అన్నమయ్య అన్నది-29
(రోచిష్మాన్, 9444012279)
“ఇదియే వేదాంత మిందుకంటె లేదు
ఇదియే శ్రీవేంకటేశుని మతము”
ఇదే వేదాంతం ఇందులో ఉన్న దానికంటే ఇంకొకటి లేదు. ఇదే పరమాత్ముడి (శ్రీవేంకటేశుని) మతం అని అంటూ ఏది చెప్పబడాలో దాన్ని, అది ఎలా చెప్పబడాలో అలా సరైన తెలివిడితో చెప్పడం మొదలుపెట్టారు ఆన్నమయ్య ఈ సంకీర్తన రూపంలో.
వేదంలోని చివరి భాగాన్ని ఉపనిషత్ అంటారు. ఉపనిషత్ అంటే బ్రహ్మజ్ఞానం. “వేద శిరోభాగం” అనీ, “వేదాంతం” అనీ ఉపనిషత్ను అంటారు. ‘సద్’ అంటే కూర్చోవడం అని అర్థం. ఆ సద్కు ‘ఉప’ అన్న ఉపసర్గ, ‘ని’ అన్న ఉపసర్గ కలిశాయి. ‘ఉప’ అంటే “దగ్గరితనం” అనీ, ‘ని’ అంటే నిష్ఠ అనీ సూచ్యార్థాలు. గురువు దగ్గర నిష్ఠతో కూర్చుని నేర్చుకున్నది ఉపనిషత్ అవుతుంది. ఉపనిషత్ అన్న శబ్దానికి ఇది వాచ్యార్థం.
అవిజ్ఞేయ (mystic or esoteric) జ్ఞానానికి లేదా మార్మిక జ్ఞానానికీ, ఆధ్యాత్మిక విషయానికీ మూలం ఈ ఉపనిషత్తులే. ఉపనిషత్తులు ఆత్మ , పరమాత్మల ఉనికిపై ఆవశ్యకమైన అవగాహనను అందిస్తాయి. ఈ విషయంలో ఉపనిషత్తులకు సాటిరాగల సాహిత్యం ప్రపంచంలో మఱెక్కడా లేదు. ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఈ మూడూ ప్రస్థానత్రయం. బ్రహ్మ సూత్రాలు న్యాయ ప్రస్థానం; భగవద్గీత స్మృతి ప్రస్థానం; ఈ ఉపనిషత్తులు శ్రుతి ప్రస్థానం.
వేద కాలం నాటికి భారత ప్రదేశంలో మతం అన్నదే లేదు. ప్రపంచంలో మతం అన్నదే లేని ప్రదేశం వేద కాల భారతదేశం! మతం లేకుండా భగవచ్చింతనతో వేద కాల భారతదేశం ప్రశాంతంగా ఉండేది!!
మతం అన్న పదానికి ఇంగ్లిష్ ప్రత్యామ్నాయ పదం religion. ఇది లాటిన్ భాష పదం. Religion అంటే ‘కలిపి కట్టడం’ అని అర్థం. దేనితో కలిపి కట్టడం? భగవంతుడితో కలిపి కట్టడం. అంటే మనిషిని భగవంతుడితో కలిపి కట్టేది మతం. మఱేదీ మతం కాదు. వేదాంతంలో ఏదైతే ఉందో అది మనిషిని భగవంతుడితో కలిపి కట్టేది. అదే మతం అంటే; అది మాత్రమే మతం.
“విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియే పో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వెనక వారెల్ల
విరతిఁ బొందకున్న వీడదు భవము”
విరతి అంటే ఐహిక లేదా విషయ సఖాల్లో అపేక్ష లేకపోవడం. విరతి అన్నదే లాభం, సుఖం, విజ్ఞానం. వెనకటి వాళ్లు ఈ విరతివల్లే గొప్ప వాళ్లయ్యారు. ఈ విరతి అన్నది రాకుంటే పాపం (భవము) వీడిపోదు అంటున్నారు అన్నమయ్య మొదటి చరణంలో.
