నా బ‌లం…బ‌ల‌గం మీరే: కేసీఆర్‌

Date:

కుల‌, మ‌త పిచ్చిగాళ్ళ క‌ట్ట‌డికి దృఢ‌నిశ్చ‌యం
మ‌నంద‌రి ధ్యేయం బంగారు తెలంగాణ‌
రంగారెడ్డి క‌లెక్ట‌రేట్ ప్రారంభ స‌భ‌లో సీఎం
హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 25:
త‌న‌కున్న బ‌లం.. బ‌ల‌గం మీరేన‌ని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు స్ప‌ష్టంచేశారు. కుల‌, మ‌త పిచ్చిగాళ్ళ‌ను క‌ట్ట‌డి చేయాల్సిందేన‌ని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మించుకోవాలంటే అంద‌రి స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను ఆయ‌న గురువారం ప్రారంభించారు. తొలుత ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొంగరకలాన్ లో నిర్మించిన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన కలెక్టరేట్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. జిల్లా నేతలు, అధికారులు స్వాగతిస్తూ పూల బొకేలు ఇవ్వగా, అర్చకులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.


మూడు అంత‌స్థులు… వంద‌కు పైగా గ‌దులు
ఆ తర్వాత కొంగ‌ర‌క‌లాన్‌లోని స‌ర్వే నంబ‌ర్ 300లో 44 ఎక‌రాల్లో రూ. 58 కోట్ల వ్య‌యంతో మూడు అంత‌స్తుల్లో, వంద‌కు పైగా విశాల‌మైన గ‌దుల‌తో నిర్మించిన క‌లెక్ట‌రేట్ స‌ముదాయం శిలా ఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి, కలెక్టరేట్ ను ప్రారంభించారు. కలెక్టరేట్ భవన సముదాయం అంతటా ముఖ్యమంత్రి కలియతిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఆదిత్యాత్మక రుద్రపూజ పూజ చేశారు.

కలెక్టర్ చాంబర్ లోని కుర్చీలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ను సీఎం కేసీఆర్ కూర్చుండబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. కలెక్టరేట్ నిర్మాణంలో భాగస్వాములైన వారికి సీఎం కండువాలు కప్పి, సన్మానించారు. అనంతరం వారితో కలిసి ఫొటోలు దిగారు.

ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పి.వి.వాణీదేవి, నవీన్ కుమార్, కసిరెడ్డి నారాయణరెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్య, జైపాల్ యాదవ్, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, మెతుకు ఆనంద్, ఎ.జీవన్ రెడ్డి, బాల్క సుమన్, జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, రత్నం, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, వేద సాయిచంద్ తదితర ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి తదితర నాయ‌కులు పాల్గొన్నారు.


అలాగే, వీరితోపాటు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, క‌లెక్ట‌ర్ అమ‌య్ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్,ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగంలో ముఖ్యాంశాలు
• తెలంగాణ ఉద్యమ సమయంలో రంగారెడ్డి జిల్లాలో తప్పుడు ప్రచారాలు చేశారు.
• భూముల ధరలు పడిపోతయని, మనం ఆగమవుతమని గోల్ మాల్ చేసిండ్రు
• 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నం.. రంగారెడ్డి జిల్లా బాగుపడింది.
• ఎక్కడ ప్రజలను చైతన్యవంతులను చేసే మేధావులు, యువత, ఏమరుపాటుగా నిద్రాణమై ఉంటరో.. అక్కడ ప్రజలు బాధలు అనుభవిస్తారు.
• ఒకనాడు మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డం


• మళ్లీ తెలంగాణ కావాలని 1969 ఉద్యమంలో పోరాడిన 400 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయిండ్లు. మలిదశ ఉద్యమంలో కూడా ఎందరో త్యాగాలు చేసిండ్రు
• ఈరోజు తెలంగాణ వచ్చినంక స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నం
• ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించినం. సాగు విస్తీర్ణం బాగా పెరిగింది.
• రైతుల కరంటు మోటార్లకు 24 గంటలు ఉచితంగా కరంటు ఇస్తున్నం.
• దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకంతో పంట పెట్టుబడి సాయం ఇస్తున్నం


• రైతు ఏదైనా కారణంతో మరణిస్తే.. రైతు బీమా పథకంతో పది రోజుల్లో ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో పడుతున్నయి.
• తెలంగాణ రైతులు పండించే వరిధాన్యం మొత్తం పంటను ప్రభుత్వమే కొంటున్నది. సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది.
• ఆంధ్రప్రదేశ్ లో ఉన్నపుడు ఇంత అభివృద్ధి జరుగుతుందని మనం అనుకున్నమా.. కానీ జరుగుతున్నది.
• రాష్ట్రంలో 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత, గీత తదితర వర్గాల వారికి పెన్షన్ ఇస్తున్నం
• మనకు ఈ రోజు పంటల తెలంగాణ కావాల్నా… మంటల తెలంగాణ కావాల్నా..
• విద్వేషంతో, మత పిచ్చితో మంటలు మండించడం సరైనదా? అని నేను అడుగుతున్న
• ఏం జరుగుతుంది ఈ రోజు భారతదేశంలో? కొందరు విద్వేషాలు రేపుతున్నరు.
• దీనిపై ఇట్లనే మౌనం వహిస్తామా.. మనం పిడికిలెత్తి పోరాడుదామా?


