గాన కళాశాల ఘంటసాల

Date:

డిసెంబ‌ర్ 4 గాన‌గంధ‌ర్వుని శ‌త జ‌యంతి
(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధ‌ర్‌)
తన గానామృతంతో ఆబాలగోపాలాన్ని ఊహల లోకంలో విహరింపజేసిన గాన గంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఘంటసాల అనగానే ఆ మధుర గాయకుడే ప్రతి ఒక్కరి మనసును తాకుతాడు. జీవితంలో అనేక కష్టనష్టాల‌ను చవిచూసి, ఒక్కో మెట్టు ఎదిగి సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గాయక దిగ్గజం. తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని అనేక దశాబ్దాలు తన గాన మాధుర్యంతో ఉర్రూతలూగించిన స్వరబ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరావు. ఆయన భగవద్గీతను వ్యాఖ్యానంతో సహా ఆలపిస్తే.. యావత్ తెలుగు నేలే పరవశించిపోయింది. పద్యాలు, భజనలు, పాటలు, గేయాలు.. ఒక్కటేమిటి ఆయన ఆలపించని ప్రక్రియే లేదు. సంగీత కచేరీలు చేసిన స్థాయి నుండి సినీ నేపథ్యగాయకుడిగా ఎన్నో కీర్తి శిఖరాలు అధిరోహించి.. చరిత్రపుటల్లో లిఖించుకోదగ్గ మేటి సంగీత విద్వాంసునిగా ఘనతకెక్కిన ఘంటసాల జీవితం నేటి కళాకారులకు ఒక గొప్ప పాఠ్యాంశం అనడంలో అతిశయోక్తి లేదు. పాట అంటే ఘంటసాల, ఘంటసాల అంటే పాటగా ఆయన గాన మాధుర్యంతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అమరగాయకుడిగా గుర్తుండిపోతారు. ప్రేమగీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, హుషారు గీతమైనా, కామెడీ పాటైనా… సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో పలికే భావోద్వేగాలను పలికించడం ఆయనకు ఆయనే సాటి. డిసెంబర్ 4న ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామా..!


గాన గంధ‌ర్వుడు ఘంట‌సాల‌
తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సంగీత అభిమానులను, తన సంగీతంతో ప్రేక్షకులను శ్రావ్యానందంలో ఓలలాడించిన ఘన గాన గంధర్వుడు ఆయన. చిత్ర పరశ్రమ తొలినాళ్లలో మధురగానాలపై, సంగీతాలపై తనదైన ముద్ర వేసుకుని.. కొన్ని దశాబ్దాల పాటు అదే ఒరవడి కొనసాగిందంటే కూడా అది ఆయన ఘనతే. ఆయన స్వరం నుంచి కాక మనస్సు నుంచి ఆలపించిన దక్షిణాది చిత్రాలకు చెందిన గాయకుడిగా, మరీ ముఖ్యంగా తెలుగు చలన చిత్రసీమలో ప్రత్యేక ప్రస్థానం ఏర్పరుచుకున్న ఆయన పుట్టుకతోనే గంభీరమైన స్వరాన్ని కలిగివుండటం దైవమిచ్చిన వరమనే అనేక సందర్భాలలో అన్నారాయన.. శాస్త్రీయ, తెలుగుసినీ సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణాకాలంలో తన స్వరంతో గురువుల్ని ముగ్ధుల్ని చేసిన ఆయన.. అనంతరం చిత్రసీమలో అదేవిధంగా ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈయన పాడిన ఆధ్యాత్మిక సంగీతాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పటికీ ఆయన స్వరం నుంచి జాలువారిన పాటలు వినని ప్రేక్షకులు వుండరు.1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో సూర్య నారాయణ, రత్నమ్మ దంపతులకు ఘంటసాల జన్మించారు. తండ్రి సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. సంగీత సభాస్థలికి వెళ్లే సమయంలో ఆయన తనతోబాటు తన కుమారుడు ఘంటసాలను కూడా తీసుకెళ్లేవారు. అక్కడ ఆయన భజనలు వింటూ, పాటలు పాడుతూ, నాట్యం చేసేవారు. అప్పుడు ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అప్పట్లో ‘బాలభరతుడు’ అని పిలిచేవారు. ఇలావుండగా.. ఘంటసాల 11వ ఏటలో ఆయన తండ్రి మరణించారు. మరణానికి కొన్నిరోజులముందు సంగీత గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి, గొప్ప సంగీత విద్వాంసుడిగా అవమని కోరారు. తండ్రి కోరిక మేరకు సంగీతంలో గొప్పపేరు సాధించేందుకు ఆయన అహర్నిశలు ప్రయత్నాలు చేశారు. ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నాడు. పట్రాయని సీతారామశాస్త్రి అనే ప్రముఖ వ్యక్తి.. ఘంటసాల గురించి మొత్తం విషయాలు తెలుసుకుని సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. అలా ఆయన ఇచ్చిన సహాయంతోనే నేడు ఈ స్థానానికి చేరుకోగలిగారు.