అష్టావక్ర గీత (శ్లోకం 2) లో “ముక్తి మిచ్ఛసి చేత్తాత, విషయాన్విషవత్వజ” అని చెప్పబడ్డది. అంటే నాయనా, నువ్వు ముక్తిని వాంఛిస్తూ ఉంటే విషయాలను విషంలా వదిలేసెయ్ అని అర్థం.
ఎందుకు విరతి అన్నది మనిషికి అవసరం? సరైన సమాధానం భగవద్గీత (అధ్యాయం 5 శ్లోకం 22)లో ఇలా చెప్పబడ్డది. “యే హి సంస్పర్శజా భోగాః దుఃఖ యోనయ వీవ తే / ఆద్యంత వంతః కౌంతేయ న తేషు రమతే బుధః” అంటే ఓ కౌంతేయా, విషయాలవల్ల కలిగే భోగాలు ఏవైతే ఉన్నాయో అవి దుఃఖానికే కారణాలు. అవి ఆది, అంతాలు కలవి. కనుక జ్ఞాని వాటిల్లో రమించడం లేదు అని అర్థం. ఆ రమించకపోవడమే విరతి అవుతుంది. ఆ విరతినే ఇక్కడ ఆన్నమయ్య చెబుతున్నారు.
“చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్ష సిద్ధియును
చిత్తము వలెనే శ్రీహరి నిలుచును
చిత్త శాంతి లేక చేరదు పరము”
పాప, పుణ్యాలకు మనసే కారణం అనీ, మోక్షసిద్ధి కూడా మనసువల్లే వస్తుంది అనీ, మనఃస్థితికి తగినట్టుగానే భగవంతుడు తెలియవస్తాడు అనీ, మనసులో శాంతి లేకపోతే పరం అన్నది రాదు అనీ తెలియజెప్పారు అన్నమయ్య. ఇక్కడ పరము అన్న పదం శ్రేష్ఠత్వం అన్న అర్థాన్నీ ఇస్తోంది.
మొదటి చరణంలో విరతి (వైరాగ్యం) గుఱించి చెప్పి ఈ రెండవ చరణంలో మనసు గుఱించి చెప్పారు అన్నమయ్య. విరతి లేదా వైరాగ్యం వల్ల స్వాధీనమైన మనసుకు తగ్గట్టుగా భగవంతుడు నిలుస్తాడు ఆ మనసులో శాంతి లేకపోతే పరం అన్నది రాదు అని సూటిగా తెలియజేశారు అన్నమయ్య.
భగవద్గీత (అధ్యాయం 6 శ్లోకం 35)లో ఇలా చెప్పబడింది: “అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహమ్ చలమ్/ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే” అంటే అర్జునా, సందేహం లేదు మనసును నిగ్రహించడం చాల కష్టం. అది కదులుతూండేది. అభ్యాసంవల్లా, వైరాగ్యంవల్లా అది స్వాధీనం అవుతుంది అని అర్థం.
“న హ్యస్త్య విద్యా మనసోऽతిరిక్తా మనోహ్య విద్యా భవబన్ధ హేతుః” అని (వివేకచూడామణి శ్లోకం 171 లో) ఆదిశంకరచార్య చెప్పారు. అంటే మనసుకన్నా వేఱైన అజ్ఞానం లేదు కదా? అజ్ఞాన రూపమైన మనసు కదా సంసార బంధానికి కారణం అని అర్థం.