• రాష్ట్రం బాగున్నది.. దేశం పరిస్థితి చూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఒక్క మంచి పనైనా చేసిందా?
• ఒక్క ప్రాజెక్టు కట్టిందా? దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మహిళలకు ఎవరికైనా ఏమైనా చేసిందా?
• ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కరంటు ఉంటే వార్త… ఈరోజు కరంటు పోతే వార్త.


• దేశ ప్రధానమంత్రి గొప్పోడైతే.. దేశమంతటికీ 24 గంటల కరంటు ఎందుకివ్వడు?
• నదుల నుంచి నీళ్లన్నీ వృధాగా సముద్రంలో కలుస్తుంటే.. దేశమంతటికీ మంచినీళ్లివ్వరా?
• తెలంగాణలో 24 గంటలు కరంటు ఉంటది.. ఢిల్లీలో కరంటు సరిగా ఉండదు
• దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొడుతున్నరు


• తమిళనాడు, బెంగాల్లో ప్రభుత్వాలు కూలగొడుతమని బెదిరిస్తున్నరు
• ఈరోజు ఢిల్లీలో కూడా అట్లనే చేస్తున్నరు. ఒక్కో ఎమ్మెల్యేను 25 కోట్ల రూపాయలిచ్చి కొంటామని బాజాప్తా చెప్తున్నరు.
• ఒక ఇల్లుగానీ, ప్రాజెక్టుగానీ కట్టాల్నంటే చాలా టైము పడతది. కాని, రెండు మూడు రోజుల్లో దాన్ని కూలగొట్టొచ్చు.
• ఎన్నో ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నం. బాగు చేసుకుంటున్నం.
• తేడా వస్తే.. మళ్లా మంటల తెలంగాణ తయారైతది. గుర్తుంచుకోవాలె.
• బెంగళూరులో 30 లక్షలమంది ఐటీలో ఉద్యోగాలు చేసుకుంటరు.


• అక్కడ హిజాబ్ అని, హలాల్ అని వాతావరణాన్ని కలుషితం చేస్తే బెంగళూరు ఈ ఏడాది వెనుకబడి పోయింది. తెలంగాణ ముందున్నది.
• రంగారెడ్డి జిల్లాలో ఈరోజు భూముల కోట్లలో పెరిగిపోయినయి. రైతులు బాగుపడ్డరు.
• ఈరోజు ఓట్ల కోసం మతం మంటలు పెడితే మనం ఆగం కావాలెనా.. ఆలోచించండి
• మీకు ఇంకా ఏం కావాలె నరేంద్రమోడీ.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కారుకూతలేంది?
• తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినయి.


• ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విద్వేషంతో చిచ్చు పెడుతున్నరు.
• మత పిచ్చికి మనం లోనైన నాడు, వాతావరణం చెదిరిపోయిన నాడు పాత తెలంగాణ పరిస్థితులను అనుభవిస్తం.
• ఈ స్వార్థ నీచ, మతపిచ్చి గాళ్లను ఎక్కడికక్కడ తరిమికొట్టాలె.
• మోసపోతే గోస పడుతం. మేధావులు, కళాకారులు, బుద్ధిజీవులు యువతను కోరుతున్నా.. జాగ్రత్తగా ఉండాలె.
• రంగారెడ్డి జిల్లాలో చైతన్యం ఎక్కువ. దీనికోసం మీరంతా ముందుండాలె.


• ప్రేమతో అభిమానంతో ప్రజలంతా ఉంటే.. ఆ సమాజం బాగుపడుతది.
• కర్ఫ్యూలు, బందులతో అసహనంతో ఉంటే ఆగమవుతం
• శాంతియుత తెలంగాణను తెర్లు కాకుండా కాపాడుకోవాలె.
• నేను బతికి ఉండంగా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ తెలంగాణను ఆగం కానివ్వను.
• నాకున్న బలం, బలగం మీరే.. ఇట్లనే ముందుకు దూసుకుపోదాం, బాగు చేసుకుందాం.
• మంత్రి సబిత, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అడిగిండ్లు


• వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు గతంలో 5 కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులిచ్చినం.
• ఈ నిధులకు అదనంగా ఒక్కో ఎమ్మెల్యేకు మరో 10 కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులిస్తున్న,
• ఈ నిధులతో పనులు చేసుకోవాలె. బంగారు తెలంగాణ దిశగా తయారు చేసుకోవాలె.
• మత పిచ్చిగాన్లకు ఈ దేశంలో స్థానం లేదని మీరు నిరూపించాలె.
• మీ అందరి ఆశీర్వాదం ఉంటే.. ఇందుకోసం నేనే జెండా ఎత్తుత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can BJP make a mark in Tamil Nadu?

(Dr Pentapati Pullarao)  There is much discussion whether BJP...

2024 is not 2004 wait till 4th June

(Dr Pentapati Pullarao) 2024 is not 2004 There are many...

Typical ceremonies in Indian Tradition

My experience at the 'Dhoti (boy) and Half-saree (girl)...

ఉషశ్రీరామనవమి

(డా. పురాణపండ వైజయంతి) శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు...