‘నాడోజ’ పీ.బీ. శ్రీనివాస్

0
180

సెప్టెంబర్ 22 పీ.బీ. శ్రీనివాస్ జయంతి.
పూర్తిపేరు ప్రతివాది భయంకరం శ్రీనివాస్
(రోచిష్మాన్, 9444012279)

అంతర్జాతీయ స్థాయి గాత్రంతో, అంతర్జాతీయ స్థాయి గానం చేసిన తెలుగువారు పీ.బీ. శ్రీనివాస్. సంస్కృత శ్లోకాల భక్తి గానమూ, ఉర్దూ గజలియత్ గానమూ రెండిటినీ ఉదాత్తంగా చేసిన మన దేశపు గాయకుడు పీ.బీ. శ్రీనివాస్.

‘గానకళా సార్వభౌమ’ గా కన్నడంలో మెఱిసిన‌ ప్రభ‌ పీ.బీ.శ్రీనివాస్‌. కన్నడ సంస్కృతిలో ఒక భాగం ఆయన. ఒక చలన‌ చిత్ర నేపథ్య గాయకుడు ఒక ప్రాంత, భాష ప్రజల సంస్కృతిలో భాగం అవడం అపూర్వం, ఒక చారిత్రిక విశేషం. ఒక దశలో నటుడు రాజ్‌కుమార్‌ కన్నా ముందు కర్ణాటక ప్రజల చేత ఎన్నుకోబడ్డ కన్నడ సూపర్ స్టార్ పీ.బీ. శ్రీనివాస్. ఒక నేపథ్య గాయకుడు‌ సూపర్ స్టార్ అవడం మన దేశంలో పీ.బీ. శ్రీనివాస్‌తో మొదలయింది!

పీ.బీ. శ్రీనివాస్ గానానికీ గాత్రానికీ ప్రాంతీయత లేదు. ఘంటసాల గాత్రానికీ, గానానికీ తెలుగుతనం ఉంటుంది. పీ.బీ. శ్రీనివాస్ గాత్రం,‌ గానం భాష, ప్రాంతాలకు అతీతం. అందుకే ఆయన్ను హిందీ గాయకులు సైతం‌ మెచ్చుకున్నారు.

Illustrated Weekly ఇంగ్లిష్ పత్రిక కోసం ఆ పత్రిక సంపాదకులు ఎ.ఎస్. రామన్ ఒక‌ ముఖాముఖిలో లతా మంగేష్కర్ ను “మీకు నచ్చిన దక్షిణాది గాయకులు ఎవరు?” అని అడిగితే “ఏకీ‌ అచ్చా గాకయ్ పీ.బీ.శ్రీనివాస్” అని జవాబు చెప్పారు లత.

దక్షిణాదిలోనే కాదు భారతదేశ చలన చిత్ర గానంలోనే నమోదైన తొలి Fine warm rounded even baritone with verve పీ.బీ. శ్రీనివాస్‌దే!
ఆయన గొంతులో ring ఉంటుంది.‌ Ring అంటే‌ a clear resonant tone quality. ఆయన గాత్రాన్ని విని ఘంటసాల అన్నారు: “తమ్ముడు, నీ‌ గొంతులో‌ సహజంగానే ఒక‌ ఒదుగు ఉంది, నేను దాని కోసం గల్లాపట్టు పట్టి పాడతాను‌”.
గాత్రం సమంగానూ, సాంద్రతతోనూ, నిండుగానూ ఉండడం rounded even barirone అవుతుంది. పీ.బీ. శ్రీనివాస్‌ది ఒక‌ లక్షణమైన గాత్రం; ఒక సహజమైన గాత్రం. ఆయనది‌ natural timbre; metalic tone కాదు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ “పురుష గాత్రం‌ అంటే ఇదే” అని పీ.బీ.ఎస్.‌ గాత్రాన్ని విని అన్నారు.

ఉత్తరాదిలో మాత్రమే వినిపిస్తూండే melody, mood singing, modulation లను దక్షిణాది‌ చలనచిత్ర సంగీతానికి తెచ్చింది పీ.బీ.ఎస్. ఆయనకు ముందు mood singing అంటే మనోధర్మ గానమూ, modulation in singing దక్షిణ భారత‌ దేశ‌‌ చలనచిత్ర గానంలో లేవు. 1956 లో వచ్చిన భలే‌ రాముడు‌ చిత్రంలో‌ ఆయన రేలంగికి పాడిన “బంగరు‌ బొమ్మా…” పాటతో దక్షిణ భారత సినిమా నేపథ్య గానంలో mood singing మొదలయింది. అటుపైన తమిళ్ష్, కన్నడ చిత్రాలలో ఎన్నో పాటలతో mood singing ను అందించారు పీ.బీ. శ్రీనివాస్. ఘంటసాల భావంతో పాడడంతో ఆగిపోయారు. ఘంటసాలది‌ “సంస్కరించబడిన‌ గానం (Cultured singing). పీ.బీ.ఎస్.ది మేలైన, తీర్చి‌దిద్దిన గానం (Fine singing).

హిందీ‌ గాయకులైన‌ మొహమ్మద్ రఫీ, మన్నాడే, తలత్‌ మహ్ మూద్, లతా మంగేష్కర్, ఆశా భోస్లే లకు పీ.బీ.ఎస్. అంటేనే అభిమానం.‌ ఒకదశలో‌ ఉత్తరాది వారు దక్షిణాదిలో ‘గాయకుడు’ అని‌ గుర్తించింది పీ.బీ.శ్రీనివాస్‌నే!

Jim Reeves, Perry Como, Nat King Cole, Pat Boone వంటి‌ అంతర్జాతీయ గాయకుల గాత్ర ధర్మం, గాన‌‌‌ ధోరణి మనకు‌ ఒక్క పీ.బీ. శ్రీనివాస్‌లోనే కనిపిస్తాయి. ఇంగ్లిష్ గానంలో‌ మనకు వినిపించే relaxed singing style కూడా మనకు‌ పీ.బీ.ఎస్.‌ ద్వారానే వచ్చింది. (పాట “వెన్నెలకేల నాపై కోపం…” సినిమా కానిస్టేబుల్ కూతురు) మామూలుగా పాడడమూ, బాగా పాడడమూ అన్న వాటిని దాటి‌ గానంలో conceptulaizationను తీసుకొచ్చింది‌ ఆయనే. “ఓహో గులాబి బాల…” పాట దీనికి ఉదాహరణ. ఈ పాట rounded even singingకు కూడా మేలైన మచ్చుతునక.

