ఇవాళ రామానుజాచార్య జయంతి.
(రోచిష్మాన్, 9444012279)
రామానుజుల కాలం
“రామానుజాచార్య వంటి హృదయం కావాలి” అని స్వామి వివేకానంద అన్నారు.ఇంతకన్నా రామానుజాచార్యుల వారి గుఱించి చెప్పవలసింది ఏముంది? పండిన హృదయంతో 120 (125 అని కొందరు)యేళ్ల నిండైన, మెండైన మనుగడ చేశారు మహనీయులు రామానుజులు. రామానుజుల కాలం సామాన్య శకం 1017-1137. (ఇందులో కొంత సందిగ్ధత ఉంది)
అదీ రామానుజులు
“ఎవరికీ చెప్పకు, బయటకు చెబితే నువ్వు నరకానికి పోతావు, రహస్యంగా జపించు స్వర్గానికి పోతావు” అని గురువు అష్టాక్షరీని ఇస్తే గుడిపైకెక్కి ఉళ్లో వాళ్లందరినీ పిలిచి బిగ్గాఱగా ఆ మంత్రాన్ని చెప్పేశారు. “ఇలా ఎందుకు చేశావు? నువ్వు నరకానికి పోతావుకదా?” అని గురువు మందలిస్తే “ఈ మంత్రం వల్ల ఇంతమంది స్వర్గానికి వెడతారు కదా అందుకు నేనొక్కణ్ణి నరకానికి పోతాను” అని రామానుజులు అన్నారు. విన్నాక అ గురువు రామానుజుల కాళ్ల మీద పడిపొయారు. అదీ రామానుజులు.
సాంఘీక విప్లవం
సంఘంలో అప్పటికి నిమ్నవర్గాలవారుగా పరిగణించబడుతున్నవారిని అక్కున చేర్చుకుని
తొలి సాంఘీక విప్లవం తెచ్చినవారు రామానుజులు. తన తిరుగుబాటు ధోరణితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు వారు. మూర్ఖులు కొందరు వారిని హతమార్చడానికి ప్రయత్నించారు. 11యేళ్లు అజ్ఞాతంలో గడిపారు రామానుజులు. ఇవాళ అంటరానితనంపై, వివక్షపై చిత్త శుద్ధిలేకుండా వక్రపు మాటలు చెప్పే వంచకులు, దోపిడిదారులూ, కులం పేరుతో సాటి మనిషిపై విద్వేషాన్ని కక్కుతూ సంఘానికే హానికరంగా పరిణమించిన కులోన్మాదులూ రామానుజుల తత్త్వాన్ని చదివి తెలుసుకుని, వారిని ఆదర్శంగా చేసుకుని మామూలు మనుషులవ్వాలి.
పాంచరాత్ర ఆగమం
———————-
రామానుజల తరువాతే వైష్ణవం రాణించింది. రామానుజులది పాంచరాత్ర ఆగమ విధానం.
తిరుమల ఆలయం రామానుజుల చేతికి వెళ్లిన తరువాతే శోభిల్లింది; రాజిల్లింది. తిరుపతి చాల కాలం పాంచరాత్ర ఆగమంలో నిర్వహించబడిన తరువాతే వైఖానస ఆగమంలోకి మారింది. శ్రీరంగం, మేల్ కోట్టై వంటి ముఖ్యమైన క్షేత్రాలు కుడా పాంచరాత్ర ఆగమానికి చెందినవే. రామానుజుల వారు నిర్వహించిన వైష్ణవ ఆలయాలు పాంచరాత్ర ఆగమ ఆలయాలే.
గురువు శూద్రుడు
రామానుజులు జన్మతః వైష్ణవుడు కాదు! వారు జన్మతః స్మార్తులు(తెలుగులో వైదికులు). తమిళ్ష్నాడులో మదురాన్దగమ్ అన్న ఊరిలో ఉన్న కోదండరామ ఆలయంలో రామానుజుల వారికి వారి గురువు పెరియనమ్బి శంఖు చక్రాల్ని వేసి సాంప్రదాయికంగా వైష్ణవంలోకి నడిపించారు. జన్మతః వైష్ణవుడు కాని, స్మార్తుడు ఐన రామానుజులు వైష్ణవ సంప్రదాయ పంచసంస్కార దీక్షను తీసుకుని వైష్ణవుడు అయ్యారు. గురువై రామానుజుల వారిని వైష్ణవుణ్ణి చేసిన పెరియనమ్బి బ్రాహ్మణుడు కాదు; శూద్రుడు!
