ఈ తపోనిధి పురాణ ఇతిహాస నిధి హైందవ వాజ్మయ పెన్నిధి

Date:

ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ లేదా వేద పూర్ణిమ అని అంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 21 జూలై 2024న ఆదివారం నాడు గురు పూర్ణిమను జరుపుకోనున్నారు.

ఇది వేద వ్యాసుని జన్మ దినం. వ్యాస జయంతి. ఇతడు పరాశర మహర్షికి, సత్యవతికి కృష్ణ వర్ణం అనగా నల్ల రంగు తో ఒక ద్వీపంలో జన్మించాడు. కనుక “కృష్ణ ద్వైపాయనుడు” అని పేరుపొందాడు. శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ దెై్వపాయనుడే వ్యాసుడు. విష్ణుతేజం తో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు. అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో “వ్యాసాయ విష్ణు రూపాయ – వ్యాస రూపాయ విష్ణవే” అని తలచుకుంటారు
వ్యాసం వశిష్ట నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ॥

వశిష్టుని ముని మనుమడైన, కల్మషరహితుడైన శక్తికి మనుమడైన, పరాశరుని కుమారుడైన, శుకమహర్షి కి తండ్రియైన ఓ! వ్యాస మహర్షీ! నీకు వందనము . వశిష్ఠుని కుమారుడు శక్తి. శక్తి కుమారుడు పరాశరుడు. పరాశరుని కుమారుని కుమారుడు వ్యాసుడు. కృష్ణ ద్వైపాయనుడు ఆయన కుమారుడే శుక మహర్షి. పరాశరుడు తీర్థయాత్రలు చేయుచూ యమునా నదీ తీరానకేగెను. సత్యవతి దాశరాజు కుమార్తెను చూచి మోహితుడయ్యెను. ఆమె నడుపు నావను ఎక్కి ఆమెకు తన కోరికను చెప్పెను. తన తాప ప్రభావము చేత కన్యత్వము చెడకుండానే పుత్రుడు ఉదయించేటట్లు చేసేను. అలా సత్యవతికి జన్మించిన వాడే కృష్ణద్వైపాయన వేద వ్యాసుడు. వేద వ్యాసుడు పుట్టగానే తల్లికి నమస్కరించి, కృష్ణజినదండ, కమండలము ధరించి తల్లితో “అమ్మా నాతో పని కలిగినప్పుడు తప్పక తలంపుము” ఆక్షణమే నీ దగ్గరకు వచ్చి నీ పనిని పూర్తి చేసెదను అని తెలిపి లోక హితార్ధమై తపోవనములకు పోయి ఘోర తపము చేసెను. వేద వ్యాసుని వద్ద ఎందరో ఋషులు శిష్యులుగా చేరి విద్యార్జన చేసిరి . కొంత కాలమునకు కురు రాజు శంతనుడు సత్యవతిని మోహించి ఆమెను వివాహమాడెను. ఆ వివాహ సమయంలో సత్యవతి తండ్రి పెట్టిన నిభంధనల ప్రకారము సత్యవతికి జన్మించిన పుత్రునికే రాజ్యము ఇవ్వ వలెనను. శంతనునికి ఈ వివాహం పూర్వమే భీష్ముల వారు జన్మించెను. సత్యవతి శంతనుల వివాహ నిమిత్తంగా ఆజన్మ బ్రహ్మచారిగా వుండుటకు ప్రతిజ్ఞ చేసినారు. సత్యవతీ శంతనులకు చిత్రాంగద, విచిత్రవీర్యులను పుత్రులు కలిగిరి వారు యౌవనులు కాకుండానే మరణించిరి. విచిత్ర వీర్యుని భార్యలు అంబిక అంబాలికలు. చిత్రాంగద విచిత్ర వీర్యులకు వివాహము కాలేదు. భీష్ములవారు బ్రహ్మ చర్యములో ఉన్నారు. అంతట ఆసమయములో సత్యవతి తన పుత్రుడైన వ్యాసుని తలంపగా ఆయన ప్రత్యక్ష మయ్యెను. కురు వంశమును నిలపమని ప్రార్థించెను. అంతట వ్యాసుల వారు దేవర న్యాయమున అంబిక అంబాలికలకు సంతానము ప్రాప్తింపదలచెను. అంబికకు వ్యాసుల వారు పుత్ర దానమొనరింపగా ఆమె వ్యాసుని చూచి కనులు మూసుకొనెను. అందుకే ఆమెకు దృతరాష్ట్రుడు గుడ్డివానిగా జన్మించెను. వ్యాసుని వలన అంబాలికకు సంతాన తృప్తి కలుగ చేయు సందర్భములో ఆమె వెల్లనై పడిఉన్న కారణముగా ఆమెకు పాండురోగి అయిన వ్యక్తి పాండురాజు ఉద్భవించెను. అంబికకు అంధుడు జన్మించును కావున మరల పుత్రప్రాప్తి కలుగ చేయుము అని అడుగగా అంబిక స్థానములో దాసిని ఉంచెను. అందువలన దాసీవలన యముని అంశతో విదురుడు పుట్టెను. యమునికి మాండవ్యముని శాపం వలన యీవిధంగా విమరుని రూపంగా జన్మింపవలసివచ్చినది. ఈ విధముగా వ్యాసమహర్షి వలన కురు వంశం నిలపబడినది. విశేషం ఏమిటంటే మహా భారతం రచన చేసినది వేదవ్యాసుల వారు. ఆయన అనుగ్రహం లేకుంతోనే కురు పాండు వంశాలు ఉద్భవించాయి. ఒక కోణంలో మహా భారతం యుద్దం జరగడానికి ములకారకుడు కూడా వ్యాసుల వారే. ధృతరాష్ట్రునికి గాంధారి వలన దుర్యోదనొదులునూ, పాండురాజు వలన పాండవులు కలిగిరి. పాండురాజు మరణానంతరం సత్యవతీ, అంబిక, అంబాలికలకు ధర్మబోధ చేసి వనవాసముకు పంపి వారికి పుణ్యగతులను పొందుటకు మార్గదర్శకులయ్యారు వేదవ్యాసుల వారు.