తలత్ మహ్‌మూద్ భారతదేశ చలన చిత్ర, లలిత సంగీత గాన్నాల్ని ఒక సరైన మలుపు తిప్పారు. మేలైన, తీర్చిదిద్దబడిన‌ గానం (fine singing) మనకు తలత్‌ ద్వారానే వచ్చింది. మహోన్నతమైన గాయకుడు మహమ్మద్ రఫీ కూడా‌ తలత్ నుంచే ఈ సుగుణాన్ని తీసుకున్నారు.‌ భారతదేశ చలన చిత్ర, లలిత గానాలు తలత్ వేసిన బాటలోనే నడిచాయి.‌ అదే‌ విధంగా పీ.బీ. శ్రీనివాస్ చూపించిన దారిలోనే దక్షిణభారతదేశ చలన చిత్ర గానం సాగింది. అత్యంత గొప్ప గాయకులైన కె.జె.ఏసుదాస్, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యంలు పీ.బీ. శ్రీనివాస్‌నే అనుసరించారు. పీ.బీ.‌ శ్రీనివాస్ గాన విధానాన్నే ముందుకు‌ తీసుకువెళ్లారు. వారిరువురి గాన‌విధానాలకు పీ.బీ. శ్రీనివాస్ గానవిధానం ఆది.

(ఘంటసాల, టీ.ఎమ్ సౌందరరాజన్ వంటి జనరంజక గాయకుల ప్రభావం కె.జె.ఏసుదాస్, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం ఈ ఇద్దరిపై లేకపోవడం గమనార్హం)

దక్షిణ భారత దేశ చలన చిత్ర గానం‌ గుఱించి‌ చెబుతున్నప్పుడు‌ “పీ.బీ. శ్రీనివాస్ కు ముందు పీ.బీ. శ్రీనివాస్ కు తరువాత” అని చెప్పాల్సి ఉంటుంది. పీ.బీ. శ్రీనివాస్ దక్షిణ భారత‌చలన చిత్ర గానానికి ఒక‌ transitional Icon. అంతే కాదు ఆయన దక్షిణ భారత చలన చిత్ర‌ గానానికి ఒక visionary and awakener కూడా. గానంలో elaborate aesthetic embellishment ను పీ.బీ. శ్రీనివాస్ మనకందించారు.

పీ.బీ. శ్రీనివాస్ గానంలో ఉన్న musicality విశేషమైంది. కర్ణాటక,‌ పాశ్చాత్య, హిందూస్థానీ, జానపద రుచుల (flavours)ను ఆయన సమర్థవంతంగా పలికించగలిగారు. ఇతర గాయకులు‌ ఒకటి ఇవ్వగలిగితే మఱొకటి ఇవ్వలేకపోయారు. తమిళ్ష్ లో ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్, కన్నడంలో విజయభాస్కర్ సంగీత దర్శకులుగా పీ.బీ. శ్రీనివాస్ ద్వారా ఎన్నో పాటలలో పాశ్చాత్య రుచులను సాధించగలిగారు.
ఆదినారాయణరావు తమిళ్ష్‌లో
చేసిన అడుత్త వీట్టు పెణ్ సినిమాలో “కణ్ణాలె పేసి పేసి కొల్లాదే…” పాట‌తో పీ.బీ. శ్రీనివాస్ అంతర్జాతీయ గానాన్ని (global singing) దక్షిణ భారతానికి తెచ్చారు.

కె.వీ. మహాదేవన్ తమిళ్ష్‌లో చేసిన వీర అభిమన్యు సినిమాలో శహానా రాగంలో చేసిన‌ “పార్తేన్ సిరిత్తేన్…” పాటలో ఆ రాగ ఛాయను పీ.బీ.శ్రీనివాస్ పలికించిన తీరు ఘంటసాల ద్వారా రాలేదు. (ఘంటసాలకు మించిన గానం లేదు అని అనుకుంటున్న తెలుగు మధ్యతరగతి మాంద్యానికి, జాడ్యానికి పట్టుబడని ‘తెలివిడి’ ఇది)ఎం.ఎస్. సుబ్బలక్ష్మి , డీ.కె. పట్టమ్మాళ్, బాలమురళీ కృష్ణ, పినాకపాణి వంటి శాస్త్రీయ సంగీత గాయకులకు పీ.బీ.శ్రీనివాస్ అంటే ప్రత్యేక మైన అభిమానం.

పీ.బీ. శ్రీనివాస్ “నవనీత‌ సుమ‌‌సుధ‌” అన్న కొత్త రాగాన్ని సృష్టించి‌ (దానికి సాహిత్యం కూర్చి) పాడారు.‌ కర్ణాటక‌ సంగీతంలోని మేళ‌‌కర్త రాగాలను‌‌ గణిత సూత్రం ఆధారంగా సులభంగా గుర్తించేందుకు Diamond-Key అన్న‌ విధానాన్ని రూపొందించారు పీ.బీ. శ్రీనివాస్.

సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాదన్ ఉర్దూ గజళ్ల‌ లాంటి పాటలను‌ చేసి పీ.బీ. శ్రీనివాస్ చేత మాత్రమే పాడించేవారు. “చిగురాకులలో ఊయలలో…”, “పూవువలె విరబూయవలె…”, “ఎవరికి ఎవరు కాపలా…”, “నిలవే ఎన్నిడం నెఱుఙాగాదే…” వంటి పాటలను‌ ఎమ్.ఎస్.‌ విశ్వనాదన్, పీ.బీ. శ్రీనివాస్ గాత్రం,‌ గానం‌ కోసమే చేశారు. “పూవువలె విరబూయవలె…” పాటకు తమిళ్ష్ రూపం పోలీస్ కారన్ మగళ్‌ చిత్రంలో “పొన్ ఎన్బేన్ సిరు పూ ఎన్బేన్…” పాట. ఈ పాటలో పీ.బీ. శ్రీనివాస్ polite resonant rounded even baritone అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. ఈ‌ పాటలో ఆయన గాత్రంలోని verve ప్రత్యేకమైంది. రాము సినిమాలోని “నిలవే ఎన్నిడం నెరుఙాదే…” తమిళ్ష్ పాటను గజల్ గాయకుడు గులామ్ ఆలీ ఒక వేదికపై పాడారు. పీ.బీ. శ్రీనివాస్ గానం, గాత్రం గులామ్ ఆలీ చేత ఆ‌ పని‌ చేయించింది. ఈ‌ పాటను తెలుగులో (“మంటలు రేపే నెలరాజా…”) పాడాల్సి వచ్చినప్పుడు “నేను‌ శ్రీనివాస్ లాగా పాడగలనా” అని అన్నారు ఘంటసాల. (ఈ మాటను పెండ్యాల ఒక వ్యాసంలో రాశారు) తమిళ్ష్, కన్నడం భాషల్లో పీ. బీ. శ్రీనివాస్ పాడిన పాటల్ని తెలుగులో తను పాడినప్పుడు ఏ సందర్భంలోనూ ఘంటసాల మెరుగ్గా పాదలేదు; కొన్ని పాటలు పాడైపోయాయి. (తెలుగు ఘంటసాల అభిజ్ఞతకు అతీతంగా ‘తెలివిడి’ ఆధారంగా)