ఆళ్వారుల కాలం
———————
ఆళ్వారుల కాలం నుండే ఈ వైష్ణవం ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు. రామానుజుల గురువు పెరియనమ్బి, పెరియనమ్బి గురువు ఆళవన్దార్, ఆళవన్దార్ గురువు మణక్కాల్ నమ్బి, మణక్కాల్ నమ్బి గురువు ఉయ్యక్కొణ్డార్, ఉయ్యక్కొణ్డార్ గురువు నాదమునిగళ్. ఈ నాదమునిగళ్ వారిని ఈనాడున్న వైష్ణవానికి ఆదిగా తీసుకోవచ్చు.
రామానుజుల తరువాత ఈనాటి వైష్ణవ సంప్రదాయాలకు ఊపు వచ్చింది. రామానుజుల తరువాత వైష్ణవంలో వేదాంత దేశికులు ప్రధానమైన, ఉన్నతమైన గురువు. అటు తరువాత మనవాళమామునిగళ్ కాలంలో వడగలై (దేశిక సంప్రదాయం), తెన్గలై (తెన్ఆచార్య సంప్రదాయం) ఏర్పడ్డాయి. రామానుజులకు ముందు, రామానుజులకు తరువాత అని వైష్ణవాన్ని పరిగణించాల్సి ఉంటుంది. (బెంగాల్ లో 15వ శతాబ్దిలో చైతన్య ఏర్పఱిచిన గౌడియ వైష్ణవం, వల్లభాచార్యుల రుద్ర సంప్రదాయం, కర్ణాటక ఉడిపిలో 13వ శతాబ్దిలో మధ్వాచార్యుల మధ్వ సంప్రదాయం, నింబారకుల నింబారక సంప్రదాయం వంటివి వైష్ణవంలో ఉన్నాయి.)
నామాలు
రామానుజులు నామాలను ధరించలేదు! ఇవాళ్టి వైష్ణవ సంప్రదాయాలు వారి కాలానికి లేవు. ఆళ్వారులు ఇవాళ మనం చూస్తున్న వైష్ణవ విధానాలకి చెందిన వారు కాదు. రామానుజుల తరువాత 200యేళ్లకు వేదాంత దేశికుల కాలానికి ఇవాళ మనకు తెలుస్తున్న వైష్ణవం రూపొందింది.
వడగలై, తెన్గలై సంప్రదాయాల్లో నుదుటిపై పెట్టుకునే నామాలలో తేడాలున్నాయి. వడగలై నామం U. ఈ U కి కింద చిన్న గీత పెడితే తెన్గలై
నామం అవుతుంది. మాధవా, కేశవా అంటూ నామాలు చెప్పుకుంటూ గీతలు గీసుకోవడం వల్ల ఈ ముద్రలకు నామాలు అని అనడం వచ్చింది. ఇవాళున్న ఈ వైష్ణవనామాలు రామానుజుల కాలంలో లేవు. రామానుజులు ఈ నామాల్ని పెట్టుకుని ఉండరు. ఆయన శ్రీ చందనంతో ఊర్ధ్వ పుండరాన్ని పెట్టుకుని ఉంటారు. వడగలై నామం వేదాంత దేశికర్ దగ్గఱ నుంచీ, తెన్గలై నామం మనవాళ మామునిగళ్ దగ్గఱ నుంచీ మొదలై ఉంటాయి. కర్ణాటక, ఉత్తరాది వైష్ణవ సంప్రదాయంలో శ్రీ చందనంతో ఉర్ధ్వ పుండరమే ఉంది. ఇస్కాన్ వాళ్లు కూడా ఈ నామాన్నే తీసుకున్నారు.
