Tuesday, March 21, 2023
HomeArchieveప్రాధాన్య‌తా క్ర‌మంలో ఉపాధి ప‌నులు

ప్రాధాన్య‌తా క్ర‌మంలో ఉపాధి ప‌నులు

గ్రామాల్లో ప‌రిశుభ్ర‌త‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు
గ్రామానికో రిగ్ ఏర్పాటు చేయాలి
వివిధ అంశాల‌పై స‌మీక్ష‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ ఆదేశాలు
అమరావతి, జ‌న‌వ‌రి 31:
ప్రాధాన్య‌తా క్ర‌మంలో ఉపాధి హామీ ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప‌నితీరును ఆయ‌న సోమ‌వారం స‌మీక్షించారు. ఈ శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించి వివిధ ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైయస్సార్‌ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్‌కింద కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలను కూడా జ‌గ‌న్ స‌మీక్షించారు. తొలుత ఉపాధిహామీ పనులపై స‌మీక్ష నిర్వ‌హించారు. ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్, వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అమూల్‌ పాలసేకరణ చేస్తున్న జిల్లాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బీఎంసీయూలను పూర్తిచేయాలని కోరారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తిచేసేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాల‌ని సీఎం సూచించారు.
ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, వాటిని ప్రాసెస్ చేసే అంశంపై సీఎం అధికారుల‌ను వివ‌రాలు అడిగారు. నవంబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో 22 శాతం ఇళ్లనుంచి చెత్తసేకరణ ప్రారంభమైంద‌నీ, ఇప్పుడ‌ది 61.5శాతానికి చేరుకుంద‌ని అధికారులు చెప్పారు. అక్టోబరు కల్లా లక్ష్యాన్ని సాధిస్తామ‌న్నారు. గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపరచాలని అధికారుల‌కు సీఎం సూచించారు. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాల‌న్నారు. వివిధ గ్రామాల్లో మురుగు నీరు నిల్వ ఉన్న 582 ప్రాంతాలను ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించామ‌ని అధికారులు తెలిపారు. ఇక్కడ సాయిల్‌ బయోట్రీట్‌మెంట్, వెట్‌ ల్యాండ్‌ట్రీట్‌మెంట్, వేస్ట్‌ స్టెబిలైజేషన్‌ పాండ్స్‌ తదితర పద్ధతుల్లో శుద్ధికి ప్రణాళికను రూపొందించుకున్నామ‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు.

అందుకు అంగీకారం తెలిపిన సీఎం, ఏడాది లోగా పూర్తిచేయాల‌ని ఆదేశించారు. తర్వాత వాటి నిర్వహణపైనా దృష్టి సారించాల‌న్నారు.
కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్వహణపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్లాలని సూచించారు. తాను పాదయాత్ర చేసిన‌ప్పుడు గ్రామాల్లో పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగించాయ‌ని సీఎం తెలిపారు. ఈ ప‌రిస్థితుల నుంచి గ్రామాలు బ‌య‌ట‌ప‌డేలా చ‌ర్య‌లుతీసుకోవాల‌న్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలని, అదే త‌మ ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని తెలిపారు.
నియోజ‌క‌వ‌ర్గానికి ఒక రిగ్ అప్ప‌గించాల‌ని వైయస్సార్‌ జలకళ అంశంపై స‌మీక్ష‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఆ రిగ్గుతో రైతులకు బోర్లు తవ్వించాల‌న్నారు. దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందని చెప్పారు. బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలని ఆదేశించారు.


రోడ్ల నిర్వ‌హ‌ణ‌పై శ్ర‌ద్ద పెట్టాలి
గత ప్రభుత్వం హయాంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులను పూర్తిగా గాలికొదిలేశారని ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రెండేళ్ల విస్తారంగా వర్షాలు కురిసిన కార‌ణంగా అవి దారుణంగా దెబ్బతిన్నాయ‌న్నారు. క్రమం తప్పకుండా చేప‌ట్టాల్సిన నిర్వహణను గాలికి వదిలేయడంతో అన్ని రోడ్లనూ ఒకేసారి నిర్మించి, మరమ్మతు చేయాల్సిన అవసరం ఏర్పడింద‌న్నారు. ఈసారి రోడ్ల నిర్మాణం, మర్మతులను పూర్తిచేయాలన్నారు. భవిష్యత్తులో దీనికి అత్యుత్తమ కార్యాచరణ ఉండాలన్నారు. ఏ దశలోకూడా నిర్లక్ష్యానికి గురికాకుండా క్రమం తప్పకుండా మెయింటైనెన్స్‌ పనులు నిర్వహించాలనీ, నిధుల కొరత లేకుండా ప్రణాళికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ ఎండీ పి సంపత్‌ కుమార్, సెర్ఫ్‌ సీఈఓ ఎండి ఇంతియాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ కమిషనర్‌ శాంతి ప్రియా పాండే ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