పాడబోయేది‌ పీ.బీ. శ్రీనివాస్ కాబట్టి కె.వీ. మహాదేవన్ పొన్ని త్తిరునాళ్ అన్న తమిళ సినిమాలో బడే గులామ్ ఆలీ ఖాన్ పహాడీ రాగ గానం స్ఫుర్తితో “ఏన్ సిరిత్తాయ్…” అన్న గజల్ లాంటి బాణి చేశారు. సంగీత‌ దర్శకుడు ఇళైయరాజా కడవుళ్‌ అమైత్త మేడై అన్న‌ తమిళ్ష్ సినిమాలో‌ “తెన్ఱలే‌ నీ పేసు…” అన్న ఒక‌‌ గొప్ప‌ పాటను మెహ్‌దీహసన్
గానస్థాయిలో ఉండే ఉర్దూ‌ గజల్ వలె చేసి‌ పీ.బీ. శ్రీనివాస్ చేత‌ పాడించారు.‌ కొన్ని సందర్భాల్లో పీ.బీ. శ్రీనివాస్ గాత్రంలో nasal timbre కూడా ధ్వనిస్తూంటుంది. ఇది ఉర్దూ‌ శబ్దాల ఉచ్చారణకు ఎంతో‌ అనువుగా ఉంటుంది.గజల్ గానానికి బాగా పొసుగుతుంది. ఈ nasal timbre ప్రముఖమైన గజల్ గాయకుడు గులాం ఆలీలో కూడా ఉంది.

పీ.బీ. శ్రీనివాస్ తొలి తెలుగు గజల్ గాయకుడు; దక్షిణాది భాషల తొలి గజల్ గాయకుడు. 1967 లో దాశరథి‌ రాసిన “నీ కొంటె‌‌ చూపులోన కురిసింది పూలవాన…” అన్న గజల్‌ను ఈమని శంకర శాస్త్రి స్వరకల్పనలో పీ.బీ. శ్రీనివాస్ పాడారు. ఆ గజల్ గానం తెలుగులో ఇప్పుడున్న లొల్లాయి గానంలా కాకుండా ఉర్దూ గజల్‌‌ గాన ధోరణిలోనే ఉంటుంది. తెలుగులో తొలిసారి ఉర్దూ స్థాయి గజల్ గానం చేసినది పీ.బీ. శ్రీనివాస్.

పీ.బీ.శ్రీనివాస్ రాసి,‌ సంగీతం‌ సమకూర్చి, పాడి‌ 1978-79లో ‘ఉర్దూ గజల్స్’ అన్న ఒక ఆల్బమ్, 1982లో ‘మెహ్ ఫిల్-ఎ-ఆఫ్ తాబ్-ఓ-మాహతాబ్’ అన్న ఆల్బమ్ విడుదల చేశారు‌.‌ ఉర్దూ గజల్ గానం చేసిన తొలి తెలుగు గాయకుడు పీ.బీ. శ్రీనివాస్. (హైదరాబాద్ గజల్ గాయకుడు విట్ఠల్ రావ్ మరాఠీ వారు)

పీ.బీ. శ్రీనివాస్ ఒక ఉర్దూ గజల్‌ వాగ్గేయకారుడు కూడా! కన్నడంలోనూ తొలి గజల్ కవి-గాయకుడై 1978లో ‘ప్రేమె గీతెగళు’ అన్న రికడ్ (రికార్డు)ను విడుదల చేశారు. కవ్వాలి లాగా ‘హీర్’ అనే సూఫీ గాన‌విధానం ఉంది. ఇది పంజాబ్ మట్టిపై పుట్టింది. గులామ్ ఆలీ, మెహ్‌దీహసన్, మఱికొందరు ఇతర గాయకులు హీర్ ను పాడారు. పీ.బీ. శ్రీనివాస్ ఉర్దూ హీర్ పాడారు. తెలుగులోనూ తొలిసారి హీర్ పాడారు‌. పీ.బీ. శ్రీనివాస్ పాడిన‌ “నమో‌ దేవదేవాయ సనాతనాయ…” అన్న తొలి తెలుగు హీర్ 1980లో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారం అయింది.

ఎమ్.ఎస్. విశ్వనాదన్ 1961లో‌ చేసిన “పావమన్నిప్పు” సినిమాలో పీ.బీ.‌ శ్రీనివాస్ కు చేసిన “కాలఙ్గళిల్‌ అవళ్ వసన్దమ్…” పాటా, “యార్ యార్ అవళ్ యారో…” పాటా ఒక్క సారిగా దక్షిణాది పాటను‌ జాతీయ స్థాయి‌ పాటగా చేశాయి.‌ యార్ యార్ అవళ్ యారో పాట లతా మంగేష్కర్ వాళ్ల కుటుంబ గీతం.‌ 2004లో ఆశా భోస్లే విశాఖ పట్నంలో మాట్లాడుతూ తమ కుటుంబానికి నచ్చిన దక్షిణాది‌ గాయకులలో పీ.బీ. శ్రీనివాస్ పేరునే మొదటి పేరుగా చెప్పారు.

