ఈనాడు ఇవ్వని మరణాల వార్త … అప్పుడేమైందంటే…

Date:

వార్తకు సోర్స్ ప్రధానం
బ్లో అవుట్ సంఘటనతో ఈనాడుకు క్రెడిబిలిటీ
ఈనాడు – నేను: 29
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)


ఆయిల్ బ్లో అవుట్ హడావుడి అయిన రెండేళ్ల లోపే పాశర్లపూడి సైట్ 19 లో గ్యాస్ బ్లో అవుట్ సంభవించింది. ఇది ప్రపంచంలోనే పెద్ద బ్లో అవుట్ గా అప్పట్లో పేరు తెచ్చుకుంది. జనవరి 8 న సాయంత్రం ఆరున్నర గంటలకు ఏర్పడిన ఈ బ్లో అవుట్ యావద్దేశాన్నీ కుదిపేసింది. రోజుకు వంద క్యూబిక్ మిలియన్ల గ్యాస్ వృధాగా మండిపోయేది.

ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ సంఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారని మిగిలిన పత్రికలన్నీ వార్తను ప్రచురించాయి. కానీ ఈనాడు మాత్రం బ్లో అవుట్ ఘటనకు ప్రాధాన్యత ఇచ్చింది. మృతుల సంఖ్య ఎక్కడా లేదు. బ్లో అవుట్ ఎలా జరిగింది. ఎంత ఎత్తున గ్యాస్ మంట లేచింది. దాని ప్రభావం ఎంత మేరకు ఉంది. ఎలాంటి సహాయ చర్యలు తీసుకున్నారు…. ఇలా ఈనాడు కథనం సాగింది. ఇంత పెద్ద ప్రమాదంలో ఎవరూ చనిపోలేదా? లేదా ఈనాడు మిస్ అయ్యిందా? ఇది అందరి మదినీ తొలిచిన ప్రశ్న. ఆరుగురు చనిపోతే, ఆ వార్తను ఈనాడు మిస్ అయితే, చైర్మన్ రామోజీరావు గారి ఆగ్రహాగ్నిలో యూనిట్ లోని సంబంధితులు కనీసం ఆరుగురిని ఫైర్ చేసేవారు. కానీ అలాంటిదేమీ లేదు. అదే ఈనాడు క్రెడిబిలిటీ. ఈ క్రెడిబిలిటీని కాపాడింది అమలాపురం రిపోర్టర్ ఏ. రామకృష్ణ. అదెలాగంటారా చదవండి మరి…

ఆయిల్ బ్లో అవుట్ సమయంలో రామకృష్ణకు పరిచయమైన ఒక ఒ.ఎన్.జి.సి. ఉద్యోగి అతనికి అందుకు సంబంధించిన వివరాలు అన్నీ చెప్పేవారు. వార్తలు కచ్చితంగా సమర్పించడానికి ఆ ఉద్యోగి ఇచ్చిన సమాచారం ఉపయోగపడింది. ఆ ఉద్యోగి తెలుగు వారు కావడంతో పాటు కోనసీమ ప్రాంతీయుడవ్వడం రామకృష్ణకు కలిసొచ్చింది. ఒ.ఎన్.జి.సి.కి సంబంధించిన అనేక అంశాలను ఆయన అతనితో పంచుకునేవారు. ఇది ఈనాడుకు ఎంతో ఉపయోగపడింది. గ్యాస్ బ్లో అవుట్ సంఘటనపై అనేక వివరాలను ఆయన చెప్పేవారు. బ్లో అవుట్ సైట్ లో రిగ్గుకు దగ్గరగా మూడు దశలలో ఇద్దరు చొప్పున ఉద్యోగులు ఉంటారు. వారు పైపులను దింపడం, అవసరమైతే పైకి తీయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే, ఏర్పడిన సాంకేతిక లోపం బ్లో అవుట్ కు దారితీసింది. పైపులను పైకి తీస్తున్న సమయంలో ఒక పరికరం జారి బోర్ వెల్ లో ఇరుక్కుపోయింది. అది పైపులకు అడ్డుగా మరి, అవి ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. వీటిని బయటకు తీయటానికి లాగే క్రమంలో ఒరిపిడికి పుట్టిన నిప్పు నెరుసులతో గ్యాస్ అంటుకుంది. దీనిని ఎవరూ గమనించలేకపోయారు. ఆ మంట బోర్ వెల్ లోకి దూసుకుని వెడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో పెద్దగా కంపించింది. దీనిని గమనించిన ఆరుగురు ఉద్యోగులు, వేగంగా కిందికి దిగి దూరంగా వెళ్లిపోయారు. వారు దిగారో లేదో… బోర్ వెల్ లో ఉన్న పైపులు పెద్ద శబ్దంతో దూరంగా ఎగిరిపడ్డాయి. అవి కొన్ని కిలోమీటర్ల దూరంలో పడ్డాయి. మరో వైపు భగభగ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇది మాత్రమే మిగిలిన పత్రికలకు తెలుసు. ఉద్యోగులు రిగ్ పైనుంచి దిగేసిన విషయం తెలియదు.

