భావాన్ని‌ భాషతో‌ కవిత్వంగా‌ మలచగల రహస్యం తెలిసిన కవి

1
309

(రోచిష్మాన్, 9444012279 )

శ్రీశ్రీ జయంతి ఇవాళ.

భావాన్ని‌ భాషతో‌ కవిత్వంగా‌ మలచగల రహస్యం తెలిసిన కవి. “ఎఱుక‌వల్ల‌ మహాకవి కావచ్చు, లేదా ఎఱుక వల్లే‌ మహాకవి అవడం జరుగుతుంది” అన్న సత్యానికి వ్యక్తీకరణ శ్రీశ్రీ. సంస్కృత, తెలుగు కవిత్వ అధ్యయనం, విశ్వకవిత్వ అధ్యయనం శ్రీశ్రీని మహాకవి శ్రీశ్రీని చేశాయి. గురజాడకన్నా చాల గొప్ప కవి శ్రీశ్రీ.

పదం విలువతో అర్థాన్ని చెప్పారు శ్రీశ్రీ;
అర్థం‌ విలువను పదంతో చూపారు శ్రీశ్రీ.

శ్రీశ్రీ రాసిన కవితా! ఓ‌ కవితా!, భిక్షు వర్షీయసి, కేక, ఒక రాత్రి , ఆకాశదీపం, ఆః వంటి కవితలు అంతర్జాతీయ స్థాయి కవితలు.

శ్రీశ్రీ తెలుగుకు సరిగ్గా తెలియరాలేదు. గత 50‌యేళ్లుగా పతనమవుతూ వస్తున్న తెలుగు కవిత బాగుపడాలంటే శ్రీశ్రీని అపార్థం కాదు సరిగ్గా అర్థం చేసుకోవడం తెలుగుకు ఎంతో అవసరం.

శ్రీశ్రీ రాసిన‌‌ కవితా! ఓ కవితా! కవిత ప్రపంచంలో వచ్చిన‌ మహోన్నతమైన కవితల్లో ఒకటి. US, UK ల నుంచీ, వేఱు పలు దేశాల‌ నుంచీ పుస్తకరూపంలో వచ్చి నా దగ్గరున్న 15,000 పైబడి విశ్వ కవితల్ని చదివాక నేను చెప్పగలుగుతున్నా… శ్రీశ్రీ కవితా! ఓ కవితా! ఒక విశ్వస్థాయి‌‌ విశేషమైన కవిత.

ఎఱుక వల్ల‌‌ శ్రీశ్రీ‌ గొప్ప కవి అయ్యారు. సంస్కృతంలో ఉన్నదాన్నీ, అంతర్జాతీయంగా ఉన్నదాన్నీ బాగా‌ తెలుసుకున్నాక‌ శ్రీశ్రీ గొప్పకవి అయ్యారు. అంతర్జాతీయ కవిత్వం ప్రభావంతో ఆయన తెలుగులో రాశారు. ఆయన కమ్యూనిజమ్ భావజాలంతో గొప్ప కవి కాలేదు. విశ్వంలో ఉన్న గొప్ప కవిత్వం మీద అవగాహనతో ఆయన గొప్పకవి అయ్యారు. కమ్యూనిజమ్ అన్న రంగును పూసుకున్నాక ఒక affected man అయిపోయాక శ్రీశ్రీ కవిగా పతనమయ్యాడు. మహాప్రస్థానం తరువాత ఆయన కవిత్వం స్థాయి పతనమవడం తెలిసిందే.

“శబ్దార్థాల సముచిత సహభావం ఉన్న విద్యే సాహిత్య విద్య” అన్నాడు 10వ శతాబ్ది లాక్షణికుడు రాజశేఖరుడు. ఈ మాటకు నిలువెత్తు ఉదాహరణ శ్రీశ్రీ.

ఎనిమిది‌ మాత్రల ఆదిశంకరుల “భజగోవిందం” నడక ఏం చెయ్యగలదో శ్రీశ్రీ “మరో ప్రపంచం” అంటూ మనకు తెలియజేశారు. “పొలాలనన్నీ హలాల దున్నీ” కవిత కూడా ఈ ఎనిమిది‌ మాత్రల‌ సొగసే. ఆ నడకే తెలుగు కవితను కదిలించిన నడక. అసలు కదిలేది‌ కదిలించేదే కవిత. సంప్రదాయ, అంతర్జాతీయ‌ కవిత తనను కదిలించాక శ్రీశ్రీ తెలుగు కవితను కదిలించారు.

