ఫిబ్రవరి 4 ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’
ఆత్మగౌరవాన్ని ఓట్ల ఆటగా మార్చిన గత పాలకులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 17 : స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తొలుత ఆయన అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగించారు. సెప్టెంబర్ 17 వ తేదీ విశిష్టతను వివరిస్తూ, ఆయన ప్రసంగం సాగింది. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే…

తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిన శుభదినం ఈ రోజు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈ రోజు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. 1948, సెప్టెంబర్ 17… ఈ పోరాటంలో ప్రజలు విజయం సాధించి, స్వేచ్ఛాపతాకను ఎగుర వేసిన రోజు. ఈ గడ్డపై రాచరికానికి గోరీ కట్టి… ప్రజా పాలనకు హారతి పట్టిన రోజు సెప్టెంబర్ 17. అందుకే ఇది ప్రజా పాలన దినోత్సవం. రాష్ట్ర ప్రజలందరికీ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.
స్వేచ్ఛ మన జీవన విధానం
స్వేచ్ఛ మన జీవన విధానం. ఆ స్వేచ్ఛా సాధనకు ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని జాతి మనది. దీనికి చరిత్రనే సాక్ష్యం. అణచివేత, పెత్తందారీతనం, నియంతృత్వం, బానిసత్వం సంకెళ్లను బద్ధలు కొట్టి స్వేచ్ఛకు ఊపిరి పోయడానికి ఊపిరి వదిలిన వందలాది మంది అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.

తెలంగాణ చరిత్రలో మైలురాయి
సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. డిసెంబర్ 7, 2023 స్వరాష్ట్ర ప్రజాస్వామ్య ప్రస్థానంలో మరోమైలు రాయి. లోతైన అవగాహనతో, సమకాలీన చరిత్రపై నిశితమైన విశ్లేషణతో నేను ఈ మాట చెబుతున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్లీ నియంతృత్వ నిర్భందంలోకి జారి పోయిన తీరు గడచిన పదేళ్లలో మనం చూశాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడిరచి, ప్రజా పాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక చారిత్రక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండి పోతుందని నేను భావిస్తున్నాను.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన
77 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, పోరాట చరిత్రను, ఇక్కడ ఉద్భవించిన ఉద్యమాల సరళిని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని మేం ఈ రోజు పరిపాలన చేస్తున్నాం. అహంకారపు ఆలోచనలు, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావు లేదు. కష్టమైనా, నష్టమైనా ప్రజలతో పంచుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షలు, వారి ఆలోచననే ప్రమాణికంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. తీసుకున్న నిర్ణయాలలో మంచి చెడులను విశ్లేషించే అవకాశం ఇస్తున్నాం. తప్పులుంటే దిద్దుకుంటున్నాం. మంచి చేయడమే బాధ్యతగా భావిస్తున్నాం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలన్న తపనతో పని చేస్తున్నాం. ప్రతి పేదవాడి ముఖంలో ఆనందమే లక్ష్యంగా సంక్షేమ చరిత్రను తిరగ రాస్తున్నాం.

ఏడు దశాబ్ధాలుగా తెలంగాణ ఆశిస్తోన్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వమే మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా. ఏ సామాజిక లక్ష్యాల కోసం తెలంగాణ తపించిందో, ఏ సమానత్వ సాధన కోసం మన గడ్డపై ఉద్యమాలు జరిగాయో ఆ పవిత్ర లక్ష్య సాధనే మా ప్రాధాన్యాలు. అభివృద్ధిలోనే కాదు... స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా ఉంటుంది.
విద్య విజయానికి తొలి మెట్టు…
తెలంగాణ సహజ చైతన్యానికి అక్షర చైతన్యం తోడై ఉంటే ఈ రోజు మన బిడ్డలు ప్రపంచాన్ని ఏలే స్థాయిలో ఉండే వారు. రాష్ట్రాభివృద్ధికి తల్లివేరు లాంటి ఈ అంశాన్ని మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తోంది. కేజీ నుంచి పీజీ లాంటి ఆకర్షణీయ నినాదాలతో సరిపెట్టడం కాదు… ఆచరణీయ కార్యచరణలో విద్యా వ్యవస్థను విశ్వ స్థాయి ప్రమాణాలతో పునర్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యనే మన విజయానికి వజ్రాయుధం అని మేం నమ్ముతున్నాం. ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవడమే కాదు… శాసించే స్థాయి తెలంగాణ యువతకు రావాలి. దానికి విద్యే మార్గం. అందుకే గొప్ప విజన్తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల ఆలోచన చేశాం. ఈ రోజు నేను చెబుతున్నాను. భవిష్యత్ లో తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ఈ స్కూళ్లు కేంద్రాలుగా మారబోతున్నాయి.
కొందరు సంకుచిత మనస్తత్వంతో ఆలోచన చేయవచ్చు. 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో స్కూళ్లు కట్టడం అవసరమా అని ప్రశ్నించ వచ్చు. ధనవంతుల పిల్లలు ఇంటర్నేషనల్ స్కూళ్లలో, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తున్నప్పుడు పేద బిడ్డలు మాత్రం ఇరుకు కూపాలలో, గాలి ఆడని గదులలో, క్రీడా సౌకర్యాలు లేని బడులలో మగ్గిపోవాలా!? వారి కలలకు రెక్కలు తొడగాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా!? అందుకే విద్యపై మేం చేస్తున్న వ్యయం ఖర్చు కాదు… భవిష్యత్ తెలంగాణకు పెట్టుబడిగా మేం భావిస్తున్నాం.
ఈ పాఠశాలల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్.ఆర్.బి.ఎం. పరిధి నుండి తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. బహుముఖ కోణంలో తెలంగాణ బిడ్డలు రాణించాలి అన్నది మా ఆలోచన. అందుకే విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇన్నోవేషన్ కు పెద్దపీట వేస్తున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు రేపటి తెలంగాణ భవితకు భరోసా కేంద్రాలుగా నిలుస్తాయి. పట్టెడన్నం పెడితే ఒక పూట ఆకలి తీరుతుంది… విద్యను అందించి, దానికి నైపుణ్యాన్ని జోడిస్తే జీవితమే నిలబడుతుంది. లక్షలాది యువత జీవితాలను నిలబెట్టాలన్న తపనతో మేం పని చేస్తున్నాం. రేపటి తరాన్ని యాచకులుగా కాదు… స్వీయ శక్తి మంతులుగా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్ర విద్యా పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం.

హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లతో పోటీ పడేలా వర్సిటీలు
తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలు నిజమైన ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయి. రాజకీయ నాయకత్వం కాడిపారేసిన ప్రతి సందర్భంలో యూనివర్సిటీల విద్యార్థులే ఉద్యమ నాయకత్వ బాధ్యత తీసుకున్నారు. స్వరాష్ట్రం సాధిస్తే యూనివర్సిటీలు బాగుపడతాయి, తమ భవిష్యత్ను తీర్చిదిద్దే ఆలయాలుగా నిలుస్తాయని ఆశించారు.
ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీలు గడచిన పదేళ్లలో నిర్వీర్యమై, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మిగిలాయి. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యూనివర్సిటీలను కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వంటి వర్సిటీలతో పోటీపడాలి అనే ఆశయంతో ఆలోచన చేస్తున్నాం. వర్సిటీలకు వెంటనే వీసీలను నియమించాం. రికమండేషన్లు కాదు… సామాజిక సమతుల్యతను పాటిస్తూ… మెరిట్కు ప్రాధాన్యత ఇచ్చి నియామకాలు చేపట్టాం. ఉస్మానియా వర్సిటీకి రూ.542 కోట్ల బ్లాక్ గ్రాంట్తోపాటు మౌలికవసతుల కల్పనకు రూ.100 కోట్లు అదనంగా కేటాయించాం. మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకుని, అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పనకు రూ.500 కోట్లు కేటాయించాం. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. తెలంగాణ వర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేశాం.

దేశానికే ఆదర్శంగా ఆడబిడ్డల విజయగాథ
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి తెలంగాణ వీర వనితలు పోరాటంలో ముందుండి నాయకత్వ పటిమను చాటారు. ఆ నాయకత్వ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నేడు ప్రజా ప్రభుత్వంలో మన ఆడబిడ్డల విజయగాథలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.‘‘మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి’’ నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందిరా మహిళాశక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ద్వారా ఆరు నెలల్లో రూ.15.50 లక్షల లాభాలు ఆర్జించి, అవకాశం ఇస్తే అద్భుతాలు చేయగలరని మన ఆడబిడ్డలు నిరూపించారు. డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖమ్మం ‘‘మహిళా మార్ట్’’ విజయవంతంగా నడుస్తోంది.రాష్ట్రంలో మరికొన్ని మహిళ మార్ట్ లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతు పక్షమే
ఆహార ధాన్యాల కొరత నుండి ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. హరిత విప్లవం నుండి ఉచిత విద్యుత్ వరకు, రుణమాఫీ నుండి రైతు భరోసా వరకు రైతుల కోసం మనం రూపొందించిన సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఆ వారసత్వాన్నే ప్రజా ప్రభుత్వం కూడా మరింత గొప్పగా కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకున్నాం.
ఇందిరమ్మ రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి సహకరించక పోయినా రైతుల సంక్షేమం విషయంలో రాజీ పడలేదు. కేవలం ఏడాది కాలంలో లక్షా నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం.

యువతకు ఉపాధి, ఉద్యోగ భరోసా…
ప్రజా ప్రభుత్వం తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ చేశాం. పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతతో, వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం. ఈ దేశ పరిపాలనా వ్యవస్థలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలి. అందుకే అఖిల భారత సర్వీసులకు వెళ్లాలని కోరుకునే తెలంగాణ బిడ్డల కోసం ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ ఆభయ హస్తం ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన 180 మంది తెలంగాణ అభ్యర్థులకు ఆగస్టు 11న ఈ ఆర్థిక సహాయాన్ని అందజేశాం. మెయిన్స్ కు ఎంపికైన వారికే కాక ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు సైతం లక్ష రూపాయల సహాయం, ఢిల్లీలో వసతి ఏర్పాటు చేస్తున్నాం. ఇలా ఆర్థిక సహాయం పొందిన వారిలో ఇప్పటి వరకు 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం తెలంగాణకు గర్వకారణం.
5 వేల మంది గ్రామ పాలనాధికారులు
భూ పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైంది. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా గత పాలకులు ముద్ర వేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని చక్కదిద్ది… రెవెన్యూ ఉద్యోగులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చి, ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించే దిశగా ప్రోత్సహించాం. అందులో భాగంగా భూ భారతి చట్టం తెచ్చాం. క్షేత్ర స్థాయిలో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఇటీవలే 5 వేల మంది గ్రామ పాలనా అధికారులను నియమించాం. వాళ్లు నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి, గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునర్ నిర్మిస్తారన్న నమ్మకం మాకు ఉంది.
42 శాతం రిజర్వేషన్లు… 23,973 మంది బీసీలకు సాధికారత
అధికారంలోకి రావడానికి ముందే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. అందులో భాగంగా వందేళ్ల తర్వాత అత్యంత శాస్త్రీయంగా కుల గణన చేశాం. దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ లో కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. మొదట మొండికేసిన బీజేపీ ప్రభుత్వం చివరకు కాంగ్రెస్ అగ్రనాయకత్వ ఒత్తిడికి తలొగ్గి, జన గణనలో కుల గణన చేస్తామని ప్రకటించింది. ఇది కచ్చితంగా మన విజయం.

