మతానికి, కులానికి, భాషకు అతీతంగా… కళాత్మకంగా…
చెంబై వైద్దియనాద అయ్యర్ - కె.జె. ఏసుదాస్
(రోచిష్మాన్, 9444012279)
మంచి గాత్రంతో పుట్టి, శాస్త్రీయ సంగీత గాయకుడవ్వాలనుకున్న నిమ్న అనబడిన వర్గానికి చెందిన క్రైస్తవుడనబడుతున్న (నిమ్న వర్గాలు అవడం, ఆ హిందు నిమ్నవర్గాలు క్రైస్తవులవడం ఏమిటో? ) ఏసుదాస్కు బ్రాహ్మణ అని అనబడుతున్న వర్గానికి చెందిన వైద్దియనాద అయ్యర్ కళను నేర్పారు. తన సరసన కూర్చోబెట్టుకున్నారు. ఇది దేన్ని సూచిస్తోంది? చదువు, విజ్ఞతలేని దుష్టులు, మూర్ఖులు కొందరి మేధ ప్రకారం ఈ వైద్దియనాద అయ్యర్ మనువాది. ఎంతో విఖ్యాతమైన ఈ మనువాది ఏ సాంఘీక స్థాయీ లేని అతి సామాన్యుడైన ఏసుదాస్ను అక్కున జేర్చుకుని తనంత స్థాయిలో చూసుకున్నారు.
మనువాదిగా పుట్టని ఓ ఏసుదాస్ మనువాది అయిన తన గురువు స్థాయికి చేరుకున్నారు. విద్య, అభ్యాసం, ఆలోచనా సరళి, విద్య, విద్వత్ మేధ ఏసుదాస్ను ఒక మహోన్నతమైన కళాకారుణ్ణి చేశాయి. ఏసుదాస్ ఒక చరిత్ర ఇవాళ.
వైద్యనాద అయ్యర్-ఏసుదాస్ అన్న సంఘటన కుల, మతోన్మాదులకు బుద్ధిచెప్పే సత్యం. కులం పేరుతోనూ, మతం పేరుతోనూ మాత్రమే బతుకుతూ (మనిషిగా బతకడం చాతకాక) ఈ దేశానికి కీడు చేస్తున్న భ్రష్టులు, దుష్టులు తమ నీచత్వానికి అతీతంగా ఈ చరిత్రను చదవాలి. ఆపై వాళ్లు మామూలు మనుషులవాలి.
ఈ దేశంలో బ్రాహ్మణ, నిమ్న, దళిత DNA లేదు; లేనేలేదు. అందరిదీ ఒకటే DNAనే. జన్మతః మనుషులు ఉచ్చం, నీచం అవరు. మనుస్మృతి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది.
ఏది మనుస్మృతి? ఏది మనువాదం? ఎవరు మనువు? ఎంతమంది మనువులు? ఇవేవీ తెలియకుండానే మనువాదం, మనువాదం అని అరుస్తూండడం మూర్ఖత్వం; విద్వేషవాదం; మానసిక రోగం.
కొన్ని వందలయేళ్ల క్రితం ఎవరికి వాళ్లు వాళ్ల, వాళ్ల మనస్తత్వాలకు అనుగుణంగా కొన్ని జీవన విధానాలకు లోబడ్డారు, కొన్ని ఆహారపు అలవాట్లను చేసుకున్నారు, జీవన విధానాలకు సంబంధించిన ఆలోచనా సరళికి లోబడ్డారు
వాళ్లవల్ల, వాళ్ల సంతతివల్ల ఈ కులం అన్నది ఏర్పడి అటు తరువాత రూపునూ, రంగునూ మార్చుకుంటూ సాంఘీక, రాజకీయ అవసరాల, ప్రయోజనాల కోసం ఇవాళున్న స్థితికి వచ్చింది.

ఈ వైద్దియనాద అయ్యర్, ఏసుదాస్ వంటి వాళ్లు ఇంకొందరూ ఉన్నారు. ఎందరో ఏసుదాస్లు వైద్దియనాద అయ్యర్లుగా అయ్యారు.
గత వెయ్యేళ్లుగా ఈ దేశంలో వైద్దియనాద అయ్యర్లు ఎందరో ఏసుదాస్లను రూపొందిస్తూనే ఉన్నారు.

