మన ఠీవి పీవీకి దక్కిన గౌరవం

Date:

ఎన్నాళ్లో వేచిన ఉదయం!!!.
పీవీ కి భారతరత్న అవార్డు
(బండారు రామ్మోహనరావు, 98660 74027)

భారతదేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడు, రాజకీయ చాణుక్యుడు, బహుభాషా కోవిదుడు, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని గట్టెక్కించిన మహానుభావుడు, మేరునగధీరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా పివికి భారతరత్న అవార్డు లభించడం ఎన్నాళ్లో వేచిన ఉదయంగా చెప్పవచ్చు.
దేర్ హై మగర్ అందేర్ నహి!!!.
అవార్డు ఎప్పుడు వచ్చింది అన్నదానికంటే ఎవరికి ఇచ్చారు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ పీవీకి భారతరత్న అవార్డు దక్కడం. దీనికి వెనుక ఉన్న ఇతరత్రా విషయాలు రాజకీయ కారణాలు పక్కన పెడితే ఇన్నాళ్ళకి ఒక తెలుగు బిడ్డకు మొదటి భారత రత్న గౌరవం దక్కడం మరింత ఆహ్వానించదగ్గది.

“దేర్ హై మదర్ అందేర్ నహి” అన్న ఉర్దూ సామెతను మనం గుర్తు చేసుకుంటే భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆలస్యమైనా సరే మంచి నిర్ణయమే తీసుకున్నారనిపిస్తుంది. ఇప్పటివరకు ఒక సంవత్సరంలో గరిష్టంగా నలుగురికి మాత్రమే భారతరత్న అవార్డులు లభించాయి. ఈసారి వరుసగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి సోషలిస్టు నాయకుడు కర్పూరి ఠాకూర్, ఆ తర్వాత బిజెపి వ్యవస్థాపక నాయకులు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానికి వారం రోజుల తేడాతో వెంటనే భారతరత్న ప్రకటించారు. ఆ తర్వాత ఈరోజు పివి గారితో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామి నాథన్ ను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. దీంతో ప్రస్తుత సంవత్సరములో వరుసగా ఐదుగురికి భారతరత్న అవార్డు ఇచ్చినట్లు అయింది.

పివి మన తెలుగువారి ఘన కీర్తి
పదహారణాల తెలుగుతనం

తెల్లటి ధోవతి లాల్చీ ఎడమ భుజం మీద కండువా పదహారణాల అచ్చమైన తెలుగుతనం ఆయన సొంతం. తన జీవితంలో రాజకీయ సామాజిక రంగాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా కూడా మొక్కవోని ధైర్యంతో నిశ్చలంగా నిలిచిన స్థితప్రజ్ఞుడు మన పీవీ నరసింహారావు.

28 జూన్ 1920లో వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి లో సీతారామారావు రుక్మాబాయి దంపతులకు జన్మించిన ఆయన తన ప్రస్తుత భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన సమీప బంధువులైన పాములుపర్తి రంగారావు రుక్మిణమ్మ దంపతులకు దత్తత వెళ్లారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం అప్పటి కరీంనగర్,వరంగల్ జిల్లాలో జరిగింది. తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. కొన్ని రోజులు అజ్ఞాతవాసం కూడా ఆయన గడిపారు. ఆ అజ్ఞాతవాస జ్ఞాపకాలు గానే పివి స్వయంగా రాసిన “గొల్ల రామవ్వ” కథ ఇప్పటికి కూడా మనకు గుర్తు చేస్తుంది. ఆ కథలో పివి గారే అజ్ఞాత హీరో. ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను అప్పటి నిజాం ప్రభుత్వం ఆయనకు కళాశాలలో ప్రవేశానికి నిరాకరించింది. అతి కష్టంగా మహారాష్ట్ర లోని నాగపూర్ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక అనేక రాజకీయ సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూనే తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించారు. తన సాహితీ తృష్ణను తీర్చుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన విశ్వనాథ సత్యనారాయణ “వేయి పడగలు” నవలను హిందీ భాష లోకి సహస్రఫణ్ అనే పేరుతో తర్జుమా చేశారు. బహుభాషా కోవిదుడు అయిన మన పీవీ నరసింహారావు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలతో సహా మరొక 14 భాషలు నేర్చుకొని బహుభాషా కోవిదుడుగా పేరుందారు.