ఈ కుల గణనలో తేలిన లెక్కల ఆధారంగా తెలంగాణలో విద్యారంగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి శాసనసభలో బిల్లులను ఆమోదించాం. ఆ బిల్లులకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాం. ఈ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సామాజిక న్యాయ సాధన ప్రక్రియకు మీరు మోకాలు అడ్డొద్దు. తక్షణం తెలంగాణ శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. తద్వారా 23,973 మంది బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం లభిస్తుంది. దేశ చరిత్రలో ఇది మరొక సామాజిక విప్లవంగా నిలిచిపోతుంది. ఆ క్రెడిట్ తెలంగాణకు దక్కాలన్నదే నా తపన.
ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం
దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్-1 లో 15, గ్రూప్-2 లో 18, గ్రూప్-3 లో 26 కులాలను చేర్చాం. ఈ ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే… షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై చర్చించి, చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించాం.
ఇందిరమ్మ గృహ ప్రవేశ జ్ఞాపకాలు గుండెల్లో పదిలం…
గడచిన పదేళ్లుగా డబుల్ బెడ్ రూం పేరుతో పేదల ఆశలతో గత పాలకులు ఆటలాడుకున్నారు. పేదవాడి ఆత్మగౌరవాన్ని ఓట్ల ఆటగా మార్చేశారు. ప్రజా ప్రభుత్వం అటువంటి విధానానికి వ్యతిరేకం. అందుకే ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా కనిపిస్తున్నాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్లలో చూసిన ఆనందం నాకు ఎనలేని తృప్తిని ఇచ్చింది.

తొలి విడతగా 22,500 కోట్ల రూపాయలతో, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికి గ్రీన్ ఛానెల్ లో నిధులు ఇస్తున్నాం. ఈ ఒక్క ఏడాదిలోనే నాలుగున్నర లక్షల మంది పేదలు సొంత ఇంటివారవుతారని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
5 లక్షల కొత్త రేషన్ కార్డులు
రేషన్ కార్డు… గ్రామాల్లో పేదవాడికి కేరాఫ్ అడ్రస్. రేషన్ కార్డు కేవలం ఒక కార్డు ముక్క కాదు. అది వారికి ఒక భావోద్వేగ పత్రం. దాని కోసం పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులకు ముగింపు చెబుతూ… జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. సుమారు 5 లక్షల కొత్త కార్డులను మంజూరు చేశాం.
సన్న బియ్యం సూపర్ హిట్…
తెలంగాణ అంటే దేశానికి ఆదర్శంగా నిలిచిన అన్నదాతలే కాదు. పేదలకు ఆకలి తీర్చే సన్నబియ్యం పథకం కూడా. సన్నబియ్యం సంక్షేమ పథకానికి ఈ రోజు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. రాష్ట్రంలోని 3.10 కోట్ల మంది నిత్యం సన్నబియ్యంతో ఈ రోజు భోజనం చేయగలుగుతున్నారు. ఇదీ ప్రజా ప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పులో ఒకటి.
నదీ జలాల హక్కుల్లో ఒక్క చుక్కను వదిలేది లేదు…
కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ జీవనాడులు. ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు. గత పాలకుల తప్పులను సరిదిద్ది, ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి సమాయత్తమయ్యాం.
ఇటీవలే మన ఇంజనీర్లకు, న్యాయ నిపుణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరేలా వ్యూహరచన చేస్తున్నాం. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే… శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది. 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్ఎల్బీసీని (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రజలకు అంకితం చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.

