ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్
కాస్మటిక్ పోలీసింగ్ కాదు… కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని స్పష్టీకరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 11 : ప్రస్తుతం సమాజానికి కాస్మటిక్ పోలీసింగ్ కాదని, కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. యువత ప్రాణాత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని కంటికి రెప్పలా రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. చెరువుల ఆక్రమణదారులతో కఠినంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. హిమాయత్ సాగర్ లోని రాజా బహదూర్ వెంకటరాం రెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్.ఐ,ఎ.ఎస్.ఐ ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోలీస్ విభాగం తరపున రూ.11 కోట్ల 6లక్షల 83వేల 571 ముఖ్యమంత్రి సహాయనిధికి డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం.
తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు.
ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం.
గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం.
తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.

వ్యసనాలకు బానిసలైన కొంతమంది… డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలి.
మీ అందరిని చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోంది.
ఇది ఉద్యోగ బాధ్యత కాదు.. ఇది భావోద్వేగం.
తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉంది
ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే

డ్రగ్స్ , గంజాయిపై ఉక్కు పాదం మోపుతాం..
డ్రగ్స్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి.
తెలంగాణను కాపాడుకునేందుకే ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించండి.
50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.
50 ఎకరాల్లో వరంగల్ లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.

రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం.
ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదు.
మా ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది.
కేవలం 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేసాం.
కడుపు కట్టుకుని నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.

హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి.
వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి.
అందుకే చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం
అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడం.
ఆక్రమించుకున్న చెరువులను స్వచ్చందంగా వదలాలని ఆక్రమనదారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా..
లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం.
నాలాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తాం..
ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తాం..

మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తాం.
నివాసితులైన 11వేల మందిలో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రసక్తే లేదు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ అకాడమీలో క్రీడాభవనాన్ని ప్రారంభించారు.
