ఆ విషయం పివి చెప్పినప్పుడు… కాళోజి ఏంచేశారంటే

Date:

అతను ప్రధానితో రహస్యంగా ఏం మాట్లాడి ఉంటారు?
అందుకే మహానుభావులు అంటారు
జర్నలిస్ట్ జ్ఞాపకాలు
(బుద్దా మురళి)

ప్రధానమంత్రితో ఎవరైనా ఒక అరగంట ఏకాంతంగా మాట్లాడితే ఏం మాట్లాడి ఉంటారు . ఇప్పుడంటే ఆఫీసులో కూర్చొని ఏం మాట్లాడారో తోచింది రాసుకునే మహానుభావులు ఉన్నారు కానీ అప్పుడలా కాదు … ఏం మాట్లాడి ఉంటారు? అధికారులను, జర్నలిస్టులను, రాజకీయ నాయకులను అందరి మెదడును తొలిచిన ప్రశ్న. ఐతే ప్రధాని చెప్పాలి , లేదంటే ఆ కలిసిన వ్యక్తి చెప్పాలి. కలిసిన వ్యక్తి కాసింత కోపంతో రుస రుస వెళ్లిపోతుంటే , ఏం మాట్లాడారు అని అడిగితే , వెళ్లి ఆయన్నే అడగండి అని వెళ్లి పోయారు . అలా వెళ్లి పోయిన వారు కాళోజీ , అప్పుడు ప్రధాని పివి నరసింహారావు …


1994లో ప్రధాన మంత్రిగా తొలిసారి పివి నరసింహారావు వరంగల్ జిల్లాకు వచ్చారు. వరంగల్ పివి సొంత జిల్లా. పుట్టింది పెరిగింది, ఎదిగింది వరంగల్ జిల్లాలో, దత్తత వెళ్ళింది కరీంనగర్ జిల్లా. పివిని సాహిత్య, రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దింది వరంగల్ జిల్లా . పివి వరంగల్ఢి నుంచి ఒక పత్రికను కూడా నడిపించారు. ఢిల్లీ రాజకీయ జీవితాన్ని ముగించి వరంగల్ వచ్చి తిరిగి సాహిత్య జీవితాన్ని ప్రారంభించాలి అనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఉద్దేశంతో ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. నేను వచ్చేస్తున్నా, సాహిత్యంతో గడుపుదాం అని మిత్రులకు సమాచారం కూడా ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరగవు, రాజకీయ జీవితాన్ని వదిలేద్దాం అని నిర్ణయించుకున్న వ్యక్తి రాజీవ్ గాంధీ హత్యతో ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా వరంగల్ వచ్చారు. అప్పుడక్కడ దాదాపు అరడజను మంది జర్నలిస్ట్ లే ఉండేవారు. వరంగల్ జిల్లా రిపోర్టరుగా నేనూ అక్కడున్నాను.
ఇప్పుడంటే ప్రధాని ఢిల్లీలోనే తొమ్మిదేళ్లయినా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. అప్పుడు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వరంగల్ లో పివి ప్రధానిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ప్రశ్నించే అవకాశం కూడా లభించింది. బిసిలకు టికెట్ల గురించి అడిగితే, ఎక్కువ సీట్లు ఇవ్వడం గురించి చెప్పారు. చాలా మంది రాజకీయ నాయకులు అడిగిన మనిషి ముఖంలోకి చూసి సమాధానం చెబుతారు. ఎంతో సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని , ఎన్నో మార్పులు చూసిన జీవితం కాబట్టి పివి నరసింహారావు ఎదుటి వారిని చూడకుండా చెప్పాల్సింది చెప్పేశారు. అది స్థిత ప్రజ్ఞత అనుకున్నా, నిర్లిప్తత అనుకున్నా ఆయనకు పోయేదేమీ లేదు .


పివి నరసింహారావు గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం లో కాళోజీ నారాయణ రావు తో సమావేశం లేదు. చిన్ననాటి మిత్రుడు కాదనేవారు ఎవరు. గెస్ట్ హౌస్ లో పివి, కాళోజీ ఇద్దరే అరగంటకు పైగా ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. పివి ప్రధాని అయ్యాక వారి బంధువులు చాలా మందికి గ్యాస్ ఏజెన్సీ లు వచ్చాయి. అప్పటి ఆంధ్రప్రభ రిపోర్టర్ ఎంకౌంటర్ వార్త మిస్ అయితే ఉద్యోగం పోయింది. పివి అతని బతుకుతెరువు కోసం మరో వ్యక్తితో కలిపి గ్యాస్ ఏజెన్సీ ఇప్పించారు. బతుకు తెరువు కోసం ఇలా ఉపాధి మార్గాలు చూపడం తప్ప భారీ కాంట్రాక్టులు, వందల కోట్ల కుంభకోణాలు అంటూ లేవు.
ప్రధానితో అరగంట భేటీ అంటే ఏ భారీ కాంట్రాక్టునో, ఎవరికి మంత్రి పదవో, ఢిల్లీలో ఏదో పెద్ద పనే ఉంటుంది అనుకుందామా అంటే అక్కడున్నది కాళోజీ నారాయణరావు. ప్రజలు గోడును నా గోడు అనుకునే రకం. అడిగితే ఆయన్నే అడగండి అని విసవిసా వెళ్లిపోయారు. పీవీని అడగలేం. ఏమై ఉంటుందా ? అనే సందేహం బుర్రలో అలానే ఉండిపోయింది .