రామానుజుల నామం
ఇవాళ రామానుజల విగ్రహానికి విరివిగా తెన్గలై
నామమే కనిపిస్తోంది. దాన్ని చాల మంది తమిళ్ష్నాడు, కర్ణాటక వడగలై వైష్ణవులు హర్షించడం లేదు. అహోబిల జియ్యర్ వంటి వారు కూడా అంగీకరించినట్టుగా లేదు. స్మార్తుడైన రామానుజులు వైష్ణవుడిగా జీవించారు. రామానుజుల వంటి మహనీయుల్ని తెగలపరంగానూ, నామాలపరంగానూ, లేదా వాటిని వారిపై రుద్దడం భావ్యం కాకపోవడం మాత్రమే కాదు అత్యంత దోషం కూడా.
చినజియ్యర్
చినజియ్యర్ వంటివారు వాస్తవానికి విరుద్ధంగా రామానుజుల విగ్రహాలకు తెన్గలై నామం ది(రు)ద్దడం సరికాదు. చిన జియ్యర్ తెన్గలై సంప్రదాయానికి చెందిన వారు. వడగలై వారు ‘ఉన్నతమైన వైష్ణవులు’ అన్నది రూఢీగా ఉంది. వడగలై సాంప్రదాయీకులు తెన్గలై వాళ్లను మేలైన వైష్ణవులుగా గుర్తించరు. మేలైన వైష్ణవులుగానే కాదు
తెన్గలై వాళ్లను బ్రాహ్మణులుగా కూడా వడగలై సాంప్రదాయీకులు పరిగణించకపోవడమూ ఉంది! మన చినజియ్యర్ గొప్ప, మంచి పనులు చేస్తున్నారు. అందుకు ఆయనకు అభివాదం; ధన్యవాదం. కానీ ఆయన తన ‘నోరు జారు’తో శంకరాచార్యుల విషయంలోనూ, ఇతర విషయాల్లోనూ అభ్యంతరకరమైన, అవాంఛనీయమైన మాటలు వెళ్లగక్కడం సరికాదు. తెన్గలై సంప్రదాయానికి చెందిన ‘చిన జియ్యర్ అసలు బ్రాహ్మణ్యానికే చెందరు’ అని అనే, పరిగణించే వడగలై వారు ఉన్నారన్న స్పృహతో చిన జియ్యర్ మెలగాల్సి ఉంటుంది. రామానుజుల వారి స్ఫూర్తితో చినజియ్యర్ ప్రవర్తించాలి. కొందరు తెన్గలై వైష్ణవులు ఇవాళ వాస్తవాలకు విరుద్ధంగానూ, అవాంఛనీయమైన వివాదాలతోనూ స్మార్తులు, ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. రామానుజుల వారి అనుయాయులుగా తెన్గలై వాళ్లు ఉండాలి. ‘తెగల తగువులు’ కాదు ‘రామానుజల వారి హృదయం’తో వైదిక స్పృహతో చినజియ్యర్, తెన్గలై వాళ్లు సమాజంలో సరిగ్గా మెలగాలి. స్మార్తుడైన రామానుజులు వైష్ణవుడిగా జీవించారు. రామానుజుల వంటి మహనీయుల్ని తెగల పరంగానూ, నామాల పరంగానూ, లేదా వాటిని వారిపై రుద్దడం భావ్యం కాకపోవడం కాదు అత్యంత దోషం కూడా.

