(రోచిష్మాన్, 9444012279)
కర్ణాటకసంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన త్యాగరాజు జన్మదినం ఇవాళ.
వారి దివ్యాత్మకు ప్రణామం.
“విదులకు మ్రొక్కెద సంగీత కో విదులకు మ్రొక్కెద” అంటూ
నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై “ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము దొరికెను” అని తెలుసుకుని జీవించారు. నాదబ్రహ్మమై జీవిస్తున్నారు.
వారు పాడినది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది
మనకు చదువయింది.
“సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ” అంటూ అమృతవర్షిణి రాగంలో రూపకతాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు.
కర్ణాటక సంగీతానికి మూలం తమిళ్. పెరిగింది కన్నడ ప్రాంతంలో. పరిపుష్టమైంది తెలుగు కళాకారులవల్ల. ఆ పరిపుష్టమవడానికి త్యాగయ్య ప్రధానంగా విలసిల్లుతూ తెలుగుకు గర్వకారణమైనారు.
“చల్లని భక్తి”, “స్మరణే సుఖము”, “కులములెల్ల కడతేఱినట్లు”,
“పరమానందమనే కమలముపై” వంటివి అన్న
త్యాగరాజు గొప్పకవి కూడా.
వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది. సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్పకవిత్వం పలికింది.
“భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర / భావజనక నా భావము తెలిసియు…”
“తన తలుపు తీసినట్టి ఒకరింటికి / తాఁ గుక్కల తోలు రీతిగాదో”
“తవిటికి రంకాడబోతె కూటి / తపిల కోతి కొంపోయినట్టుగాదో”
“రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన / యోగము మఱి యనురాగము లేని / భాగవతు లుదర శయనులేగాని…”
“మనసు స్వాధీనమైన యా ఘనునికి / మఱి మంత్రతంత్రములేల”
“యజ్ఞాదులు సుఖమను వారికి సము / లజ్ఞానులు కలరా ఓ మనసా”
“చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో / ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ…”
“ఏఱు నిండి పాఱిన పాత్రకుతగు నీరు వచ్చుగాని”
“లేమి దెల్ప పెద్దలెవరు లేరో”
(ఇది ఇవాళ్టి తెలుగు కవిత్వానికి సరిగ్గా పొసుగుతుంది)
“శాంతము లేక సౌఖ్యము లేదు”
ఇవీ, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు.
రాముణ్ణి “సప్తస్వర నాదాచల దీపం” గా పరిగణించి ఆ వెలుగులో
“సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా” అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు వరం.
కొందరు అనుకుంటున్నట్టుగా త్యాగయ్య బీదరికంలో జీవించ లేదు. మంచి జీవితాన్నే గడిపారు. ఉన్నతమైన వ్యక్తిగా, సంగీత శక్తిగా జీవించారు. త్యాగయ్య తన హృదయాన్ని సాహిత్యంగా మలచి మనకు అందించారు. మనం త్యాగయ్యను చదువుదాం.
తెలుగుతల్లీ,
అదుగోనమ్మా
త్యాగయ్య నాదోపాసన
రవళిస్తున్నది
నీకు భూపాలమై!