గానం ఒక యోగం-సంపాదన సాధనమే కాదు

Date:

ప‌ది కాలాల‌పాటు ప్ర‌జ‌ల నాల్క‌ల‌పై మాస్టారు
వారం వారం ఘంట‌సాల స్మృతి వారం
(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)
పేరు ప్రతిష్ఠలతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. తన ఎదుగుదలకు కారణమైన వృత్తిని/పనిని గౌరవించడం ఒక విధానమైతే, వచ్చిన పేరు నిలబెట్టుకోవాలన్న తపన మరో కారణం కావచ్చు. ఇది అన్ని రంగాల వారికీ వర్తిస్తుంది. ఒక స్థాయికి వచ్చాం కదా? ఎలా వ్యవహరిస్తే ఏమిటీ? అనే మనస్తత్వం కలవారూ ఉండవచ్చు. అందుకు భిన్నమైన వారే పదికాలాల పాటు ప్రజల నాల్కలపై నిలిచి ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో ముందుంటారు ఘంటసాల వేంకటేశ్వరరావు. వృత్తి విషయంలో రాజీ పడకపోవడం, శక్తిమేరకు ప్రయత్నించడం ఆయన విధానమని ఆయనను బాగా ఎరిగినవారు, పరిచయస్థులు చెబుతారు. ‘ఘంటసాల వారి నోట ఏ మాట వచ్చినా పాటే’అని ‘స్వర’జేశ్వరరావు(సాలూరి) లాంటి ప్రఖ్యాత సంగీత దర్శకుల నుంచి అభినందనలు అందుకున్నా ‘నేల’ విడవలేదు.అవకాశాలకు కోసం వెంటబడి, తీరా అవి దక్కాక వెనుకతిప్పుకోవడం ఆయన నైజానికే విరుద్ధం. వర్థ(ర్త)మాన గాయకులకు ఇది ఏ మేరకు అన్వయిస్తుందన్నది వేరే విషయం.బాగా పాడినందుకు ఎంత సంబరపడే వారో, పాటకు న్యాయం చేయలేకపోయానని భావిస్తే అంతగా బాధపడేవారు. గానం ఒక యోగమని, దానిని సంపాదనతోనే ముడిపెట్టడం భావ్యం కాదన్నది ఆయన అభిప్రాయం. ఘంటసాల వారి ఉచ్చారణలోనూ దోషాలు వెదికినవారూ లేకపోలేదు. వాటిని కొందరు ‘ప్రమాదో ధీమతామపి’ అని అభిమానంతో పట్టించుకోకపోయినా, అలాంటి పొరపాట్లను తనకే ఆపాదించుకున్న సమున్నతులు.


పరిశ్రమతోనే నమ్మకం
గాయకుడిగా ఎంతగా రాణిస్తున్నప్పటకీ, పాట పాడే విషయంలో ఆయనకున్న అంకిత భావాన్ని వారి తనయ ఘంటసాల శ్యామల గారి మాటల్లో చెప్పాలంటే ‘కవి ఎంతో అనుభూతితో రాస్తారు. సంగీత దర్శకుడు కష్టపడి స్వరాలు కూరుస్తారు. వాద్యబృందం (ఆర్కెస్ట్రా) శ్రద్ధగా వాయిస్తుంది. అలాంటప్పుడు మనని ఎవరేమంటార్లే! అనే అహంకారంతో తోచినట్లు పాడితే పాట నిస్సారమవుతుంది, అంతమంది శ్రమ వృథా అవుతుంది. అడిగేవారు లేనప్పుడే మరింత బాధ్యతగా వ్యవహరించాలి. వారి నమ్మకాన్ని కాపాడుకోవాలి నమ్మకాన్ని, ప్రేమాభిమానాలను శ్రమతో సంపాదించి, నిలబెట్టుకోవాలే కానీ డబ్బుతో కొనలేం’అని ఒక తమిళ పాటను అభ్యసించేటప్పుడు ఆమెతో అన్నారట. అందుకే ఆయన ‘యుగ గాయకుడు’. అంతేకాదు. నటులు శక్తిమేరకు నటించడానికి ప్రయత్నిస్తారని, వారి పెదాల కదలికలకు అనుగుణంగా నేపథ్య గానం అందించడం గాయనీగాయకుల ధర్మమని ఒక ముఖాముఖిలో చెప్పారు. దానిని ఆచరించి చూపారు కూడా. ‘శబ్దజ్ఞుడు మాత్రమే సంగీతజ్ఞుడుగా రాణిస్తాడు. కవి ఒక అభిప్రాయాన్ని ఏ భావంతో ప్రకటిస్తున్నాడో ఆ భావానికి అనుగుణమైన శ్రుతిలో, లయగతిలో అది ఉండాలి. వీటిని క్షుణ్ణంగా ఎరిగిన వారు ఘంటసాల’ అని ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి తన పాటలకు ఆయన బాణీలు కట్టిన అనుభవాన్ని జోడించి చెప్పేవారు. ముందుగా బాణీలు కట్టి పాట రాయించడానికి ఆయన వ్యతిరేకి అని, దాని వల్ల కవి స్వేచ్ఛ‌కు సంకెళ్లు వేసినట్లుగా భావించేవారట. ఒకవేళ కొన్ని సందర్భాలలో ముందుగానే బాణీ కట్టవలసివస్తే కవికి పరిస్థితిని వివరించి కావాలనుకున్న రచనను రాబట్టుకునేవారట. ‘పదరచన-స్వరరచన’పట్ల మంచి అవగాహన గలవారికే ఇది సాధ్యమని, అందుకే ఆయన ఎంత సుమధుర గాయకుడో, అంత స్వరస్రష్ట అని సినారె అన్నారు. ఘంటసాల వారు సినిమాలకు పాటలు రాయకపోయినా, ఇతర పాటలు రాసి బాణీలు కూర్చారు కనుక రచనలోని సాధకబాధకాలు తెలిసినవారు.