అంతే అదో సంచలనం అనుకున్నారు. పాశర్లపూడిలో బ్లో అవుట్, ఆరుగురి దుర్మరణం అంటూ వార్త ఇచ్చేసి మిగిలిన పత్రికల రిపోర్టర్లు ఇళ్లకు వెళ్లిపోయారు. మరొపక్కన రాత్రి ఏడు గంటల ప్రాంతానికి ఆఫీసుకు వచ్చి కూర్చున్న రామకృష్ణకు బ్లో అవుట్ వార్త తెలిసింది. ఆరుగురు మరణించారన్న సంగతీ తెలిసింది. ఇలాంటి వార్తల విషయంలో రూఢీ చేసుకోవడం ప్రధానం. దినపత్రిక క్రెడిబిలిటీకి అదే ప్రధానం. క్షేత్ర స్థాయిలో తప్పు జరిగిందా అంతే సంగతులు. రూఢీ చేసుకోకుండా వార్తలు ఇవ్వకూడదు అనేది రామోజీరావు గారు చెప్పే ముఖ్యమైన పాఠం. ఇక్కడే రామకృష్ణ చురుకుగా ఆలోచించాడు.. తనకు తెలిసిన సోర్స్ ను కదిపాడు. ఒక్క ప్రాణం కూడా ఈ ఘటనలో పోలేదని ఆ సోర్స్ సుస్పష్టంగా చెప్పింది. ఇక్కడే రిపోర్టర్ సందిగ్ధంలో పడ్డాడు. ఏం పాలుపోక డెస్కుకు ఫోన్ చేశాడు. విషయం చెప్పి, మీ ఇష్టం అన్నాడు. డెస్క్ ఇంచార్జి శర్మ గారికి సందేహం వచ్చింది. అప్పటి జనరల్ డెస్క్ ఇంచార్జి పి.ఎస్.ఆర్. గారికి ఫోన్ ఇచ్చాడు. ఆయన తన స్టైల్ లో ఏమిటి తమాషాగా ఉందా… మాకెలా తెలుస్తుంది. నువ్వు పెట్టమంటే వార్త పెడతాం లేకపోతే లేదు అని కుండబద్దలు కొట్టారు. ఇక్కడే సోర్స్ ను నమ్మి రామకృష్ణ బ్లో అవుట్ వార్త వాడుకోమన్నాడు. అందులో ఆరుగురి మృతి అంశం లేదు. మరుసటి రోజు పొద్దున్న అన్ని పత్రికలూ మృతి వార్త ఇస్తే…. ఈనాడులో కనిపించలేదు. అంతా ఆశ్చర్యం.


అప్పటి ఎమ్.డి. రమేష్ బాబు గారి నుంచి ఫోన్.. ఏమిటి ఇది అని… జరిగింది అంతా పి.ఎస్.ఆర్. గారు చెప్పారు. ఇదే అంశాన్ని నవీన్ గారు కూడా ఒ.ఎన్.జి.సి. అధికారులతో మాట్లాడి రూఢీ చేసుకున్నారు.

ఈనాడు ఇచ్చిందే కరెక్ట్ అని తేలింది. మరుసటి రోజు మిగిలిన పత్రికలు లెంపలు వేసుకున్నాయి. అదీ ఈనాడు క్రెడిబిలిటీ. వార్తకు సోర్స్ ప్రధానం. దీనితో పాటు లెగ్ వర్క్ అత్యంత ముఖ్యం అని సమీక్ష సమావేశాల్లో రామోజీరావు గారు ఎప్పుడూ చెబుతుండేవారు.

వచ్చే ఎపిసోడ్స్ లో బ్లో అవుట్ ను అదుపు చెయ్యడానికి ఒ.ఎన్.జి.సి. ఎలాంటి ప్రయత్నాలు చేసిందీ రాస్తా. దీనితో పాటు కోనసీమ వార్తలకు రామకృష్ణ తరవాత వన్నెలద్దిన రిపోర్టర్ గురించి కూడా.. ఒక రిపోర్టర్ చెబితే పూర్తైన వంతెన కథ రాబోయే భాగాల్లో…

పెళ్లి పీటల నుంచే రిపోర్టింగుకు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...