గాయకులు‌ మన్నాడే పాడాక‌ మఱొకరు‌ పాడితే అంతకన్నా‌ బాగా‌‌ రాదు. మన్నాడే గానం అంత గొప్పగా‌ ఉంటుంది. పరిణీతా హిందీ సినిమా‌ లో అరుణ్ కుమార్‌ సంగీతంలో “చలీ‌ రాధే రానీ అఖియోమే పానీ…” పాటను మన్నాడే పాడారు.‌‌ ఆ‌ పాట తమిళ్ష్‌లో
మణమాలై (1958)సినిమాలో “నెఞజమ్ అలై మోదుదే కణ్ణుమ్ కుళమాగవే…” అంటూ పీ.బీ.ఎస్. పాడారు. మన్నాడే కన్నా పీ.బీ.ఎస్. చాల బాగా పాడారు. పీ.బీ.ఎస్.‌ పాడిన‌ కొన్ని కన్నడం‌ పాటలను‌ హిందీలోకి డబ్ చేస్తూ‌ హిందీ పాటలను మన్నాడే చేత‌ పాడించారు. ఆ సందర్భాలలో మన్నాడే అనేవారట “నన్నెందుకు పిలిచారు?‌‌ శ్రీనివాస్ బాగా పాడతారు కదా” అని.

పీ.బీ.‌ శ్రీనివాస్ స్వయంగా రాసి పాశ్చాత్య ధోరణిలో సంగీతం చేసి రెండు ఇంగ్లిష్‌ పాటలు పాడి రికడ్ (రికార్డ్)గా 1969 లో‌ విడుదల చేశారు. 1. Man to moon 2. Moon to God. అన్న పాటలు అవి. ఈ ఇంగ్లిష్ పాటలకు గానూ చంద్రుడిపై కాలు మోపిన నీల్ ఆంస్ట్రంగ్ నుంచీ, అమేరిక అధ్యక్షుడు‌ నిక్సన్ (Nixon) నుంచీ ప్రశంసలు అందుకున్నారు పీ.బీ. శ్రీనివాస్. ఇంగ్లిష్‌ పాటలు‌ పాడిన‌ తొలి తెలుగు గాయకుడు పీ.బీ. శ్రీనివాస్.

పీ.బీ. శ్రీనివాస్ భక్తి‌గానం విశిష్టమైంది. ఎలా అయితే ఘంటసాల పద్యాలు‌ పాడడానికి వరవడి పెట్టారో అలా పీ.బీ. శ్రీనివాస్ శ్లోకాల గానానికి వరవడి పెట్టారు. ఆయన భక్తి గానానికి తలమానికం ముకుంద‌మాల గానం. అసలు భక్తి గానానికే పీ.బీ. శ్రీనివాస్ చేసిన ముకుంద మాల గానం తలమానికం. “ముకుంద మాలను రాసిన‌ కులశేఖరాళ్వార్ తానే పాడుకుంటే ఎలా పాడుకునే‌వారో అలా పీ.బీ. శ్రీనివాస్ పాడారు” అని ప్రముఖ సంగీత‌ విమర్శకులు వీ.ఎ‌.కె. రంగారావు తన ‘ఆలాపన’ లో‌ రాశారు.

పీ.బీ. శ్రీనివాస్ అత్యంత ఉదాత్తమైన భక్తి గానం చేశారు. శారదా భుజంగ స్తోత్రం, శ్రీ‌దేవ్యపరాథ క్షమాపణ స్తోత్రం, హనుమాన్ చాలిసా,‌ శ్రీ రంగనాథ స్తోత్రం, హయగ్రీవ స్తోత్రం‌, శ్రీ వేంకటశ స్తోత్రం, శ్రీ రాఘవేంద్ర సుప్రభాతం, శ్రీ లక్ష్మీనృసింహకరావలంబం వంటి వాటిని స్వీయ సంగీతంలో ఎంతో గొప్పగా
పాడారు పీ.బీ. శ్రీనివాస్. హిందీ భజన్లు పాడారు. కన్నడ‌ సినిమాలలో పీ.బీ. శ్రీనివాస్ పాడిన కొన్ని భక్తి పాటలు న భూతో న భవిష్యతి.

పీ.బీ.ఎస్.‌ తన కొన్ని తమిళ్ష్, కన్నడ, మలయాళ‌ం పాటల గానంతో కొందఱి ప్రాణాలను‌ నిలబెట్టారు. ప్రముఖ తమిళ కవి వాలి “నేను కవిగా నిలబడింది పీ.బీ.ఎస్. గానం‌వల్లే” అని చెప్పేవారు.

పీ.బీ. శ్రీనివాస్ గానం‌లో అత్యంత ముఖ్యమైన అంశం “సమతౌల్యం” (balance). ఈ‌ అంశం‌ మొహమ్మద్‌‌ రఫీ, లతా మంగేష్కర్, మెహ్‌దీహసన్
గానాలలో గొప్పగా చోటు చేసుకుని ఉంటుంది; ఈమని శంకరశాస్త్రి వీణ వాదనలో ఉంటుంది. పీ.బీ.ఎస్.‌ గానంలో ఈ అంశం తొణికిసలాడుతూంటుంది. పీ.బీ.ఎస్. గానంలో నిండుతనం ఉంటుంది. ఈ సమతౌల్యంవల్ల,‌ నిండుతనంవల్ల ఆయన పాడాక ఆ పాటలను మఱో‌ సందర్భంలో‌ మఱో గాయకుడు పాడినప్పుడు‌‌ అవి పలచబడిపోవడం‌ చాల స్పష్టంగా‌‌ తెలుస్తుంది.

పీ.బీ. శ్రీనివాస్ గాన విధానమూ, మెహ్‌దీహసన్
గాన విధానమూ‌‌ ఒకే అంతస్తులో ఉంటాయి.

మనకు ‘తాళ‌ సమం’ గుఱించి తెలుసు. ‘స్వర సమం’ కూడా ఉంటుంది. సప్త‌ స్వరాలలో ఇతర ఆరు‌ స్వరాల ఆలాపనలోనూ షడ్జమం ఉండడం స్వరసమం అవుతుంది. ఒక‌ గాత్రం‌ స్వరాలను పలుకుతున్నప్పుడు ఆ‌ స్వరాలలో గాత్రం నిండుగా ఒదగాలి అలా ఒదిగితే స్వర సమం సాధ్యపడుతుంది. ఈ అంశం మనకు రఫీ, లత, మెహ్‌దీహసన్, జస్‌రాజ్, భీమ్‌సేన్ జోషీ, పర్వీన్ సుల్తానా, ఇంగ్లిష్ గాయకులు Pat Boone, Nat king Cole, Jimreeves వంటి వాళ్లలో కనిపిస్తుంది. ఈ స్వరసమం పీ.బీ. శ్రీనివాస్ గానంలో ఉంది‌.