స్వాతంత్రీయ సమరయోధుడిగా
విజయనగరంలో నాలుగేళ్ళ సంగీతం కోర్సు పూర్తి చేసి.. తన ఊరికి ఘంటసాల తిరిగి వస్తున్న సమయంలోనే క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రతరం దాల్చింది. ఘంటసాల కూడా గాంధీ భావాలకు ప్రేరేపితుడై.. ఆ ఉద్యమంలో చేరాడు. తన సంగీత కళను దేశభక్తి పాటలు పాడడానికి ఉపయోగించారు. అదే సమయంలో ఉద్యమకారుల నిరసనలను ఆపేందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఎమర్జన్సీ విధించింది. ఆ సమయంలో ఎందరో ఉద్యమకారులతో పాటు ఘంటసాల కూడా అరెస్టు అయ్యారు. ఆయనను ఆలీపూర్ జైలులో నిర్బంధంలో కూడా ఉంచారు
సినీ రంగ ప్రవేశం:
1944లో జైలు నుండి తిరిగి వచ్చాక.. తన మేనకోడలైన సావిత్రిని పెళ్లి చేసుకున్నారు ఘంటసాల. పెళ్లయ్యాక… సంగీత కచేరీలనే తన జీవనోపాధిగా చేసుకుంటూ అనేక ప్రాంతాలను సందర్శించారు ఘంటసాల. అలాంటి సమయంలోనే ఓ కచేరీలో ఘంటసాలను చూసిన ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు.. ఆయన గాత్రానికి ముగ్ధులయ్యారు. చలనచిత్ర పరిశ్రమలోకి రమ్మని ఆహ్వానించారు. సముద్రాల వారే అప్పటి మేటి దర్శకులైన బిఎన్ రెడ్డికి, నటులు చిత్తూరు నాగయ్యకి ఘంటసాలను పరిచయం చేశారు. బిఎన్ రెడ్డి ‘స్వర్గసీమ’ చిత్రంలో తొలిసారిగా ఘంటసాలకు నేపథ్యగాయకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ పాటకు ఆయనకు నూట పదహారు రూపాయలను పారితోషికంగా అందించారు. ఆ తర్వాత నటి భానుమతి తీసిన ‘రత్నమాల’ సినిమాలో కొన్ని పాటలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.


