చెప్పాలా. ఆ నీళ్లలోనే తెల్లటి లె లుపు మబ్బులు ఏర్పడి, తెల్లటి ఎండ కాసి, మనలను నీరుగార్చేస్తుంటాయి జలధరాలు.
మరి ఆవకాయ కాకుండా మాగాయ పెడతారు తెలుసుగా –
మామిడికాయ ముక్కల్ని, వాటిని పిండిన ఊటను రెండింటినీ రెండు రోజులు ఎండబెట్టేసరికి..
మామిడికాయ ముక్కల్లోని పులుపుని, కాసంత రంగుని పీల్చేస్తాయి. వాటికి కూడా శరీర శాంతి కలగాలిగా. ఈ రసం పీల్చుకుని కాస్తంత శాంతించి, అకాల వానలు కురిపిస్తాయి. ఇలా అనడం కంటె కన్నీరు కారుస్తాయి అంటే సరిపోతుంది.

మరి కన్నీరు ఎందుకు కార్చాలి…
అయ్యో, మనకు మామిడిపళ్లు తినే యోగం లేదే అని.. వగతో వగరుస్తాయి.
వాటి కన్నీరు తుడవడానికి కొందరు మామిడిపండు రసాన్ని కూడా ఎండబెట్టి, ఆ మబ్బులు పీల్చగా మిగిలిన దానితో తాండ్ర తయారుచేస్తారు.
ఇవన్నీ ఒక పక్కన పెడితే –
వడియాలు…
గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, రవ్వ వడియాలు… కావలసినన్ని.
ఈ వడియాలలోని తడిని వడివడిగా పీల్చేసి, వడియాల ఆకారంలో మబ్బులు సందడి చేస్తాయి.
అంటే –
ఆకాశంలో చరించే వారు మబ్బుల వడియాల పెట్టుకున్నట్లన్నమాట.

మేఘాలకు రుచులు కావాలి.
అందుకే –
మామిడి కాయ ముక్కల నుంచి రసం, వడియాలలోని సారాన్ని పీల్చేసిన మేఘాలు.. నాలుక జుర్రుకుంటూ, రుచుల దాతా సుఖీభవ అని మనల్ని ఆశీర్వదిస్తాయి.
వీటన్నిటితో పాటుగా…
తాటి ముంజులను కూడా జుర్రుకుంటాయి.
అందుకే అన్నిరకాలైన… మన రుచులు తిన్న ప్రేమతో ఆ మేఘాలు.. రెండు నెలల తరవాత మన నేలను పరవశింపచేస్తూ.. వర్షాలు కురిపిస్తాయి
నదులను సముద్రాలనే కాదు, వంటలు, పిండివంటలలోని నీటిని కూడా తాగేస్తాయి కాబట్టే..

వర్షం పడగానే భూమి కూడా మంచి రుచికరంగా తయారవుతుంది.

(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

















