12 రోజుల్లోనే రూ 12 వేల కోట్లు: రేవంత్

Date:

రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల
లక్షన్నరలోపు 6.40 లక్షల రైతులకు మాఫీ
అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమ
రైతుల సంతోషంతో నా జన్మ ధన్యం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జులై 30 :
ఆగస్ట్ నెలలోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని, రెండు లక్షల రుణ భారం తీరటంతో నిజమైన స్వేచ్ఛను పొందారని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఈ జులై, ఆగస్ట్ నెలలు దేశ చరిత్రలోనే లిఖించదగ్గ నెలలని అభివర్ణించారు.
కేవలం 12 రోజుల్లోనే రూ.12 వేల కోట్ల రుణం మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి అద్దం పట్టిందని అన్నారు. రైతుల సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని, తమ ప్రభుత్వ ప్రణాళికలను ఎవరూ ప్రశ్నించలేరంటూ సవాలు విసిరారు.
ఏకకాలంలో రూ.31 వేల కోట్లు కేటాయించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని అన్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు.
సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీల నేతలకు రైతులు గుర్తుకు వస్తారని సీఎం అన్నారు. కానీ ఇప్పుడేం ఎన్నికల్లేవని, ఓట్లు లేవని.. రాజకీయ ప్రయోజనాలు కాదు.. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు.


అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతు రుణమాఫీ రెండవ విడుత నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలందరి సమక్షంలో పలువురు రైతులకు చెక్కులు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు.
ఇదే వేదిక నుంచి రెండో విడతగా రాష్ట్రంలో లక్షన్నర లోపు పంట రుణాలున్న రైతులందరి రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తం 6.40 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6198 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. రుణవిముక్తి పొందిన లక్షలాది రైతులు తమ ఇండ్లలో పండుగ చేసుకుంటుంటే తమ జన్మ ధన్యమైందని అన్నారు.


రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జులై 18న తొలి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 11 లక్షల మంది రైతులకు రూ.6098 కోట్లు మాఫీ చేసింది. పన్నెండు రోజుల వ్యవధిలోనే రెండో విడతగా మరో రూ.6198 కోట్లు విడుదల చేసింది.
అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఈ వేడుకలో పాలుపంచుకున్న నేతలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తామని 2022 మే 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిందని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులు సంతోషంగా ఉండాలని అధికారంలో చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రైతు రుణమాఫీ అమలు చేశామని చెప్పారు.
దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని, దివాళా తీసినట్లు మోసం చేశాయని అన్నారు. గడిచిన పదేండ్లలో బ్యాంకులకు దాదాపు రూ. 14 లక్షల కోట్లు ఎగవేశాయని అన్నారు. పది మందికి అన్నం పెట్టే రైతులు మాత్రం పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆత్మ గౌరవం దెబ్బతిని కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రైతుల కుటుంబాల్లో విషాదం ఉండకుండా ఆనందం నింపాలని రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.


గత ప్రభుత్వం రూ.లక్ష రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేక పోయిందని, మొదటి సారి అధికారంలో ఉన్నపుడు నాలుగు విడతల్లో మాఫీ చేస్తే.. రైతులు తమ అప్పుకు మించి మిత్తీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. రెండో సారి అదే హామీతో అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ఇస్తామని చెప్పి, రూ.12 వేల కోట్లు విడుదల చేసిందని అన్నారు. దాదాపు రూ.7 వేల కోట్లు రైతులకు రుణ మాఫీ చేయకుండా ఎగవేసిందని అన్నారు.
అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు తమను అవహేళన చేశారని అన్నారు. శాపనార్ధాలు పెట్టారని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ నెలలోగా రుణమాఫీకి ప్రణాళిక ప్రకారం నిధులను సమీకరించిందని చెప్పారు. ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి దేశంలోనే హరిత విప్లవం తీసుకు వచ్చారని, జైజవాన్, జై కిసాన్ నినాదాలతో దేశ భద్రత, ఆహార భద్రతకు అనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చిందని గుర్తు చేశారు. రైతులకు మేలు చేసేందుకే భాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిర్మించిందని, పేద రైతులకు తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేందుకు ఇందిరమ్మ బ్యాంకుల జాతీయికరణ చేసిందని, , సోనియా గాంధీ నేతృత్వంలోని మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తెచ్చిందని, రూ.72 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. విత్తనాలు, ఎరువుల సబ్సిడీ, ఉచిత విద్యుత్తు, పంటల బీమా, మద్దతు ధరలను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అప్పుడు .. ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ రైతు పక్షపాతి అని గుర్తు చేశారు.


ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లోనే లక్షన్నర లోపు రైతు రుణాలను మాఫీ చేశామని, అగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామని భరోసా ఇచ్చారు.
గత ప్రభుత్వం అప్పుల పాల్జేసి తెలంగాణను తాకట్టు పెట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి, రుణాల భారం తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు తమ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల్లో రూ.43 వేల కోట్లు కిస్తీలు చెల్లించిందని చెప్పారు. కేవలం 12 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.12 వేల కోట్లకుపైగా నిధులు జమ చేసిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ అధికారుల బృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


అటు రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్నామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

China and Trump Tariff war: China has upper hand

(Dr Pentapati Pullarao) The tariff –trade war, started by President...

A Movement of Hearts, Heritage, and Harmony

Culture, Language, Indian, and Connections (CLIC) & International Sweet...

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...