దక్షిణాది చలన‌చిత్ర గానంలో‌ yodellingను తొలిసారి పీ.బీ.‌ శ్రీనివాస్ చేశారు. 1959 లో‌ వచ్చిన తమిళ్ష్ చిత్రం‌‌ “కూడి ఇరున్దాల్ కోడి ఇన్బమ్” చిత్రంలో “పదుమై దానో…” అనే పాటలో తొలిసారి దీన్ని చేశారు ఆయన. ఇంగ్లిష్‌లో‌ గాయకులు Bing Crosby, Tex Morton, Danny Kaye ద్వారా ఈ yodelling పాచుర్యంలోకి వచ్చింది. గాయకుడు కిషోర్‌ కుమార్ ద్వారా హిందీ‌‌‌ సినిమా‌ సంగీతంలో ఇది చలామణిలోకి వచ్చింది.

పీ.బీ. శ్రీనివాస్‌ది smooth romantic గాత్రం. ఆయన warm, relaxed, intimate singing style ప్రేమ‌-గానానికి కచ్చితంగా పొసుగుతుంది. ఉదాహరణ తేనె మనసులు చిత్రంలో “ఏం ఎందుకని…” పాట. “పీ.బీ. శ్రీనివాస్ పాడిన ప్రేమ‌ గీతాలవల్ల మేము ప్రేమించడం నేర్చుకున్నాం” అని ఎందరో పాతతరం తమిళ్షులు, కన్నడీగులు అంటూంటారు.

ఇంగ్లిష్ గాయకుడు Bing Crosby ఒక గొప్ప‌ Crooner. ఆ తరువాత గాయకుడు Perry Como గొప్ప crooner. దక్షిణ భారతదేశపు కాదు… కాదు భారత దేశపు గొప్ప crooner పీ.బీ. శ్రీనివాస్. భారత దేశ తొలి crooner తలత్ మహ్‌మూద్.

పీ.బీ. శ్రీనివాస్ ఒక అష్టభాషా కవి! తనకు తెలిసిన తెలుగు, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్, తమిళ్ష్, కన్నడం, మలయాళం, ఉర్దూ భాషల్లో కవిత్వం రాశారు.

‘ప్రణవం’ అన్న పేరుతో తన ఎనిమిది‌ భాషల కవితలను ఒక సంకలనంగా 1997లో విడుదల చేశారు పీ.బీ. శ్రీనివాస్. “నాచన సోముడు అష్ట భాషా కవి అని మనం చదివాం. కానీ ఆ అష్ట భాషలు తెలుగు మాండలిక భేదాలే; వేఱు వేఱు భాషలు కావు” సీ. నారాయణ రెడ్డి ఈ‌ మాటలు అన్నారు. “మనకు తెలిసిన‌ ఏకైక అష్టభాషా కవి పీ.బీ.శ్రీనివాస్” ఇవీ సినారె మాటలే.

పీ.బీ.శ్రీనివాస్ రాసిన ప్రణవం; సంస్కృతం, తెలుగు,‌ తమిళ్ష్,‌ కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ,‌ ఇంగ్లిష్ ఈ ఎనిమిది‌‌ విభిన్న భాషల‌ కవితల సంకలనం. భాషకు ఎనిమిది చొప్పున ఎమినిది భాషలకూ ఎనిమిది‌ వేఱు వేఱు ఇతివృత్తాల కవితలు ఈ ప్రణవంలో పొదగబడినాయి. ఒక్క ఇంగ్లిష్ భాషకు తప్ప తక్కిన ఏడు భాషల కవితలకూ ఇంగ్లిష్ లిపి అంతరీకరణమూ,‌ ఇంగ్లిష్ అనువాదమూ ఇవ్వబడ్డాయి. ఈ సంకలనంలోని కవితలూ, వాటి ఇంగ్లిష్ లిపి అంతరీకరణలూ, అనువాదాలూ కవి పీ.బీ.శ్రీనివాస్ దస్తూరీలోనే ఉంటాయి. ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి ప్రయత్నమూ, ఇంతటి ప్రయోగమూ మఱెక్కడా జరిగిందా? ముఖపత్రంలోనే ఎనిమిది భాషలూ కనిపిస్తాయి. అష్ట భాషా‌ కవితా సంకలనం ప్రణవం తెలుగు నుంచి వచ్చిన ఒక అద్భుతం; ఒక‌ తెలుగు మేధ మాత్రమే అందించగలిగిన అద్భుతం.

ఈ‌ ప్రణవంలో సంస్కృతం, ఉర్దూలతో సహా ఇతర భాషల గజళ్లూ, అంతర్లాపి కవితలూ, అష్టపదులూ, సామాజిక వచన కవితలూ,‌ గేయాలూ, భక్తి గీతాలూ, జానపద గేయాలూ, భజన్లూ, చోటు చేసుకున్నాయి.

సంస్కృతంలో‌ ‘స్తుతిగాన పియూష పానానురక్తమ్’ అనీ, తెలుగులో ‘భావాలకు పుట్టినిల్లు తెలుగు భాష , పలువన్నెల వానవిల్లు తెలుగు భాష’ అనీ, ‘తెల్లనైన నీడలాగా’ అనీ ‘తనువు వేడిని తనువు కొలిచింది’ అనీ, తమిళ్ష్ భాషలో ‘ఒకామే మనకు మాత ఆమే భారతమాత’ అనీ, ‘అహంకారం మూర్ఖత్వానికి సంతానం’ అనీ, కన్నడంలో ‘ప్రకృతి‌ ఒడిలో మనమందఱమూ కలిసిపోదాం’ అనీ, ‘మధురమర్మం’ అనీ మలయాళంలో ‘నా హృదయం ఒక ఆలయం అది కళల ఆశ్రమంగా కట్టబడింది’ అనీ, హిందీలో ‘భాషా‌ పుల్ హై దీవార్ నహీ(భాష వంతెన, గోడ కాదు ) భాషా గుల్ హై తల్వార్ నహీ( భాష పుష్పం, ఖడ్గం కాదు)’ ‌అనీ, ఉర్దూలో ‘హుస్న్ కీ జబీన్ పర్ మాహ్ తాబ్ హై గజల్ / షాయిరీ కీ షాన్ కా ఆఫ్ తాబ్ హై గజల్ ( సౌందర్యం ఫాలభాగం పైన జాబిల్లి గజల్/ కవిత్వం ఔన్నత్యం పైన సూర్యుడు గజల్)’ అనీ, ‘చార్ దిన్ కీ జిందగానీ క్యూన్ కిసిసే దుష్ మనీ/ దుష్ మనీ చాహేతొ కర్ లే దుష్ మనీ సే దుష్ మనీ
(నాలుగు రోజులదీ జీవితం ఇతరులతో ఎందుకు శత్రుత్వం/ శత్రుత్వమే కావాలనుకుంటే చేసుకో శత్రుత్వంతోనే శత్రుత్వం)’ అనీ, ఇంగ్లిష్ లో ‘English never gets old. as it is energetic and eternally young in age’ అనీ ‘Oh Death, it is high-time for you to die!’ అనీ, ‘Optimism is a prism of colour ful rays / Noble and bold minds receive God’s grace’ అనీ ‘Love is whiter than the pure snow’ అనీ ఈ‌ ప్రణవం కవి పీ.బీ. శ్రీనివాస్ తన కావ్య వాక్యాలనూ, వాక్య కావ్యాలనూ మనకు అందించారు.