ఘంటసాల ప్రభంజనం
1955 తరవాత ఘంటసాల ప్రభంజనం మొదలైంది. ఆ ఏడాది ఆయన సంగీత దర్శకత్వంలో మొత్తం ఏడు చిత్రాలు విడుదల కావడం విశేషం. వాటిలో నాలుగు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇదే ఏడాది విడుదలైన ‘అనార్కలి’ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చి పెట్టింది. 1956లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘సొంత ఊరు’ చిత్రంతోపాటు కనకతార, చిరంజీవులు, జయం మనదే చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 1957లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన మాయాబజార్, వినాయకచవితి, సతీ అనసూయ, సారంధర చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘మాయాబజార్’ చిత్రం చక్కటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి పెట్టింది. 1958లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘గిరిజా కల్యాణం’ విడుదలైంది. అదే ఏడాది పార్వతీ కల్యాణం, పెళ్లినాటి ప్రమాణాలు, మంచి మనసుకు మంచి రోజులు ఇత్యాది నాలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1959లో సతీ సుకన్య, పెళ్లి సందడి, శభాష్ రాముడు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1960లో విడుదలైన ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’ చిత్రంలో ‘శేషశైలావాస శ్రీ వేంకటేశ’ అనే పాటలో తెరపై కూడా ఘంటసాల స్వయంగా పాడుతున్నట్లు చిత్రించారు. 1961లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన శభాష్ రాజా, శ్రీకృష్ణ కుచేల చిత్రాలు విడుదలయ్యాయి. ఇదే ఏడాది ఆయన అద్భుతంగా పాటలు పాడిన జగదేక వీరుని కథ, భక్త జయదేవ, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగు నీడలు చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 1962లో ఆయన గుండమ్మ కథ, టైగర్ రాముడు, రక్త సంబంధం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అటు గాయకుడిగా, ఇటు సంగీత దర్శకుడిగా ఘంటసాలకు తృప్తినిచ్చిన చిత్రం ‘గుండమ్మ కథ’. 1963లో లవకుశ, ఆప్తమిత్రుడు, బందిపోటు, వాల్మీకి చిత్రాలకు, 1964లో గుడిగంటలు, మర్మయోగి, వారసత్వం, శ్రీ సత్యనారాయణ మహత్మ్యం చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1964లో విడుదలైన అమరశిల్పి జక్కన, ఆత్మబలం, డాక్టర్ చక్రవర్తి, మూగమనసులు వంటి అనేక చిత్రాలు గాయకుడిగా ఘంటసాలకు కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టాయి. 1965లో పాండవ వనవాసం, సిఐడి, 1966లో పరమానందయ్య శిష్యుల కథ, శకుంతల, 1967లో నిర్దోషి, పుణ్యవతి, భువనసుందరి కథ, రహస్యం, , వీరపూజ, 1968లో గోవుల గోపన్న, చుట్టరికాలు, జీవితబంధం, 1969లో జరిగిన కథ, భలే అబ్బాయిలు, 1970లో అలీబాబా నలభై దొంగలు, విజయం మనదే, మెరుపు వీరుడు, తల్లిదండ్రులు, రెండు కుటుంబాల కథ, 1971లో పట్టుకుంటే లక్ష, పట్టిందల్లా బంగారం, రామాలయం, రంగేళీ రాజా, 1972లో మేనకోలు, రామరాజ్యం, వంశోద్ధారకుడు, 1973లో తులసి ఇత్యాది అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970 వరకు ప్రతి పాట ఘంటసాల పాడిందే అన్నా అతిశయోక్తి లేదు. సినిమాలకు సంబంధం లేకుండా దైవ భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు, ఖండకావ్యాలు ఎన్నో ఆలపించారు. మహాకవులు గురజాడ అప్పారావు రచించిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ‘పొలాలన్నీ హలాల దున్ని’ ‘ఆనందం అర్ణవమైతే’ అనే గేయాలు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ‘పుష్పవిలాపం’ ‘కుంతీకుమారి’ ఇత్యాది ఖండకావ్యాలకు సంగీతం సమకూర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరఫున వంద అన్నమాచార్య కీర్తనలను పాడారు. దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలలో కచేరీలు చేసి ప్రజల ప్రశంసలందుకోవడంతోపాటు లెక్కలేనన్ని కళాసంస్థల, ప్రజా సంఘాల సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. అప్పటి రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణ సమక్షంలో ఘంటసాల పాడి ప్రశంసలందుకున్నారు. జగదేక‌వీరుని కథ చిత్రంలో ‘శివశంకరి’ అనే పాటను 14 రోజుల పాటు రిహార్సల్స్ చేసిన పిదప ఒకే టేక్లో రికార్డింగ్ జరిపించిన గాయక దిగ్గజం ఘంటసాల.


పద్మశ్రీ పురస్కారం:
26 జనవరి 1970లో గణతంత్ర దినోత్సవం నాడు ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అప్పటి రాష్టప్రతి వి.వి.గిరి చేతుల మీదుగా ఘంటసాల పద్మశ్రీ అందుకున్నారు. 1971లో అమెరికా, ఐరోపా దేశాలలో పర్యటించి కచేరీలు చేసి సంగీత ప్రియులను అలరించారు. అమెరికా వెళ్లి ప్రవాస భారతీయుల కోసం ఆయన పాడిన రఘుపతి రాఘవ రాజారాం, హరేరామ, హరేకృష్ణ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
క‌ర్చీఫ్ లేకుండా పాడ‌టం ఎలా..
• తన సుమధుర గానంతో ప్రేక్షకులను రంజింప చేసిన అలనాటి గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన పాటల రికార్డింగ్కు వెళ్తే, చేతిలో కర్చీఫ్ ఉండాలట. పొరబాటున మరచిపోతే ‘కర్చీఫ్ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. అలాగే పాడేటప్పుడు కుడి చెవిని కుడి చేత్తో మూసుకోవడం ఆయన అలవాటు. అలా అయితేనే తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని ఆయన అభిప్రాయం. ఒకసారి ఏదో సమస్య వచ్చి తన పాట తనచెవికి వినిపించనట్లు అనిపించి ఘంటసాల వైద్యపరీక్షకు వెళ్లారట. పరీక్షించిన వైద్యుడు ‘అదేమంత ఇబ్బంది కాదు సర్దుకుంటుంది. పాడేందుకు గొంతు అవసరం. మీ గొంతు బాగానే ఉందిగా?’ అన్నారట. అందుకు ఘంటసాల అంగీకరించలేదట. తన చెవికి తన పాట వినిపించే దాకా పదిరోజుపాటు రికార్డింగ్లకు వెళ్లలేదట. వైద్యుడు చెప్పినట్లుగానే చెవి సమస్య దానంతట అదే సర్దుకొందట.

