(రోచిష్మాన్, 9444012279)
దేశ స్వాతంత్య్ర దినం అయిన ఇవాళ శ్రీ అరవిందుల వారి జన్మదినం కూడా.
ఇంగ్లిష్ పాలన నుంచి దేశానికి విముక్తి వచ్చినట్టుగా మనదేశానికి గాంధీత్వం-నెహ్రూత్వం నుంచీ, కాంగ్రెస్ నుంచీ, కమ్యూనిజమ్ నుంచీ, విదేశీ మతహింస నుంచీ కూడా సంపూర్ణ
విముక్తి రావాలి!
‘మన దేశం చైనాలా ఎందుకు అవలేదు’ అంటూ ఊళ పెడుతున్న మేధావులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ మనదేశం సింహభాగం నెహ్రూ కుటుంబ పాలనలో ఉంది అనీ, చైనా స్థాయి అభివృద్ధి మనదేశంలో జరగకపోవడానికి కారణాలు స్వతంత్ర భారత దేశ తొలిదశ పాలన చేసిన నెహ్రూ మేధ, ప్రవర్తన, తీరు, ఆలోచన, లక్షణం, లక్ష్యం అన్న ‘తెలివిడి’ని ఇకనైనా పొందాలి.
దేశానికి అంటుకున్న ఈనాటి ‘నిప్పు’కు మూలం ‘గాంధీ విశేష నైజం’ అన్న అవగాహన మనలో పలువురికి అత్యవసరం. గాంధీ జీవన సాఫల్యంగా ఇవాళ రాహుల్ మన దేశానికి పట్టాడు. గత పదేళ్ల రాహుల్ తీరు మనకు గాంధీతో పాటు ఆయన సాధించిన విజయమైన నెహ్రూ దెబ్బగా మన దేశంపై పడింది!
తమ జీవిత కాలంలో గాంధీని దగ్గఱకు రానివ్వలేదు. కలవడానికి ఇష్టపడలేదు మహనీయులు అరవిందులు. ఎంత ప్రయత్నించినా గాంధీ, అరవిందుల్ని కలవలేకపోయారు. గాంధీని తిరస్కరించారు అరవిందులు.
గాంధీపై అరవిందులవారికి ఉన్న అవగాహన అప్పట్లో మన దేశవాసులకు అర్థమై ఉంటే దేశానికి ఎంతో మేలు జరిగేదేమో? గాంధీ ప్రభావం మన దేశంపై లేకుండా ఇప్పటికన్నా దేశం ఎంతో మెరుగ్గా ఉండేదేమో? గాంధీ కారణంగా వచ్చిన నెహ్రూ ప్రభావమూ మనదేశానికి తప్పిపోయేదేమో?
గాంధీ విషయంలో అరవిందుల తెలివిడిని అప్పట్లోనే దేశం అవగతం చేసుకుని ఉంటే మతోన్మాదం కారణంగా మన భూభాగంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముక్కలు ఏర్పడుండేవి కాదేమో? ఇవాళ మనదేశం చైనా కన్నా గొప్పదయుండేదేమో?
ఈనాటి మనకు దేశ సంక్షేమం పరంగా అరవిందుల వారిని అవగతం, ఆకళింపు చేసుకోవడం అతి ముఖ్యం.
అన్ని రకాలా అరవిందుల ఔన్నత్యం అజరామరం.
స్వచ్ఛమైన భారతీయతా భావాల, జాతీయతా భావాల తొలిదశ మహనీయులు శ్రీ అరవిందులు. తొలిదశ స్వాతంత్య్ర సమర యోధులు వారు.
ఇంగ్లిష్ పాలకులు తొలిసారి ఇస్లామ్ మత ప్రాతిపదికన మన భూభాగాన్ని తూర్పు బెంగాల్ గా విభజించినప్పుడు అరవిందులు దానికి వ్యతిరేకంగా పోరాడారు. విదేశీమతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారు అరవిందులు.
విదేశీ మతోన్మాదంవల్ల మనమూ, మన దేశమూ కోల్పోయింది ఏమిటో, ఎంతో ‘మతి’తో చదివితే చరిత్ర ద్వారా తెలివిడి వచ్చేస్తుంది.
విదేశీ మతాల నుంచి, విదేశీ కొడవలి-సుత్తి నుంచి పెను ముప్పు పడగెత్తిన పాములా మన పక్కనే ఉంది. మనం అరవిందులను ఆకళింపు చేసుకుని ఆ ముప్పును మట్టుపెట్టాలి.
అరవిందుల స్ఫూర్తితో, అరవిందులపై అవగాహనతో ఇకనైనా గాంధీత్వం నుంచి విముక్తమై గాంధీత్వానికి అతీతమైన అంతర్జాతీయ శక్తిగా భారతదేశం ఒక మహోన్నత దేశంగా రూపొందాలి. తథాస్తు…
అరవిందుల ‘సావిత్రి’ రచనను ఓషో విశేషంగా ప్రశంసించారు. మనదేశంలో గొప్ప రచనల్లో అరవిందుల సావిత్రి ఒకటి.
అరవిందుల్ని “అభినవ శంకరులు” అని అనే వారున్నారు.
భారతీయతా భావాల, జాతీయతా భావాల ఆర్.ఎస్. ఎస్. కు మూలం మనకు అరవిందుల వారిలో కనిపిస్తుంది.
అరవిందుల వారిని ఆదర్శంగా తీసుకుని జాతీయతా భావాలతో మన భారతదేశాన్ని విదేశీ మతోన్మాదం నుంచీ, విదేశీ మాఫియాల నుంచీ, విదేశపు సుత్తి-కొడవలి దాడి నుంచీ కాపాడుకోవడం ఈ దేశ పౌరులంగా మన కర్తవ్యం.
“అరవిందులు భారత జాతీయతా భావాల వెలుగు”
మహనీయులు అరవిందుల స్మరణలో

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