తెలుగు గజళ్లలో ఉర్దూ తరహా గజలియత్ ను తీసుకొచ్చినవారు పీ.బీ. శ్రీనివాస్. పీ.బీ. శ్రీనివాస్ ప్రపంచంలోనే తొలి ఆపై ఏకైక‌ అష్టభాషా‌ గజల్‌‌ కవి. ఉర్దూ,‌ తెలుగు,‌తమిళ్,‌ కన్నడం, మలయాళం,‌ ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం భాషల్లో ఆయన గజళ్లు రాశారు. గజలియత్ అంటే గజల్ తనం‌. గజల్ ఒక‌ శిల్పాత్మకమైన ప్రక్రియ. గజల్ ప్రక్రియకు ఒక‌ ప్రత్యేకమైన రచనా‌ సంవిధానం‌ ఉంది. అదే గజలియత్ అవుతుంది. పీ.బీ. శ్రీనివాస్ గజళ్లలో‌ని గజలియత్ ను ఆస్వాదిద్దాం రండి –

పీ.బీ.‌ శ్రీనివాస్. 1974లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో స్వీయ గజల్ ను స్వర‌పఱిచి పాడి ప్రసారం చేశారు పీ.బీ. ఎస్.
ఆ గజల్ తొలి షేర్
” మన ప్రేమకే సాటిలేదీ జగాన;
మన పాట సాగేను నవ్య స్వరాన.”
గజలియత్ తో వచ్చిన‌ తొలి తెలుగు గజల్ ఇదే. ఇంతకు ముందే దాశరథి తెలుగుకు గజళ్లను పరిచయం చేసినా గజళ్లతో‌‌ తెలుగుకు గజలియత్ ను పరిచయం చేసినది‌ పీ.బీ. శ్రీనివాస్. అప్పటికి సీ.నారాయణరెడ్డి గజల్ పేరుతో రచనలు చెయ్యలేదు.
తొలి తెలుగు గజల్ గాయకుడు, వాగ్గాన లేదా వాగ్గేయకారుడు పీ.బీ. శ్రీనివాస్.

1980 లో ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రసారమైన పీ.బీ. ఎస్. రచన, గాన గజల్ లోని తొలి‌ షేర్:
“కల్పనలు సన్నాయి‌ ఊదే‌ వేళ‌ చింతలు దేనికి?
కవితలనె అర్పించు కానుక లోక‌‌కళ్యాణానికి”. ఆ‌ గజల్ లోని మఱో రెండు షేర్ లను గమనిద్దాం… “సృష్టి అందాలే కదా దీపాలు కలతల బాటలో / క్షేమమే ఆ వెలుగులో సాగే ప్రతి నయనానికి”. “పాట పాటకి దేవుడే కద ప్రాణమనదగు పల్లవి/ పల్లవే లేకున్న గమనం సాధ్యమా చరణానికి”.

పీ.బీ.‌‌ శ్రీనివాస్ ఇతర తెలుగు గజళ్లలోని గజలియత్ ను చూసే ముందు ఒకసారి ఆయన ఉర్దూ గజళ్ల గజలియత్ ను చూసొద్దాం…

“చార్ దిన్ కీ జిందగానీ క్యూన్ కిసీసే దుష్ మనీ/ దుష్ మనీ చాహేతొ కర్లే దుష్ మనీసే దుష్ మనీ” (నాలుగు రోజులదీ జీవితం ఎందుకు ఇతరులతో శత్రుత్వం / శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వం తోనే శత్రుత్వం). ఈ రచన గజల్ కు ఉండాల్సిన దావా దలీల్ టెక్నిక్ కు నిలువెత్తు ఉదాహరణ. ఇది సిసలైన గజలియత్. (నారాయణరెడ్డి గజళ్లు అని రాసిన వాటిల్లో ఈ దావా దలీల్ టెక్నిక్ ఇసుమంతైనా కనిపించదు) మఱో ఉర్దూ గజల్ ద్వారా “హుస్న్ కీ జబీన్ పర్ మాహ్ తాబ్ హై గజల్/ షాయిరీ కీ షాన్ కా ఆఫ్ తాబ్ హై గజల్”
(సౌందర్యం‌ ఫాలభాగంపైన జాబిల్లి గజల్/
కవిత్వం ఔన్నత్యపు సూర్యుడు‌ గజల్) అన్నారు. మఱో‌ ఉర్దూ‌ షేర్ : “జిస్ కి బూసె‌ మన్ లుటే వోహ్ గులాబ్ హై‌ గజల్/ నూర్‌ జిస్ క హై బదన్ వోహ్ షబాబ్ హై‌ గజల్” (గజల్ ఒక గులాబీ అది మెదడుకు‌ మత్తెక్కిస్తూ ఉంటుంది/ గజల్‌ అన్నది యవ్వనం దాని తనువు వెలుగై‌ ఉంటుంది) అన్నారు.