“వస్తున్నాయ్ వస్తున్నాయ్…” అంటూ “సంభవామి‌‌ యుగే యుగే” ని తీసున్నారు. “పదండి ముందుకు …” అంటూ Bercht వ్రాసిన‌ “forward…” ను తీసుకున్నారు‌. “మాటలు‌‌ శ్మశానాల వంటి‌‌…” అంటూ ఆది శంకరుల‌ “శబ్దజాలం మహారణ్యం….” ను తీసుకున్నారు శ్రీశ్రీ.‌ తనకు పూర్వం ఏముందో‌ చదివి‌ తెలుసుకోవడం అన్నది‌ శ్రీశ్రీని మహాకవిని చేసింది.

సంప్రదాయం‌‌, అంతర్జాతీయ భావజాలం సమ్మిళతమై శ్రీశ్రీ‌ కవిత్వం‌ అయింది.

అవతలి గట్టు, ఆః వంటి అపూర్వమైన, అద్వితీయమైన కవితలు రాశారు శ్రీశ్రీ. తెలుగు కవితను కదిలించిన శ్రీశ్రీని అంతర్జాతీయ కవిత్వం‌‌ కదిలించింది.

“ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి” అన్నారు..ఇంత‌‌గొప్పవి ఇంకెన్నో అన్నారు.
అలాంటివి, అంతలాంటివి అన్నందుకే శ్రీశ్రీ మనతో ఇంకా ఉన్నారు‌.

“ఉరితియ్యబడ్డ శిరస్సు‌ చెప్పిన రహస్యం” శ్రీశ్రీ అన్న ఈ మాటలు గొప్పవి.‌ఈ‌ మాటలు అన్నందుకు‌ శ్రీశ్రీ గొప్ప కవి. “ప్రాణావసానవేళాజనితం నానాగానానూన స్వానావళితం”… ఒక అభివ్యక్త్యద్భుతం.

“సర్గ విలయ‌ హేమంత వసంత/ధ్వాంత కాంతి విక్రాంతి వేళలో ” అనీ, “ఆరిన కుంపటి విధాన/ కూర్చున్నది ముసిల్దొకతె” అనీ, “ఆ అవ్వే మరణిస్తే/ ఆ పాపం ఎవ్వరిదని/ వెర్రిగాలి ప్రశ్నిస్తూ‌/ వెళ్లిపోయింది” అనీ తాను మాత్రమే‌ అనగలిగిన ఇవీ,‌ ఇంకొన్నీ అని శ్రీశ్రీ ఒక మహాకవి అయ్యారు.

ప్రకృతి గీత అనే పద్య కవితలో ఒక పద్యం ఇలా రాశారు…
ఇది నవోజ్జ్వల మమృత రసైక మధుర
మిది మనోహర మానంద సదన మిద్ది
ఈ ప్రకృతి గర్భ కుహర కాంతి ప్రసార
వీచికా మార్దవమునకు వివశమతిని.

శ్రీశ్రీ ఝంఝు అనే కవితలో “పాతని బతికించడానికి / కొత్త చిట్కాలు వెతుకుతున్నారు/ కొత్తని హతమార్చడానికి / పాత కత్తులు‌ నూరుతున్నారు” అని అంటారు. ఖడ్గసృష్టి‌ కవితలో “రావోయి రావోయి లోనికి / రాసేది రవ్యుష్ణ గీతి / చేసేది పవ్యుగ్సహేతి” అని అంటారు‌. శరచ్చంద్రిక కవితలో ” ఇదిగో జాబిల్లీ నువ్వు / సముద్రం మీద సంతకం చేసేటప్పుడు / గాలి దాన్ని చెరిపెయ్యకుండా / కాలమే కాపలా కాస్తుందిలే” అంటారు. ఇవీ ఇంకొన్నీ శ్రీశ్రీ అన్నవి ఎప్పటికీ గొప్పవి.

1910 లో పుట్టిన శ్రీశ్రీ తొలికవిత 1925లో పురిపండా అప్పలస్వామి పత్రిక స్వశక్తి లో అచ్చయింది. 1928లో తొలి కావ్యం ప్రభవ ప్రచురించారు శ్రీశ్రీ.

లిమరిక్ అన్న ఇంగ్లిష్ హాస్య కవితా రూపాన్ని లిమఋక్ గా తెలుగులోకి‌ తెచ్చారు‌ శ్రీశ్రీ.