హైదరాబాద్ గేట్ వే ఆఫ్ వరల్డ్ గా మారాలి…
హైదరాబాద్ మహానగరం మన బలం. మన బ్రాండ్. ఈ బ్రాండ్ను భవిష్యత్ లో ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టే దీర్ఘ కాలిక ప్రణాళికలు రచిస్తున్నాం. 2035 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్నదే మా లక్ష్యం. అది సాధించిన నాడు భారత దేశానికే కాదు… ప్రపంచానికి హైదరాబాద్ గేట్వే గా మారుతుంది. ఆ దిశగా మొత్తం రాష్ట్రానికి మేం మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్, తెలంగాణ ఉండాలన్నది మన ప్రభుత్వ సంకల్పం. రోడ్లు, విద్యుత్, రహదారులు, రవాణా సదుపాయాలు, మురుగు నీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన, సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్ ను మార్చాలి. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హబ్గా మారుతోంది.హైదరాబాద్ నగరానికి వచ్చే వందేళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలు తీసుకువస్తున్నాం. దీని కోసం7360 కోట్ల రూపాయలతో గోదావరి 2,3 దశల పనులను ఇటీవలే ప్రారంభించుకున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా… మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఉండబోతున్నాయి.
ఓఆర్ఆర్పై తలపెట్టిన గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఒక గొప్ప స్వాగత తోరణంగా నిలుస్తుంది. 24 వేల కోట్ల రూపాయల అంచనాతో మెట్రో రెండవ దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నాం. ఇప్పుడున్న 69 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అదనంగా రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది.
డ్రగ్స్ పై ఈగల్ కన్ను
గడచిన పదేళ్లలో హైదరాబాద్ నగరం డ్రగ్స్కు గేట్ వేగా మారింది. విచ్చలవిడిగా డ్రగ్స్ లభ్యతకు మన నగరం వేదిక కావడం అత్యంత దురదృష్టం. పాలకుల నిర్లిప్తత, నిర్లక్ష్యం, దురాశ దీనికి కారణం. డ్రగ్స్ నిర్మూలన విషయంలో నాకు వ్యక్తిగతంగా గట్టి పట్టుదల ఉంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి డ్రగ్స్ పెనుభూతం. ఆ భూతాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఈగల్ వ్యవస్థను తెచ్చాం. 138 దేశాలు పాల్గొన్న ‘వరల్డ్ పోలీస్ సమిట్’ (డబ్ల్యూపీఎస్) 2025లో డ్రగ్ కంట్రోల్ కేటగిరీలో మన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రథమ బహుమతి అందుకోవడం మనకు గర్వకారణం. ఈగల్ ను ముందు ముందు మరింత పటిష్టం చేస్తాం. డ్రగ్స్ అనే మాట తెలంగాణలో వినబడటానికి వీలు లేదు. ఆ దిశగా అవసరమైతే మరింత కఠిన చట్టాలు తెస్తాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ వేదిక నుండి మరోసారి స్పష్టం చేస్తున్నాను.
తెలంగాణ రైజింగ్ 2047
స్వాతంత్య్ర భారత దేశం వందేళ్ల మైలురాయిని చేరుకునే శుభ సందర్భం 2047. ఆ సందర్భానికి మన దేశం చేరుకోవాల్సిన లక్ష్యాలు… ఆ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర… మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా నిలబెట్టే విజన్ పై మేం నిరంతరం శ్రమిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది.
ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో కీలకమైన పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల వెనుక ఉన్న ఆలోచన, ఆవిష్కరణ, ఆచరణ మార్గాలను ఈ విజన్ డాక్యూమెంట్ ప్రకటిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ… ఆధునిక ప్రపంచానికి గేట్వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది.
రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్-2047 లో విస్పష్టంగా చెబుతాం. బాపూ ఘాట్ వద్ద నిర్మించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టులు, మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టులు, ఔటర్ నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ -నాగపూర్, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ప్రణాళిక తెలంగాణ రైజింగ్ – 2047. ఈ సంకల్ప పత్రాన్ని కార్యచరణలో పెట్టి 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం.
మా సంకల్పానికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలి. సాయుధ పోరాట స్ఫూర్తితో మొదలైన మన ప్రయాణం… ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగిరే స్థాయికి చేరాలి. ఆ బాధ్యత మాది. మాకు సహకరించి, ఆశీర్వదించే బాధ్యత ప్రజలది.
జైహింద్…
జై తెలంగాణ అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.