ఆయన ఇతర భాషల‌ గజలియత్ ఏమిటి? ఒకసారి చూద్దాం. తన సంస్కృ త‌ గజల్ లో‌ ఒక‌ షేర్ రాశారు ఇలా: “దరహాస‌ జాత‌ సిత కిరణ వందేహం/ స్వర గీత‌ మాలికా‌భరణ వందేహం” (దరహాసం నుంచి పుట్టిన‌ స్వచ్ఛమైన కిరణాలు కలవాడా నా ప్రణామం/ స్వర రాగ మాలికా భరణాలు కలవాడా నా ప్రణామం). తన తమిళ్ష్ గజల్ లో‌ ఒక‌‌ షేర్ ఇలా‌ రాశారు: “ఒళియిన్ ఉరువిల్ తిగళ్ష్‌న్దిడాద నిఱమే ఇల్లై / ఉడల్ తన్నిల్ ఉయిరై విడ‌ నిజమే‌ ఇల్లై” (వెలుగు రూపంలో ప్రకాశించని‌ వర్ణమే లేదు/ శరీరం లోపల ప్రాణం కన్నా సత్యమే లేదు). ఒక కన్నడ గజల్ షేర్ ఇలా రాశారు: “స్నేహ సౌందర్య‌రాశి నీ నెంబె / నిన్న ప్రేమానురాగి నా నెంబె”
(స్నేహ‌ సౌందర్య రాశివి, నువ్వు ధ్రువీకరిస్తున్నావు / నీ ప్రేమ ప్రేమికుణ్ణి, నేను ధ్రువీకరిస్తున్నాను)‌. తన మలయాళం‌‌ గజల్ షేర్ ఇలా రాశారు: “పెణ్ మానే ఎణ్డే చుండుగళిల్ నీ రసమయ‌‌ చుంబనం నల్గేణం/ ప్రియసఖీ ఎనిక్కు ప్రగాఢమాయొరు ప్రేమాలింగనం నల్గేణం” (ఓ ఆడ‌ జింకా! నువ్వు నా పెదవులపై రసమయ‌ చుంబనాన్ని ఇవ్వాలి/
ప్రియసఖీ, నాకు ప్రగాఢమైన ప్రేమాలింగనాన్ని ఇవ్వాలి. గజల్ అన్న‌ పదానికి జింక అనే అర్థం కూడా ఉంది).
ఒక హిందీ గజల్‌‌ షేర్ ఇలా రాశారు: “భాషా పుల్ హై దీవార్ నహీన్ / భాషా గుల్ హై తల్వార్ నహీన్” (భాష ఒక వంతెన, గోడ కాదు/ భాష ఒక పువ్వు , చురకత్తి కాదు). ఒక ఇంగ్లిష్‌ గజల్‌ ఇలా రాశారు: “ఐ‌ హావ్ డన్ ఎవ్రి తింగ్ ఫర్ యువర్‌ సేక్ / ఐ‌ విల్ డు‌‌ ఎని తింగ్‌ ఫిర్ యువర్ సేక్/ త్రూ అవుట్ ద నైట్ జస్ట్ కౌంటింగ్‌ ద స్టార్స్ / ఐ‌ హావ్‌ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్‌ సేక్” (నేను అన్నీ చేశాను నీ కోసం / నేను‌ ఏమైనా చేస్తాను నీ కోసం”… రాత్రంతా నక్షత్రాల్ని‌ లెక్కించాను / నేను వేచి ఉన్నాను నీ కోసం)

“గజలు తెఱచేను తలపుల తలుపు/ గజలంటేనే వలపుల పిలుపు”,
“అందాలు చిందు రచన గజల్/
ఛందాల వింత సృజన గజల్”
(2015లో విడుదలైన గేయ కవితలు సంకలనం నుంచి) అని అన్న పీ.బీ. శ్రీనివాస్
తెలుగు గజళ్ల‌లోని గజలియత్‌ను సందర్శిద్దాం…

(1996లో విడుదలైన గాయకుడి గేయాలు‌ సంకలనం‌ నుంచి‌ కొన్ని‌ గజళ్ల షేర్ లు)

“చెలగు కోరిక తీరకుంటే వేదనే/ జీవితం కన్నీట కరిగే కాగితం”
*
“వలలు పన్నే వర్ణజాల భ్రాంతిలో / కలలు చూపే కల్ల పేరే జీవితం”
*
“మాటలలో తియ్యదనం, చేతలలో చేదుతనం/ మనసులలో ముఱికి పెంచి తనువు నుతుకుతున్నాడు”
*
(2015 లో విడుదలైన గేయకవితలు సంకలనం నుంచి కొన్ని‌‌ షేర్ లు)

“విధి యిద్దరినీ విడదీసి నప్పుడు అందఱిలో ఒంటరినై / వెఱ్ఱి కుదిరింది తలకి రోకలిని చుట్టమని అడుగుతున్నాను” ‌తలకి రోకలి చుట్టడం అన్నది తెలుగు నుడికారం. గౙలియత్ ను ఇలా తెలుగు నుడికారంతో మేళవించడం అపూర్వం‌. అద్వితీయం.
*
“…. ప్రియతమవగు నువ్వు నవ్వి ఊరుకుంటున్నా / నయము కాబోని గాయాలనె గేయాలుగా నడుపుతున్నాను”
*
” నీ తలపుతోనే బ్రతుకుతునాను / నిను వలపుతోనే‌ వెతుకుతున్నాను”
*
“నీ తలపే బ్రతుకు బరువు నాచే మోయిస్తోంది / నీ వలపే కవితల్ని నాచే రాయిస్తోంది”
” నీ విముఖతే సుముఖతయై సూక్తులు సాయిస్తోంది” ( సాయించడం అంటే ఉపదేశించడం, అనుగ్రహించడం,‌ ఇవ్వడం)
*
“వంతల చితికెక్కించీ నన్ను ఎందుకు బ్రతకనిచ్చేవు” (ఇక్కడ వంత అంటే మనోవ్యథ అని అర్థం)
*
“ప్రణయంలో ప్రళయమైనా క్షణభంగురమే / ప్రళయంలో కూడ ప్రేమ ప్రేమేనని తెలుసుకో”
*
“దేవుడు రాసిన కథలలో నాది విరోధాభాసం / తృప్తిలేని మదిలోన నిరాశ పెదవులపై దరహాసం”
*
“విడదీయగలదు విధి ప్రేయసీ ప్రియులనీ
విడదీసి కలపడం విధికైన తెలియదు”
*
“చావు తనూ చనిపోవాలి / ఇలలో వలపు సదా బ్రతకాలి”
*
“చీకటికి తావసలే లేదు‌ నా‌‌ దృష్టిలో‌ / నా కన్నుల‌ వెలుగునది‌ నీ మెఱుపు మాత్రమే”
*
గొప్ప ఉర్దూ‌‌ గజల్ ను తలపించే సిసలైన గజలియత్ తో పి.బి. శ్రీనివాస్ వ్రాసిన ఓ తెలుగు గజల్ ఇది:

ఇలాగే నిన్నే తలచీ తలచీ పిలిచి పిలిచి నే చావాలా?
ఇలలోలాగే కలలోకూడా కలుసుకుని విడిపోవాలా?