పీవీ రాజకీయ ప్రస్థానం

పీవీ నరసింహారావు రాజకీయ ప్రస్థానం 1957 లో జరిగిన రెండవ సార్వత్రిక ఎన్నికల నుండి ప్రారంభమైంది. 1952, 1962,1967,1972 అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి కరీంనగర్ జిల్లా మంథని అసెంబ్లీ నియోజకవర్గ నుంచి వరుసగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా విద్య, వైద్య, సమాచార శాఖలు నిర్వహించారు. 1969 లో జరిగిన అప్పటి జై తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాలుగవ ముఖ్యమంత్రిగా 1971లో ఎంపిక అయ్యారు. ఆ తర్వాత 1972 లో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అంతకు ముందు ఉన్న 11+ 1 హెచ్ ఎస్ సి తర్వాత పియుసి విద్యా విధానాన్ని మార్చి 10 + 2 ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడే జూనియర్ కళాశాలల స్థాపన మొదలైంది. పివి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా వచ్చిన భూసంస్కరణలను మొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణలకు తన పార్టీలోనే అనేకమంది భూస్వాములు, జాగిర్దారుల నుండి అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. తాను సొంతంగా ఎనిమిది వందల ఎకరాల భూమిని భూసంస్కరణ చట్టం కింద “సర్ ప్లస్” ల్యాండ్ గా ప్రభుత్వానికి స్వాధీనం చేసి ముందుగా ఆ సంస్కరణలను తానే తన కుటుంబం నుండి తొలుత ప్రారంభించారు.
1972 తరవాత ఢిల్లీకి…
జై ఆంధ్ర ఉద్యమం 1972 లో మొదలైన సందర్భంగా పివి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అక్కడ నుండి ఆయన రాజకీయ నేపథ్యం ఢిల్లీకి మారింది. హనుమకొండ ఎంపీగా మొదలై 1977,1980 లో వరుసగా రెండుసార్లు హనుమకొండ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత 1984,1989 లలో మరొక రెండు సార్లు మహారాష్ట్రలోని రామ్ టెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వం లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో హోం శాఖ, రక్షణ శాఖలు నిర్వహించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశాంగ శాఖ మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు.1991 ఎన్నికలలో పోటీ చేయకుండా రాజకీయ సన్యాసం తీసుకుందామని అనుకున్న దశలో రాజీవ్ గాంధీ అకాల మరణం వల్ల తాను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అలా ప్రధానమంత్రిగా 1991లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో మరొకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించిన గాంధీ కుటుంబేతరుడు పివి ఒక్కరే. దక్షిణ భారతదేశ నుండి మొట్టమొదటి ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి బంగారాన్ని తాకట్టు పెట్టిన సందర్భంలో ఒక ఆశాకిరణం లాగా వచ్చిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో అధికారిగా ఉన్న మన్మోహన్ సింగ్ ని తన ఆర్థిక మంత్రిగా తీసుకొని ఐదు ఏళ్లలో తన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని గట్టెక్కించారు.

నేషన్ ఫస్ట్

వ్యక్తులు పార్టీల కన్నా దేశమే ముఖ్యం దేశ క్షేమమే మిన్న అని ఆచరించి చూపించిన ప్రధానిగా ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికైన అబ్దుల్ కలాం పివిని పొగిడారు. అణు పరీక్షలు జరపడానికి అవసరమైన ఏర్పాట్లు జరిపిన అణు కార్యక్రమాలకు కూడా పితామహుడుగా పివి తనకు తాను ఎక్కడా చెప్పుకోకపోయినా కూడా ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఎన్నికైన కాంగ్రెసేతర ప్రధాని బిజెపి వ్యవస్థాపక నాయకుడు అటల్ బిహారి వాజ్ వేయి అనేక సందర్భాలలో పివిని ప్రశంసించారు.

సామాన్ తయార్ హై!!!.

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండగానే అణు పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అప్పటి శాస్త్రవేత్తగా ఉన్న అబ్దుల్ కలాం నేతృత్వంలో పూర్తి చేశారు. ఈ లోగా ప్రభుత్వం మారి వాజ్ పేయ్ ప్రధానిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. “సామాన్ తయార్ హై” అనే సాంకేతిక పదబంధం వాడి ఆ తర్వాత రాజస్థాన్లోని పోక్రాన్ అణుపరీక్షలకి అవసరమైన సంకేతాన్ని ఆ తర్వాత ప్రధానిగా వచ్చిన వాజ్పేయ్ కి ఇచ్చినట్లుగా అబ్దుల్ కలాం స్వయంగా పేర్కొన్నారు.

శతజయంతి తర్వాత అవార్డు….

2020 పివి నరసింహారావు శత జయంతి సంవత్సర ప్రారంభంగా అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో హైదరాబాదులో నెక్లెస్ రోడ్ లో ఉన్న పివి జ్ఞానభూమిలో పెద్ద ఎత్తున పీవీ నరసింహారావు శతజయంతి ప్రారంభం ఉత్సవాలు నిర్వహించారు. ఆ తరువాత పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. పీవీ శతజయంతి సందర్భంగా భారతరత్న ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు ఇంకా చాలామంది దేశ ప్రజలు కూడా కోరుకున్నారు. ఆ కల, ఆకాంక్ష ఈరోజుకు నెరవేరింది. దేశం గౌరవించుకోదగిన వ్యక్తులలో పీవీ నరసింహారావు ఒకరు. ఈరోజు దేశ ఆర్థిక స్థితిగతులు బాగుపడి 2014లో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత దేశం నేడు ఐదవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఆనాడు పీవీ నరసింహారావు వేసిన పునాది కారణం దానిని గుర్తించిన కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయి ఉండి కూడా మన ప్రధానమంత్రి మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం మరింత అభినందనీయం.


(వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్ట్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...