గ్లోబల్ సమ్మిట్ తో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ సందేశం
న్యూ ఢిల్లీ, డిసెంబర్ 05: 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుండడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక, ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కాదల్చిన వారికి ఈ సమ్మిట్ ఒక వేదికగా అందిస్తుందని ఆమె తెలిపారు.

అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ-వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని సోనియా గాంధీ ఈ లేఖలో ప్రస్తావించారు.
తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్దికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందని ఆమె తెలిపారు. సమ్మిట్లో పాల్గొనే వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