భలేదానివేనే నా చెలియా! నా నుండి నన్నే విడదీశావు
కలపాలి తిరిగి నన్ను నిన్నూ అని నేనే నిన్నడగాలా?

వలచినదానివి నా మదిని దొలిచి వదలుటకెటు మనసొచ్చింది?
దొలచబడిన నా మదిలో గాయాలని కన్నీటితోనె కడగాలా?

ఒకటా రెండా లెక్కలేనన్ని నాకు నీవిచ్చు గాయాలు
వికటించే గాయాలనే నే గేయాలుగ పాడుతూండాలా?

విశ్వసాక్షినై అన్నీ చూసే నేను నినె చూసి వలచాను
ప్రియభాషిగ నేనెదిగీ, విఱిగి విరహ కవితలే రాయాలా?

ఆలించవె నా ఆత్మ మొఱలనో చెలి మదికరిగి
లాలించాలేకాని శోకమిడి విలపించేలా చేయాలా?

నా మదిని పిండి వేదన తీసి నా చేత నిప్పు తినిపించేవు
నా నిండు గుండె దోచుకుని యిలా ముక్కలుగ చేసివేయాలా?
*
ఈ గజల్ లో విశ్వసాక్షి , ప్రియభాషి అన్నవి పి. బి. శ్రీనివాస్ తఖల్లుస్ లు (కలం‌‌ పేర్లు).

ఉర్దూ కవులలా రెండు తఖల్లుస్ లనూ,‌ హుస్న్-ఎ-మత్ లాలనూ, ఒక గజల్ లో రెండుసార్లు తఖల్లుస్ నూ, తెలుగులో తొలిసారి రాసింది పీ.బీ. శ్రీనివాస్‌.

పీ.బీ. శ్రీనివాస్ గజల్ మీద యతి, ప్రాసలతో పాటు గజల్ లక్షణాలైన కాఫియా, రదీఫ్ లతో ఇలా ఒక వృత్తం రాశారు:

మల్లెల సరమై, తావుల వనమై మత్తును గొల్పెడి సౌరు గజల్
వెల్లువ వడియై, జీవన సుధయై వెన్నెల వెల్గెడి తీరు గజల్
అల్లగఁ గవితల్ కల్పన లలలై అప్సర మీటు సితారు గజల్
చల్లని తలపై, వెచ్ఛని వలపై సాగెడి తీగల తేరు గజల్.

తన గజళ్ల‌ ద్వారా పీ.బీ. శ్రీనివాస్ సహజమైన, సరైన, సొంపైన,‌ ఇంపైన గజలియత్ ను తెలుగులోకి తీసుకొచ్చారు.
పీ.బీ. శ్రీనివాస్ గజళ్ల ద్వారా తెలుగులోకి వచ్చిన‌ గజలియత్ ను అర్థం చేసుకోని తెలుగు గజల్ ‘గజల్’ గా ఇకనైనా పరిణమించాలి.

పలు నూతన ఛందో వృత్తాలను రూపొందించారు పీ.బీ. శ్రీనివాస్. గాయత్రీ ఛందః ప్రస్తారం ప్రాతిపదికగా షడక్షర గణాలతో గాయత్రీ వృత్తమ్ అన్న అద్భుతమైన వృత్తాన్ని సృష్టించారు పీ.బీ. శ్రీనివాస్.

1960వ దశాబ్దిలో అప్పటి జ్యోతి మాసపత్రికలో ‘స్వర లహరి’ శీర్షికతో సంగీత దర్శకులపై వ్యాసాలు రాశారు పీ.బీ. ఎస్. విజయచిత్ర, శివరంజని వంటి తెలుగు పత్రికల్లోనూ, తమిళ్ష్, కన్నడం పత్రికల్లోనూ పలు రచనలు చేశారు. పీ.బీ.ఎస్. ఒక న్యూమరాలజిస్ట్. ఆయన కొందరు వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు పేర్లు పెట్టారు. ఆయన మంచి హ్యూమరాలజిస్ట్.

చలన చిత్ర నేపథ్య గాయకుడు, అష్టభాషా కవి,‌ నూతన‌ ఛందస్సృష్టి‌కర్త, సంగీతవేత్త, గజల్ వేత్త, పాత్రికేయుడు, (పాత్రికేయుడిగా ఉద్యోగం చెయ్యలేదు) బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన
పీ.బీ. శ్రీనివాస్‌పై ఆంగ్లంలో, తమిళ్ష్‌లో, కన్నడంలో పుస్తకాలు వచ్చాయి. పీ.బీ. శ్రీనివాస్‌ గాత్రం, గానం కేంద్రంగా
తమిళ్ష్‌లో ఎస్. రామకృష్ణన్ అన్న ప్రముఖ రచయిత ‘విరుమ్బి కేట్టవళ్’ పేరుతో 2012లో ఒక కథ రాశారు.

పీ.బీ. శ్రీనివాస్ పేరుతో బంగళూరులో‌ ఒక పార్క్ ఉంది.

కర్ణాటకలో, తమిళ్ష్‌నాడులో
పలు పురస్కారాలు పీ.బీ. శ్రీనివాస్‌ను వరించాయి. తమిళ్ష్‌నాడు ప్రభుత్వ
‘ఇయల్ ఇసై నాడగ మన్ఱమ్’కు అధ్యక్షుడుగా పనిచేశారు పీ.బీ. శ్రీనివాస్‌.

కర్ణాటకలోని హంపి విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాకరమైన ‘నాడోజ’ పురస్కారంతో పీ.బీ. శ్రీనివాస్‌ను సత్కరించింది.

తెలుగు మధ్యతరగతి మాంద్యం, జాడ్యం ప్రధాన కారణాలు కాగా తెలుగులో మాత్రం పీ.బీ. శ్రీనివాస్‌కు సరైన స్థానం రాలేదు.


(వ్యాస రచయిత ప్రముఖ విశ్లేషకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here