శ్రీశ్రీ రాసిన కొన్ని సినిమా పాటలు…
“మనసున మనసై‌…”, “ఎవరో వస్తారని ఏదో‌ చేస్తారని…”, ” కలకానిది విలువైనది…”, “ఓ సజీవ శిల్పసుందరి ఎవరివో నీవెవరివో…”, “బొమ్మను చేసీ ప్రాణము పోసి…” , “తెలుగు‌వీర‌లేవరా దీక్షబూని సాగరా…”, “పాడవోయి భారతీయిడా…”, “ఆకాశ‌వీధిలో అందాల జాబిలీ…”, “మూయించిన ఒక వీరుని‌‌ కంఠం వేయి‌గొంతుకల‌ విప్లవ‌ శంఖం…”, “కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు…”, “మనిషే మణిదీపం‌ మనసే నవనీతం”… వారి గొప్ప కవితలంత గొప్పవి.

రానున్న నాళ్లలో తెలుగులో కవిత అన్నది మళ్లీ కవిత కావాలంటే శ్రీశ్రీని సరిగ్గా అర్థం చేసుకోవడం తెలుగుకు అత్యవసరం.

శ్రీశ్రీ సరిగ్గా అర్థం కాకపోవడంవల్ల పరోక్షంగా ఆయనవల్ల కూడా తెలుగు కవిత వక్రించింది. ‘శ్రీశ్రీకి ముందు, తరువాత అంతా శూన్యం’ వంటి చదువు, పరిపక్వత, అవగాహన లేని అజ్ఞానం కూడా వచ్చింది.

శ్రీశ్రీని శ్రీశ్రీని చేసింది అంతర్జాతీయ కవిత్వం. ఈ వాస్తవమే ఇవాళ తెలుగు కవికి కావాల్సింది. శ్రీశ్రీ నుంచి తెలుగు కవి నేర్చుకోవాల్సింది ఇదే. శ్రీశ్రీలాగా అంతర్జాతీయ కవిత్వంపై అవగాహనతో ‘తెలుగు కవిత దెబ్బతింది’ అన్న స్థితిని అధిగమించాలి. ఉన్మాదాన్ని, వక్రతను కాదు తెలుగు కవి శ్రీశ్రీలాగా ఔన్నత్యాన్ని ఆపోసనపట్టాలి.

కమ్యూనిజమ్ తెలుగు కవిత్వాన్ని దారుణంగా దెబ్బకొట్టాక
కవినామ అసాంఘీక శక్తులు, అనైతిక శక్తులు ముస్లీమ్ వాద కవిత్వం, ఆ వాద ఈ వాద కవిత్వం అంటూ వికారాలను వాంతి చేసుకుంటూ కవిత్వాన్ని మామూలు సమాజం అసహ్యించుకునే పరిస్థితిని సృష్టించారు. ఉచ్చల కవుల ఉచ్చల కవిత్వం కూడా తెలుగులో వచ్చేసింది. దేశంలోని ఏ భాషలోనూ, ఏ సంఘటనల కారణంగానూ ఉచ్చల కవిత్వం రాలేదు. ఇతర భాషల వాళ్లు తెలుగు కవుల(?) లాగా అధములు, వికృత స్వభావులు, భ్రష్టులు కారు. తెలుగుకు మాత్రమే ఈ దుర్గతి. ఉచ్చల కవులకు, ఉచ్చల కవిత్వానికి సాహిత్య అకాదెమి పురస్కారం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు; బాధపడక్కర్లేదు. (అందుకు కావాల్సిన ప్రాతిపదిక పడినట్టుగా తెలియవస్తోంది)

మతి పగిలిపోయినవాళ్లు, మనస్తత్వం చితికిపోయినవాళ్లు ఈ తెలుగు కవిత్వ పతనాన్ని సమర్థించుకుంటున్నారు. అతి దయనీమైన, అతి బాధాకరమైన స్థితి ఇది. వచ్చిన వ్యాధి ఏమిటో కూడా తెలుసుకోలేని ఉన్మాద స్థితిలో తెలుగు కవిత్వ మేధ తచ్చాడుతోంది. ఉచ్చల కవిత్వం తరువాత మలం కవిత్వంలోకి, మురుగు కవిత్వంలోకి తెలుగు కవిత్వం తప్పకుండా వెళుతుంది. అందుకు కావాల్సిన ప్రతిభతో, మేధతో మనవాళ్లు తీవ్రమైన కృషి చేస్తారు.

ఇంకా తెలుగు కవితకు శ్రీశ్రీ ప్రభావం అవసరం ఉందా? లేదు. ఆయనకు ఉన్నట్టుగా
‘అంతర్జాతీయ కవిత్వంపై సరైన అవగాహన, ప్రతిభ, చదువు, తెలివిడి ఇప్పటి తెలుగు కవికి కావాలి’.

శ్రీశ్రీ స్మరణలో…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here