తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ ఆదేశాలు
సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయండి..
అతిథులు, సంస్థల ప్రతినిధులకు తగిన వసతులు కల్పించాలి…
క్షుణ్ణంగా ప్రాంగణం పరిశీలన
(భారత్ ఫ్యూచర్ సిటీ)
అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం సందర్శించారు. తొలుత హెలీకాఫ్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు.

అనంతరం ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రతి హాల్ను పరిశీలించారు. వివిధ సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాళ్లను నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవనం…. ఇతర కార్యక్రమాలకు సంబంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్ ను వీక్షించారు.

సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సీఎం అధికారులకు సూచించారు.

సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంశంపైనా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రాంగణం మొత్తాన్ని గంటకుపైగా కలియతిరిగారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కుందూరు జయ్వీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