అటు తరువాత నేను హైదరాబాద్ వచ్చాను. వరంగల్ విషయాలు అక్కడే మరిచిపోయాను.
ప్రధానిగా పివి పదవీ కాలం ముగిసిన తరువాత 2001-02 ప్రాంతంలో పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో కాళోజీ నారాయణ రావుకు సహస్ర చంద్ర దర్శనం పేరుతో సన్మానం. ఆ సభలో పివి నరసింహారావు పాల్గొన్నారు. కాళోజీ గురించి మాట్లాడుతూ 94లో వరంగల్ లో వారిద్దరి మధ్య జరిగిన సమావేశం గురించి చెప్పారు. ప్రధాన మంత్రితో దాదాపు అరగంట ప్రత్యేకంగా సమావేశం అయితే రకరకాలుగా ఊహించుకుంటారు, ఏం వ్యవహారమో కానీ కాళోజీ ఏం మాట్లాడారో తెలుసా అని పివి వివరించారు. మనం యువకులుగా ఉన్నప్పుడు ఈ దేశం విధానాలు ఎలా ఉండాలని మాట్లాడుకున్నాం, ప్రధానిగా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అని కాళోజీ నిలదీశారట. పివి ప్రధాని అయ్యేనాటికి దేశంలోని బంగారం విదేశాల్లో తాకట్టు పెడితే కానీ బతకలేని పరిస్థితి. ఆర్ధిక సంస్కరణలు తీసుకువస్తే తప్ప మనుగడ లేని గడ్డు స్థితి. ఈ విధానాలను మిత్రుడి ముఖం మీదే కాళోజీ నారాయణరావు తీవ్రంగా విమర్శిస్తూ వెళ్లిపోయారట. పివి కానీ, కాళోజీ నారాయణరావు కానీ తమ సొంత బాగు చూసుకున్న వారు కాదు. అందుకే మహానుబావులుగా మిగిలిపోయారు. ప్రధానిగా ఉన్నప్పుడు తన మీద వేసిన కేసుల్లో వాదించిన న్యాయవాదులకు ఫీజు ఇవ్వడానికి సొంత ఇంటిని అమ్ముకున్న వారు పివి . ఆర్ధిక సంస్కరణల ఫలాలను దేశం ఇప్పుడు అనుభవిస్తోంది.
ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన సభలోనే .. సభలో కొందరు యువకులు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పాలని కోరారు. మా కాలంలో మాకు నచ్చింది చేశాం , మీ కాలం లో మీకు నచ్చింది చేయండి అని సమాధానం ఇచ్చారు. ప్రధానులు అందరికీ ఢిల్లీలో సమాధులు నిర్మించినా పివి లాంటి జ్ఞానికి అక్కడ చోటు లేకుండా పోయింది .
**
ఆర్ధిక సంస్కరణలు అమలు అయి పాతికేళ్ళు అయిన సందర్భంగా వివిధ రంగాల్లో వచ్చిన మార్పులతో పలు జాతీయ ఛానల్స్ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. బెంగళూరుకు చెందిన ఆర్ధిక నిపుణుడు ఒకరు తమ అనుభవాన్ని చెప్పారు. ఆర్ధిక సంస్కరణల కోసం దేశంలోని ఆర్ధిక రంగం మేధావులు అందరితో పివి ఓ సమావేశం నిర్వహించారు. మెజారిటీ మేధావులు సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు. అందరి అభిప్రాయాలు మౌనంగా విన్న పివి ముగింపులో దేశం పరిస్థితి ఇలా ఉంది. ఆర్ధిక సంస్కరణలు అమలు చేయడం మినహా మరో మార్గం లేదు అని ముగించారట … ఆ రోజు పివి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం ఈ రోజు దేశం తలెత్తుకొని నిలిచేట్టు చేసింది.


(ఫోటో వరంగల్ లో మడియాతో ప్రధాని పివి నరసింహారావు .. సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1994)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

BJP ‘s mistakes messing up 2024 elections?

(Dr Pentapati Pullarao) There is hardly one month left for...

భలే పింగళి – పాతాళభైరవి

కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు(డాక్టర్ వైజయంతి పురాణపండ) పాతాళభైరవి… ఈ పేరే...

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...