అద్వితీయమైన గురుపరంపరకు సంప్రదాయం మన జీవనవిధానం. :
గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది.మనకి జ్ఞానాన్ని అందించి… ఏది మంచో, ఏది చెడో చెప్పే వారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి ఆషాడ శుద్ధ పూర్ణిమ. చతుర్వేదాలను, పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకందించిన వ్యాసభగవానుడు జన్మించిన రోజును వ్యాసపూర్ణిమ,. ఆషాఢపౌర్ణమి రోజున సప్తర్షులకు జ్ఞానబోధ చేశా డని శివపురాణం చెబుతోంది. “వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే”“నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః”వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి. అంతే కాదు, విష్ణు అవతారంగా భావించే వ్యాసుడ్ని పూజించి విష్ణుపురాణం దాన మివ్వడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడంతో పాటు శుభఫలితాలుంటాయన పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణజన్ముడి జన్మకు ప్రయోజనం మాన వాళికి చతుర్విధ పురుషార్థ సాధన రహస్యాలను బహువిధాలుగా బోధించటం. అందుకే ఆయన జగద్గురువులకే గురువుగా నిలిచిపోయాడు. అగమ్యంగా ఉన్న వేదరాశి చిక్కులు విప్పి, చక్కబరచి,అధ్యయనానికి అనువుగా చతుర్వేదాలుగా విభజించి, వైదిక ధర్మప్రవర్తనం చేసిన ఆది గురువు వేదవ్యాసుడు. . వేదాల్ని నాలుగు భాగాలుగా విభిజించి క్రిష్ణ ద్వైపాయనుడు, వేద వ్యాసుడిగా మారాడు. నాలుగు వేదాలను తన శిష్యులకు బోధించి వారిచే ప్రచారం చేయించాడు. శిష్యుల్లో రుగ్వేదం పైలునికి, యజుర్వేదం వైశంపాయునికి, సామవేదం జైమినికి, అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు.

అష్టాదశ పురాణములు:
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం. భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం. బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వచుతష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి. పంచమవేదమైన భారతేతిహాసం ద్వారా ‘ధర్మాన్నిఆచరించండి. అన్నీ లభిస్తాయి’ అని పదేపదే ఎలుగెత్తి ఘోషించిన సకల లోక హితైషి సాత్యవతేయుడు. అర్థ కామ సాధనల విషయాలను విస్త రించి, అనేక నీతి కథల భాండాగారాలైన అష్టాదశ పురాణాల ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆప్తుడు వ్యాసుడు. బాదరాయణ బ్రహ్మ సూత్రాల ద్వారా వేదాంత సారాన్ని సూత్రీకరించి, మనుషులం దరికీ మహత్తర లక్ష్యమైన మోక్ష పురుషార్థానికి బంగారు బాట పరచిన వాడూపరాశరుడే. ఇంతటి మహోపకారి అయిన ఈ జ్ఞాన చంద్రుడు ఉదయించిన ఆషాఢ పూర్ణిమ శుభతిథిని ఆసేతు శీతాచలమూ గురు పూర్ణిమ పర్వదినంగా జరుపుకోవటం సర్వవిధాలా సముచితమైన సంప్రదాయం. ఆ సందర్భంగా ప్రత్యేకంగా అస్మాదాచార్య పర్యంతమైన గురుపరంపరను సాదరంగా స్మరించుకొని, యథాశక్తి కృత జ్ఞతను ప్రకటించుకోవటం మన కనీస కర్తవ్యం.
(వ్యాస రచయిత ప్రముఖ విశ్లేషకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...