‘ననుపాలింపగ….’
పాడడంలో ఘంటసాల వారి అంకితభావానికి చిరు ఉదాహరణ. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయనంలో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుద్ధిమంతుడు’చిత్రంలోని దాశరథి ‘ననుపాలింపగ నడచీ వచ్చితివ’గీతానికి పరవశించిన ఆయన ‘చాలా మంచి పాట. నాలుక్కా లాలు బతికే పాట. ఇంకో రెండుమూడుసార్లు పాడుకొని సాధన చేస్తాను బాబూ! అప్పుడు రికార్డింగ్ చేద్దాం’ అన్నారని చిత్ర రచయిత ముళ్లపూడి వెంకట రమణ చెప్పేవారు. ప్రముఖ సినీగీత విశ్లేషకులు వీఏకే రంగారావు అన్నట్లు ‘కొన్నివేల పాటలు పాడి వందల పాటలకు వరుసలు కట్టి పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న తరువాత కూడా, ఈ పాటను మరి కొన్నిసార్లు సాధన చేసి పాడతాను’ అని ఆయన అనడం వృత్తి, కవి పట్ల గౌరవం, సాహిత్యమంటే గల ఆసక్తి నిదర్శనం. తాను ఇతరుల వల్ల ఇబ్బంది పడినా, తాను ఇతరుల బాధలకు, కష్ట నష్టాలకు కారణం కాకూడదన్న మనస్తత్వమే ఆయ నని అందరిని ఇష్టులని చేసింది.


జ్వ‌రం వ‌చ్చినా ల‌క్ష్య పెట్ట‌ని మాస్టారు
పని విషయంలో ఆరోగ్యాన్ని కూడా లక్ష్యపెట్టేవారు కాదట. వారి అర్థాంగి సావిత్రమ్మ గారు అందుకు ఒక ¬అనుభవాన్ని ఉదాహరించారు. ఎన్టీ రామారావుతో ‘శ్రీకృష్ణావతారం’ చిత్రీకరణ సాగుతోంది. అందులో భాగంగా ఒకటి,రెండు రోజులలో రాయబార ఘట్టాన్ని చిత్రీకరించవలసి ఉంది. నటీ నటులంతా తేదీలు ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ పద్యాల రికార్డింగ్ పూర్తి కాలేదు. ఆ సమయంలో ఘంటసాల జ్వరపడ్డారట. తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదంటూ అంత జ్వరంలోనూ రికార్డింగ్ కు వెళ్లారు. ఆయన పరిస్థితిని గమనించిన దర్శకనిర్మాతలు, సంగీత దర్శకుడు ‘తరువాత రికార్డింగ్ చేద్దాం’అని వారించారు. ‘ప్రయత్నించి చూద్దాం.పద్యాలను బాగా ఆలపించగలిగితే సరే! ఒకవేళ అనుకోనిది చోటు చేసుకుంటే విధి నిర్వహణలో ప్రాణం పోయిందనే తృప్తయినా మిగులుతుంది’అని పట్టుదలతో పాడారట. ఇప్పుడు ఆ సన్నివేశంలోని పద్యాలు వినేవారికి (చిత్రం చూసేవారికి) ‘జ్వరం’ వచ్చిందనే సంగతే స్ఫురించదు(చివరిదశలో భగవద్గీత గానం కూడా అలాంటిదే). సంకల్పబలం ముందు అనారోగ్యం ఏమీ చేయదని నిరూపించిన మనీషి. నిర్మాత శ్రేయస్సును కోరడం ఒక కారణమైతే, పద్యం ఆయనకు ప్రాణ సమానమవడం మరో కారణం కావచ్చు. వాటిని పాడడంలో ఆయన ఎదుర్కొన్న అనారోగ్య ఇబ్బందులు, నిర్మాతల ప్రయోజనం మాట అటుంచితే చిత్రంలోని పద్యాలు అజరామరమయ్యాయి. ఇలా చెప్పుకుంటే ఆయనేకం. (వ్యాస ర‌చ‌యిత ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Surprise move off Samajwadi Chief

Akhilesh Yadav wants to be prime Minister (Dr Pentapati Pullarao) Former...

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...