భీంరావ్ను అంబేడ్కర్ చేసింది ఎవరు? ఒక భీంరావ్ మరో భీంరావ్ను అంబేడ్కర్ చేసిన దాఖలాలున్నాయా? అంబేడ్కర్లు తప్ప మరెవరైనా
భీంరావ్లను అంబేడ్కర్లను చేశారా?
వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు ఎందరో అధోజగత్ జనాలను అక్కున చేర్చుకున్నారు. మనవాళ మునిగళ్ నిమ్నవర్గాలు అనబడుతున్న పలువురిని కొన్ని శతాబ్దుల క్రితమే బ్రాహ్మణుల్ని చేశారు. బ్రాహ్మణులైన ఆ నిమ్న, దళిత అనబడుతున్న వర్గ జనాళి ఇవాళ ఆలయాల్లో అర్చకులుగా ఉన్నారు! దళితులు అనబడిన కొందరు ఆళ్ష్వారులకు ఆలయాలు, ఆ ఆలయాల్లో బ్రాహ్మణులు అనబడుతున్న వాళ్లు అర్చనలు చేస్తున్నారు. చరిత్రను పరిశీలిద్దాం; నిజాల్ని తెలుసుకుందాం. దళితులకు ఆలయ ప్రవేశం ఉందా? అని భుక్తి కోసం రచ్చ చేస్తున్న అసాంఘీక శక్తులు చరిత్ర చెబుతున్న నిజాలను చదవాలి. అజ్ఞానం, ఉన్మాదం, మానసిక రోగం కాదు చదువు, సంస్కారం కావాలి.
దళితులు అని పరిగణించబడుతున్న వారు ప్రభుత్వ ప్రధానకార్యదర్శులయ్యారు, రాష్ట్రాలకు గవర్నర్లు అయ్యారు, ప్రధాన న్యాయమూర్తులయ్యారు, ఎన్నో, ఎంతో ఉన్నతమైన పదవుల్లోకి వెళ్లారు. ఇవాళ మనదేశంలోనే అత్యుత్తమ పదవి అయిన రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఎవరు? పుట్టుక కాదు పెరిగిన తీరు, ఉన్న స్థితి, జీవన విధానం, ఆలోచనా సరళి, ప్రవర్తన, మనస్తత్వం ఒక వ్యక్తి స్థాయిని, స్థితిని నిర్ణయిస్తాయి.

ఏసుదాస్ తన జన్మ కులం, మతం రెండిటినీ వదిలేసి తాను ఎన్నుకున్న స్థితిలో గొప్ప, చారిత్రిక జీవనం చేస్తున్నారు. మామూలుగా వేదికలపై మాట్లాడుతున్నప్పుడు కూడా ఏసుదాస్ బ్రాహ్మణ భాష మాట్లాడతారు. బ్రాహ్మణ తమిళ్ష్ అంత తేలిగ్గా అబ్బేది కాదు. ఆయన మలయాళి అయినా ఆయన బ్రాహ్మణ తమిళ్ష్ మాట్లాడతారు. ఏసుదాస్ సంగీతాన్ని సాధించుకున్నట్టుగా ఉన్నతమైన జీవన శైలిని సాధించుకున్నారు. మనదేశ కుల, మత ఉన్మాదులకు, మానసిక రోగులకు ఏసుదాస్ ఒక పాఠం.
సరైన చదువులేక, చరిత్ర తెలియక, ప్రతిభలేక, తిన్ననైన ప్రవర్తనలేక, మానసిక రోగంతో
కులం, కులం, మతం, మతం అంటూ విద్వేషవాదులు, అసాంఘీక శక్తులు, ఉన్మాదులు మనదేశ సామాజిక సామరస్యతకు, సగటు మనిషి జీవనానికి, ప్రాణానికి పెనుముప్పుగా తయారయ్యారు. ఇది ఈ దేశానికి ఎంతో హానికరం. ఈ హానిని మనం రూపుమాపాలి.
చెంబై వైద్దియనాద అయ్యర్ కె.జె. ఏసుదాస్ అన్న చారిత్రక సత్యం మన సమాజంలోని కుల, మత ఉన్మాదులకు, మానసిక రోగులకు సరైన, మేలైన వైద్యం.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

