Tuesday, March 21, 2023
HomeAP Newsవందేళ్ళలో ఈ స్థాయి వ‌ర‌ద‌లు లేవు

వందేళ్ళలో ఈ స్థాయి వ‌ర‌ద‌లు లేవు

గోదావ‌రి వ‌ర‌ద‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌
వ‌ర్షాల‌పై జిల్లాల అధికారుల‌తో ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌
అమరావతి, జూలై 12:
భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తాజా పరిస్థితి, తీసుకుంటున్న సహాయ చర్యలను కలెక్టర్లు సీఎంకు వివ‌రించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయి. గడిచిన వందేళ్లలో ఇంత ముందుగా ఈ స్ధాయిలో వరద రాలేదు. సాధారణంగా ఆగష్టులో 10 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉంటుంది. తొలిసారిగా జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చింది. ఇది జాగ్రత్త పడాల్సిన అంశం. ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోంది. బుధ‌వారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరినదికి వరదలు కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ కూడా మృత్యువాత పడకూడదు. కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. వి.ఆర్‌.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. లైన్‌ డిపార్ట్‌మెంట్లు ప్రత్యామ్నాయాలతో సిద్ధంగా ఉండాలి. కంట్రోలు రూమ్స్‌ సమర్థవంతంగా పనిచేయాలి.
24 గంటలపాటు నిరంతరాయంగా కంట్రో రూంలు పనిచేయాలి.


అవసరమైనచోట వరద సహాయక శిబిరాలు:
లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే శిబిరాలకు తరలించండి. సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలి. మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలి. శిబిరాల నుంచి వాళ్ల వాళ్ల ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రశంసించే విధంగా ఏర్పాట్లు ఉండాలి. సహాయ శిబిరాల్లో నాణ్యమైన సేవలందించే క్రమంలో ఖర్చుకు వెనుకాడొద్దు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వ్యక్తికి అయితే రూ.1000, ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వండి. తక్షణ సహాయంగా వారికి ఉపయోగపడుతుంది.

పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన సరుకులు నిల్వ ఉంచేలా చూసుకోవాలి. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోండి. తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధం చేసుకోవాలి.


శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలపై అప్రమత్తంగా ఉండండి:
చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు.. ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోండి. బోట్లు, లైఫ్‌ జాకెట్లు.. అవసరైన ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచండి. అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నాం. సీఎంఓ అధికారులు మీకు అందుబాటులో ఉంటారు. వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాల‌ని కలెక్టర్లను సీఎం వైయస్‌.జగన్ ఆదేశించారు.


వీడియో కాన్ఫరెన్స్‌లో హోం,విపత్తు నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఇంధనశాఖ కార్యదర్శి కె విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