నిమ్న వర్గాలు-బ్రాహ్మణులు
——————-‐———–
రామానుజాచార్యులు తన కాలంనాటి నిమ్న వర్గాలు (దళితులు అన్న వాడుక అప్పుడు లేదు) అనబడిన పలువురిని అక్కున చేర్చుకుని వాళ్లను బ్రాహ్మణ్యానికి దగ్గరగా తీసుకు వచ్చారు. రామానుజుల వల్ల వెయ్యేళ్ల క్రితమే బ్రాహ్మణ్యానికి దగ్గరవ్వాలనుకుని దగ్గరైన నిమ్న అనబడిన వర్గాలవారు ఉన్నారు; తమ సామాజిక నిమ్నత్వాన్ని స్వచ్ఛందంగా, ప్రయత్న పూర్వకంగా వదిలేసుకున్నారు. 14-15శతాబ్దుల కాలానికి చెందిన వారు మనవాళ మామునిగళ్ (తెన్గలై సంప్రదాయానికి ఆద్యులు). రామానుజుల స్ఫూర్తితో మనవాళ మామునిగళ్ నిమ్న కులం అనబడుతున్న పలువుర్ని ఉపనయనం ద్వారా బ్రాహ్మణుల్ని చేశారు! ఆయన ద్వారా బ్రాహ్మణులైన పలువురు నిమ్న వర్గాలు అనబడ్డవాళ్లు ఆలయాల అర్చకులయ్యారు. అలా అర్చకులైన వాళ్ల సంతతి 108 దివ్య దేశాలుగా ఉన్న వైష్ణవ ఆలయాల్లో ఇవాళ్టికీ అర్చకులుగా అంటే బ్రాహ్మణులుగా ఉన్నారు. రామానుజుల స్ఫూర్తితో ఐదువందల ఏళ్ల క్రితమే బ్రాహ్మణులం అవాలనుకుని బ్రాహ్మణులైన నిమ్న అనబడిన వర్గాలవారు ఉన్నారు.
తానాన తిరుమేని
శ్రీరంగంలో పరమపదాన్ని పొందారు రామానుజులు. ఆనాటి నుంచీ అంటే వెయ్యేళ్లపైబడ్డ కాలం నుంచీ ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన దేహాన్ని భద్రపరుస్తున్నారు అని మనం వింటూంటాం. కొందఱు అంటున్నట్టుగా, అనుకుంటున్నట్టుగా శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్నది రామానుజుల దేహం కాదు. సనాతన ధర్మంలో ఒక మృత దేహాన్ని ఖననమో, దహనమో చెయ్యకుండా ఉంచరు కదా? దాన్ని రామానుజల దేహం అని అనుకోవడం ఒక నమ్మకంగా ఉంది అంతే. అలా ఉండే అవకాశం లేదు. మృత దేహాన్ని అలా ఉంచెయ్యడం సనాతన శాస్త్రబద్ధం కానే కాదు. మేల్కోట్టైలో ‘తమరుగంద తిరుమేని’ అనీ, శ్రీపెరుంబుదూరులో ‘తానుగంద తిరుమేని’ అనీ శ్రీరంగంలో ‘తానాన తిరుమేని’ అనీ రామానుజుల మూర్తులు ఉన్నాయి. తన జీవశక్తిని ధారపోసి ఈ మూర్తులను రూపొందించి అందరి కోసం అందించారు రామానుజులు. ‘తానాన తిరుమేని’ అంటే తానే అయిన పవిత్రదేహం అని అర్థం. శ్రీరంగంలో ఉన్న ఈ మూర్తి ‘తానాన తిరుమేని’ కాబట్టి అది వారే అన్న అపోహ ప్రాచుర్యంలోకి వచ్చింది. అది రామానుజుల దేహం కాదు; అయ్యుండే అవకాశం ఎంత మాత్రమూ ఉండదు. రామానుజుల వారి గుఱించి అపోహలు, తెగల తగవులు, సామాజిక అనర్థాలు కాదు; రామానుజుల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం, అవగతం చేసుకోవడం, ఆకళింపు చేసుకోవడం కావాలి. తెన్గలై సాంప్రదాయీకులైన వైష్ణవులు తమ బుద్ధి దోషాల్ని రామానుజుల స్ఫూర్తితో వెనువెంటనే తొలగించుకోవాలి.
రండి, రండి
విశిష్టమైన భక్తుడు, నిజమైన సామాజిక విప్లవకారుడు, ఉదాత్తమైన సంస్కర్త, పండిన హృదయంతో పరమోన్నతమైన మనిషి, మహనీయుడు రామానుజులు. రామానుజుల ప్రవర్తన్ను, హృదయాన్ని, జీవితాన్ని, మాటల్ని మనం చదివి తెలుసుకుని అర్థం చేసుకోవాలి. రామానుజుల వారిని చదువుదాం;
రామానుజుల వారిని అర్థం చేసుకుందాం; రామానుజుల వారిని అవగతం చేసుకుందాం; రామానుజుల వారిని ఆకళింపు చేసుకుందాం;
రండి, రండి మనం మేలైన మనుషులమౌదాం.