జీవిత చ‌క్రం పాట‌ల రికార్డింగ్ బొంబాయిలో

• నవశక్తి ప్రొడక్షన్స్ వారు ఎన్టీఆర్, వాణిశ్రీ, శారద ప్రధాన తారాగణంగా సి.ఎస్. రావు దర్శకత్వంలో జీవిత చక్రం (విడుదల 31-3-1971) చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న రోజులవి. కొత్తదనం కోసం ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులైన శంకర్-జైకిషన్ను ఆ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చమని కోరారు. ఆరుద్ర, డా||సి.నా.రె పాటలు రాశారు. బొంబాయిలో పాటల రికార్డింగ్ కోసం మద్రాస్ నుంచి గాయనీ గాయకుల్ని పిలిపించారు. విమానంలో ఘంటసాల బొంబాయి చేరుకున్నారు. శంకర్-జైకిషన్లు ఘంటసాలకి స్వాగతం పలికారు. శంకర్ హైదరాబాదీ కావడంతో ఆయనకు తెలుగు భాష తియ్యదనం, ఘంటసాల గొప్పదనం వగైరాలు తెలుసు. ఘంటసాల రికార్డింగ్ థియేటర్లోకి అడుగు పెట్టగానే అక్కడున్న బొంబాయి ఆర్కెస్ట్రా జనం ఆశ్చర్యపోయారు. కారణం ఘంటసాల వేషధారణ అతి సామాన్యంగా ఉంది. తెల్లని లాల్చీ, లుంగీ, సాధారణమైన ఆకు చెప్పులతో ఉన్న ఘంటసాలలో సెలెబ్రిటీ లక్షణాలు బొత్తిగా కనిపించలేదు. ఆయన్ని చూడగానే ‘ఈ లుంగీవాలా ఏం పాడతాడు లే!’ అని బొంబాయి వాలాలు గుసగుసలుపోయారట.

ఘంటసాల తెలుగు పాటల్ని పరిశీలించారు. శంకర్-జైకిషన్లతో మాట్లాడి ట్యూన్స్ తెలుసుకొన్నారు. చిన్న రిహార్సల్ వేసుకొని, రెడీ అంటూ టేక్ కోసం మైక్ ముందు నిల్చున్నారు. రికార్డింగ్ థియేటర్లో సైలెన్స్… ఘంటసాల తన గంభీరమైన గొంతును విప్పారు. బొంబాయిలోని అత్యంత ఆధునికమైన రికార్డింగ్ యంత్రాలు ఒక్కసారి ప్రతిధ్వనించాయి. అంత వరకు ఈ లుంగీ వాలా ఏం పాడతాడు లే! అని లైట్ గా తీసుకొన్న బొంబాయి ఆర్కెస్ట్రా వారికి చెవిలో సముద్రపు హోరులాగా ఘంటసాల మాస్టారి గొంతు వినిపించింది. రికార్డింగ్ పూర్తయింది. పాట బ్రహ్మాండంగా వచ్చిందంటూ శంకర్-జైకిషన్లు ఘంటసాలని అభినందించారు. దాంతో తల దించుకోవడం ఆర్కెస్ట్రా సభ్యుల వంతయింది. ఇందులో ఘంటసాల మొత్తం నాలుగు పాటలు పాడారు. ‘కళ్లలో కళ్లు పెట్టి చూడు’, ‘మధురాతి మధురం మన ప్రేమ’, ‘సుడి గాలిలోన దీపం కడవరకూ’, ‘కంటి చూపు చెబుతోంది’ పాటలు ఆల్టైమ్ హిట్గా నిలిచాయి. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...