Thursday, September 28, 2023
HomeArchieveమ‌న ప్ర‌భుత్వంపై ఏర్ప‌డిన న‌మ్మ‌కం ఇది

మ‌న ప్ర‌భుత్వంపై ఏర్ప‌డిన న‌మ్మ‌కం ఇది

గ్రాసిమ్ ఇండ‌స్ట్రీ ప్రారంభ స‌భ‌లో ఏపీ సీఎం
ఆదిత్య బిర్లాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం
గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లతో దాడి
బ‌ల‌భ‌ద్ర‌పురం, ఏప్రిల్ 21:
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ – క్లోర్ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్‌ సైట్‌( కాస్టిక్‌ సోడా యూనిట్‌)ను ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారం ఉద‌యం ప్రారంభించారు. సీఎంతో పాటు కార్యక్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా కూడా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ప్రతినిధులకు, ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అభినందనలు.
ఈ రోజు ఒక మంచి రోజు. అనపర్తిలో దాదాపుగా రూ.1000 కోట్ల ఖర్చుతో పరిశ్రమ పెట్టారు. మూడు దశలలో కలిపి దాదాపుగా రూ.2470 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 2450 మందికి ఉద్యోగాల కల్పించే గొప్ప కార్యక్రమం ఇది.


ల‌క్ష పైగా ఉద్యోగాలు క‌ల్పించిన బిర్లా
వేదికపై ఉన్న కుమార మంగళం బిర్లా గురించి, ఆదిత్య బిర్లా గ్రూప్‌ గురించి నాలుగు మాటలు చెప్పాలంటే… దేశవ్యాప్తంగా రూ.6 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ, దాదాపుగా 1 లక్షా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మంచి వ్యక్తి, మంచి పారిశ్రామికవేత్త.
ఇలాంటి వాళ్లు ఇక్కడికి రావడం, మన ప్రభుత్వం మీద మరింత నమ్మకం చూపిస్తూ అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి మంచి పరిణామాల కింద తోడవుతాయి.


ఈ రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలన్నీ కూడా కచ్చితంగా స్ధానికులకే ఇవ్వాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఇలాంటి చట్టం తీసుకొచ్చిన నేపధ్యంలో ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి పెద్దవాళ్లు అడుగులు ముందుకువేయాలి. వీళ్లు(ఆదిత్య బిర్లా గ్రూప్‌) చూపిస్తున్న ఈ చొరవ దేశంలో మిగిలిన వారికందరికీ గొప్ప ముందడుగు అవుతుంది. ఇవాళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
అలాంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు నేపధ్యం గురించి కూడా చూస్తే… మనకన్నా చాలా సంవత్సరాల ముందు 2010–12 మద్య ప్రాంతంలో రక,రకాల ఇబ్బందులు పడుతూ వచ్చింది. చివరికి ఈ ప్రాజెక్టు గ్రాసిమ్‌ సంస్ధ చేపట్టి అడుగులు ముందుకు వేయించింది.


సంత‌కాలు చేశారు…స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మ‌రిచారు
ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గ్రాసిమ్‌ సంస్ధకు అప్పగిస్తూ సంతకాలు చేసింది. ఆ తర్వాత ప్రాజెక్టుకు ఇంతకు ముందున్న సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు సంతకాలు చేసారు కానీ సమస్యలు పరిష్కారం చేయలేదు. సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేస్తే పరిశ్రమ రాదు అన్న కనీస ఆలోచన కూడా లేకుండా అడుగులు ముందుకు వేశారు. ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తూ… ఒక మార్గం చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టించగలిగితే వేల కోట్ల రూపాయులు పెట్టుబడులు రావడమే కాకుండా.. దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న మంచి ఆలోచనతో ఆ సమస్యలన్నీ అధిగమించేందుకు పరిష్కారం చూపుతూ అడుగులు వేశాం.


కేప్టివ్ థ‌ర్మ‌ల్ ప్లాంట్‌కు నో
ఈ పరిశ్రమ వస్తే గ్రామం కాలుష్యమవుతుందన్న భయాల నేపధ్యంలో… కేప్టివ్‌ థర్మల్‌ ప్లాంట్‌ వినియోగంలోకి వస్తే దానివల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువవుతాయని అనుకున్న పరిస్థితుల్లో కేప్టివ్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టకూడదని ఆదిత్యా బిర్లా గ్రూప్‌ యాజమాన్యాన్ని కూడా ఒప్పించాం.
అది కాకుండా పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ వదిలేస్తే.. నీరు కలుషితమయ్యే విషయంలో కూడా స్ధానికులకు రకరకాల ఆందోళనలు, భయాలు ఉన్న వాతావరణం గతంలో చూశాం. దానిని కూడా అధిగమించేందుకు టెక్నాలజీలో కూడా ఏకంగా మార్పులు చేశాం.


గతంలో ఇదే ప్లాంట్లులో ఉన్న టెక్నాలజీ మెర్క్యురీ మెంబ్రేన్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే పాత పరిస్థితిని మార్పు చేసి ఎలక్ట్రాలసిస్‌లో కూడా మెరుగైన విధానాన్ని క్రోడీకరించి కాలుష్యానికి ఏమాత్రం అవకాశమివ్వని విధంగా అడుగులు ముందుకు వేశాం.
జీరో లిక్విడ్‌ వేస్ట్‌ అనే విధానాన్ని తీసుకుని… లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ అనేది ఎక్కడా ఉండకూడదని, ఆ విషయాన్ని కూడా చెప్పి యజమాన్యాన్ని ఒప్పించాం.
ఇవన్నీ రకరకాల పద్ధతిలో ఇన్‌కార్పొరేట్‌ చేసి, భయాలకు తావిచ్చే పరిస్థితి ఈప్రాజెక్టులో లేకుండా చేసిన పిమ్మట… 75 శాతం ఉద్యోగాలన్నీ స్ధానికులకే రావాలని మనం చేసిన చట్టాన్ని కూడా వివరించాం. చట్టంలో ఉన్న సారాంశం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇచ్చేటట్టు ఒప్పించాం. కాబట్టి ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరుగుతుంది.
ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కూడా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో అడుగులు వేశాం.


దేశంలోనే అతి పెద్ద యూనిట్‌
దేశంలోనే కాస్టిక్‌ సోడా ఉత్పత్తిలో ఏకైక అతిపెద్ద యూనిట్‌ ఇది. ఆసియాలో అత్యాధునికమైన ప్లాంట్‌ ఇది. రాష్ట్రానికి గర్వకారణమైన విషయమిది. భవిష్యత్తులో అనుబంధరంగ పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఇది దోహదపడుతుంది.


గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, కుమార మంగళం గారి అపార అనుభవం, పరిచయాలు ఆంధ్రప్రదేశ్‌ ఎదుగుదలకు కచ్చితంగా తోడ్పడతాయని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిలో భాగస్వామి కావాలని, రాష్ట్రానికి రాయబారిగా, గర్వకారణంగా నిలబడాలని ఆశిస్తున్నాను. ఇది దేశం నలుమూలల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఉపయోపడుతుందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా కుమార మంగళం బిర్లాకు, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌కు నా శుభాకాంక్షలు. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ సహకారం అవసరమైన అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాను.


ఈ పరిశ్రమ వల్ల మంచి జరగాలని … ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