Monday, March 27, 2023
HomeArchieveడిగ్రీ చ‌ద‌వాలంటే ఏపీ రావాల‌నే స్థాయికి ఎద‌గాలి: జ‌గ‌న్‌

డిగ్రీ చ‌ద‌వాలంటే ఏపీ రావాల‌నే స్థాయికి ఎద‌గాలి: జ‌గ‌న్‌

విద్యా శాఖ ఉన్న‌తికి పటిష్ఠ కృషి
జిఇఆర్ గ‌ణ‌నీయంగా పెర‌గాలి
విద్యార్థులు అన్ని విభాగాల‌లో ప్రావీణ్యం సాధించాలి
ఉన్న‌త విద్యా శాఖ స‌మీక్ష‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
అమరావతి, ఏప్రిల్ 29:
గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ( జీఈఆర్‌) గణనీయంగా పెరగాలని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభిల‌షించారు. ఇందుకోస‌మే విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఉన్నత విద్యపై క్యాంప్‌ కార్యాలయంలో శుక్ర‌వారం ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్‌ మెంట్‌ను విద్యా దీవెన కింద అమలు చేస్తున్నామ‌నీ, వసతి ఖర్చులూ పెట్టుకోలేక చదువులు ఆపేసే పరిస్థితులు ఉండకూడదనీ తెలిపారు. అందుకే వసతి దీవెన ప‌థ‌కాన్ని అమలు చేస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు. గతంలో కన్నా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్ రేషియో( జీఈఆర్‌) పెరిగిన మాట వాస్తవమేన‌న్నారు. దీంతో మనం సంతృప్తి చెందకూడదు, జీఈఆర్‌ 80శాతానికి పైగా ఉండాలని సీఎం కోరారు. ఉద్యోగాలను కల్పించే దిశగా కోర్సులకు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ఆదేశించారు. ఇప్పుడున్న కోర్సులకు సంబంధించి అనుబంధకోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలన్నారు.
క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ పెంచాలి
కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు ఇంగ్లిషుపై పట్టు, ప్రావీణ్యం విద్యార్థులకు రావాలనీ, వీటిపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలనీ జ‌గ‌న్ ఆదేశించారు. జీఆర్‌ఈ, జీ మ్యాట్‌ పరీక్షలకు కూడా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఫీజురీయింబర్స్‌ మెంట్, వసతి దీవెన ప‌థ‌కాల‌ను ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికీ ఇస్తున్న విష‌యాన్ని గుర్తుచేశారు.
అబ్బాయి చదువుకుంటే చాలంటూ అమ్మాయిలను నిర్ల‌క్ష్యం చేసే పరిస్థితులు ఉండేవి, వీటిని అధిగ‌మించేందుకే అందరికీ కూడా విద్యాదీవెన, వసతి దీవెన వర్తింప చేస్తున్నమ‌ని చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారనీ, ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలనీ సీఎం ఆదేశించారు.


కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. రాష్ట్రంలో 4–5 యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని, దేశంలో ఉత్తమ యూనివర్శిటీల స్థాయికి తీసుకెళ్లాలని అధికారుల‌ను ఆదేశించారు. దీన్నొక ల‌క్ష్యంగా చేసుకుని సాగాల‌న్నారు. పట్టభద్రులకు 10 నెలల ఇంటర్న్‌షిప్ త‌ప్ప‌ని స‌రి చేయాల‌ని సూచించారు. ఇది కోర్సులో భాగం కావాల‌న్నారు. మూడు విడతల్లో ఇంటర్న్‌షిప్‌. మొదటి ఏడాది 2 నెలలు, రెండో ఏడాది 2 నెలలు, మూడో ఏడాది 6 నెలల ఇంటర్న్‌షిప్ ఉండాల‌న్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్యకాలేజీల్లో కూడా ఇంటర్న్‌షిప్‌ కోసం ఏర్పాట్లు చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉండాలనీ, జూనియర్‌ కాలేజీని డిగ్రీ కాలేజీ స్థాయికి పెంచాల‌నీ సూచించారు. నాడు – నేడు కింద ఈ పనులు చేపట్టాలన్నారు.


అత్త్యుత్తమంగా డిగ్రీ విద్య…
ఈ కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను ఏర్పాటుచేయాల‌ని ఆదేశించారు. చదువులు ఏదోరకంగా సాగితే చాలు అన్నవాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే భావన ఇవాళ దేశంలో ఉందన్నారు. విదేశాల్లో డిగ్రీ అన్నది చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారని చెప్పారు. మన రాష్ట్రంలో కూడా డిగ్రీకోర్సులను సమర్థవంతంగా మార్చేందుకు కృషి చేయాల‌ని కోరారు.
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీకాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలని జ‌గ‌న్ సూచించారు. ఇందులో మంచి పరిజ్ఞానం ఉన్నవారిని ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలని కోరారు. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలని ఆయ‌న అభిల‌షించారు.


బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌…
టీచింగ్‌ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్ ఆదేశించారు. టీచింగ్‌ స్టాఫ్‌ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదన్నారు. ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. సమర్ధు్లైన వారిని, ప్రతిభ ఉన్నవారిని టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలని కోరారు. వారికీ పరీక్షలు నిర్వహించి… ఎంపిక చేయాలని సూచించారు. టీచింగ్‌ స్టాఫ్‌ కమ్యూనికేషన్ల నైపుణ్యాన్నికూడా పరిశీలించాలన్నారు. యూనివర్శిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులనున‌ సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్, ఆర్‌జీయూకెటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె సి రెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె హేమ చంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