పకడ్బందీగా పోలీస్ ఉద్యోగ నియామకాలు: రేవంత్ ఆదేశం

0
42

పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా

అధికారులకు ముఖ్యమంత్రి సూచన

హైదరాబాద్, ఆగస్టు 04: పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు (vested interests) ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పాదర్శకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటలీజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

ఈ అత్యవసర సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, డీజీపీ సీవీ ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాస రావు, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here