ఒక పూర్వ సంస్కృత శ్లోకం ఇలా చెబుతోంది: “వాయునాన్ నీయతే మేఘః పునస్తే నైవ నీయతే / మనసా కల్ప్యతే బన్ధో మోక్షస్తే నైవ కల్ప్యతే” అంటే గాలి చేత తీసుకురాబడ్డ మేఘాలు ఆ గాలివల్లే చెదర గొట్టబడుతున్నాయి. అలాగే మనసువల్ల కల్పించబడ్డ బంధం మనసువల్లే తొలగించబడాలి. మనసువల్లే మోక్షం కల్పించబడుతుంది అని అర్థం.
ఇక్కడ చిత్తాన్ని గుఱించి అన్నమయ్య మాటల్ని తెలుసుకున్నాక ఒకసారి ఇంగ్లిష్ కవి మిల్టన్ జాన్ (Milton John) మాటల్ని కూడా నెమరేసుకుందాం. “The mind is its own place, and in itself can make a heaven of hell, or a hell of a heaven”.
“ఎంత చదివినా యెంత వెదికినా
ఇంతకంటె మఱి యిఁక లేదు
ఇంతకంటె శ్రీవేంకటేశు దాసులౌట
ఎంతవారికైన యిదియే తెరువు”
ఎంత చదివినా, ఎంత వెతికినా మొదటి, రెండు చరణాల్లో చెప్పబడ్డ దానికంటే మఱి మించినది (ఇఁక) లేదు; అంతకు మించినది లేదు కనుక భగవంతుడికి (శ్రీవేంకటేశు)దాసులవడమే; ఎంత వారికైనా ఇదే మార్గం అని చెబుతూ సంకీర్తనను ముగించారు అన్నమయ్య.
అనూచానంగా వస్తున్న ఒక సంస్కృత శ్లోకం ఇలా చెబుతోంది: “లోకానువర్తనం త్యక్త్వా , త్యక్త్వా దేహానువర్తనం / శాస్త్రానువర్తనం త్యక్త్వా , స్వాధ్యాసాపనయం కురు” అంటే లోకాన్ని అనుసరించడం వదిలేయ్యి; దేహాన్ని అనుసరించడం వదిలేయ్యి; శాస్త్రాన్ని అనుసరించడం వదిలెయ్యి; నేను ఆన్న భ్రాంతిని వదిలెయ్యి అని అర్థం.
భగవంతుడికి దాసులవడమే చెయ్యాల్సింది. భగవంతుడికి దాసులవడాన్నే వేదాంతం బోధిస్తోంది. అలా అవడమే మతం. మఱింకేదీ మతం కాదు.
స్వామి వివేకానంద మతం అంటే ఏమిటో ఇలా చెబుతున్నారు: “మతం అనేది పుస్తకాలలో లేదు సిద్ధాంతాలలో లేదు, విశ్వాసాలలో లేదు,
మాట్లాడడంలో లేదు, తర్కంలో కూడా లేదు. అది ఒక స్థితి ఆపై రూపొందడం. ఓ నా మిత్రులారా, మీలో ప్రతి ఒక్కరూ ఋషి అయేంత వఱకూ, మత వాస్తవాలను కలుసుకునేంత వఱకూ మతం జీవితం మీకు మొదలవదు” (Religion is not in books, nor in theories, nor in dogmas, nor in talking, not even in reasoning. It is being and becoming. Ay, my friends, untill each one of you has become a Rishi (Sage) and come face to face with spiritual facts, religious life has not began for you). వివేకానందుల వారి ఈ మాటలను మనం అత్యవసరంగా అవగతం చేసుకోవాలి; ఆకళింపు చేసుకోవాలి; చేసుకుందాం.
విరతి లేదా వైరాగ్యం… ఆ విరతి ఉన్న చిత్తం లేదా మనసు ద్వారా మోక్షసిద్ది కలుగుతుంది అన్నదే వేదాంతం అనీ, అంతకు మించింది లేదు అనీ, అదే భగవంతుడి మతం అనీ, ఆపై భగవంతుడికి దాసులవడమే మార్గం అనీ తేటతెల్లం చేస్తూ తనరారుతూ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

