నైపుణ్యం లేని సర్టిఫికెట్స్ ఎందుకూ కొరగావు
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలి
ఏటీసీల ప్రారంభోత్సవంలో యువతకు సీఎం పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 27 : తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఐ.టి.ఐ. లో 65 ఏ.టి.సి.లను సీఎం దృశ్య మాధ్యమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదట 1956 లో ఐటీఐలను ప్రారంభించారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచనను గత ప్రభుత్వాలు చేయలేదని విమర్శించారు.

కోర్సులను అప్ గ్రేడ్ చేయకపోవడంతో ఐటీఐలు క్రమేణా నిర్వీర్యమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలని ఆలోచించామనీ, అందులో భాగంగానే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చామని సీఎం తెలిపారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. సాధించలేనిది ఏదీ లేదన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇప్పుడు ప్రారంభించిన 65 ఏటీసీలే నిదర్శనమని సీఎం చెప్పారు. వీటిని పూర్తిచేసి, మరో 51 ఏటీసీలను మంజూరు చేశామనీ, వీటి నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేస్తామని తెలిపారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని స్పష్టం చేశారు. యువతలో నైపుణ్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

సాంకేతిక నైపుణ్యంపై ఫోకస్ పెడితే… జర్మనీ, జపాన్ లు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుందని ఆయన తెలిపారు. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుందన్నారు. అది మీ చేతుల్లోనే ఉందని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని ఉపయోగించుకుని.. సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలని రేవంత్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

డ్రగ్స్, గంజాయి ఈ సమాజానికి పట్టిన చీడలని అంటూ, వ్యసనాలకు బానిసలై, తల్లిదండ్రులకు బాధను మిగల్చవద్దని హితవు పలికారు. ఏటీసీలలలో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రంటీస్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సూచిస్తున్నానని చెప్పారు. ఏటీసీలలో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2 వేలు స్కాలర్ షిప్ అందించేలా ఆర్ధిక మంత్రిని ఒప్పించి ఇప్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

మీ సోదరుడిగా మీ భవిష్యత్ కోసం మేం ప్రణాళికలు వేస్తున్నానానీ, మన యువతకు జపనీస్ భాషను నేర్పి అక్కడ ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు జపాన్ కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. మనిషికి తెలివి, నిబద్ధత ఉంటే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని రేవంత్ తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, మీ భవిష్యత్ కు పునాదులు వేస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.













