Friday, December 1, 2023
HomeArchieveసామాజిక మాధ్య‌మాల ద్వారా స‌మ‌స్య‌ల‌కు చెక్‌

సామాజిక మాధ్య‌మాల ద్వారా స‌మ‌స్య‌ల‌కు చెక్‌

అవినీతిపై ఫిర్యాదుకు ఏసీబీ యాప్‌
హోం మంత్రి త‌నదైన ముద్ర‌ను చూపాలి
క‌ర‌ప్ష‌న్‌పై 14400 నెంబ‌ర్‌తో నెంబ‌ర్ ఏర్పాటు
అవినీతి ప్ర‌క్షాళ‌నే ల‌క్ష్యం కావాలి
హోం శాఖ‌పై స‌మీక్ష‌లో ఏపీ సీఎం జ‌గ‌న్‌
అమ‌రావ‌తి, ఏప్రిల్ 20:
సామాజిక మాధ్య‌మాల ద్వారా వేధింపుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. ఏసీబీ, దిశ‌, ఎస్ఇబి కార్య‌క‌లాపాలు స‌హా సామాజిక మాధ్య‌మాల‌నూ ఆలంబ‌న‌గా చేసుకోవ‌చ్చ‌న్నారు. వీటికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సిందేన‌ని సీఎం స్ప‌ష్టంచేశారు. దిశ త‌ర‌హాలో అవినీతిపై ఫిర్యాదులు చేయ‌డానికి వీలుగా ఏసీబీకి ఒక యాప్‌ను రూపొందించాల‌నీ, నెల రోజుల్లోగా ఇది పూర్తి కావాల‌నీ ముఖ్య‌మంత్రి చెప్పారు. హోం శాఖ‌పై సీఎం జ‌గ‌న్ బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పై ఆదేశాల‌ను ఇచ్చారు.
నేర నిర్ధారణకు ఫోరెన్సిక్‌ విభాగం బలోపేతం చేయాల‌న్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు
ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉండాల‌న్నారు. డ్రగ్స్‌ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని స్ప‌ష్టంచేశారు. మూలాల్లోకి వెళ్లి కూకటి వేళ్లతో డ్ర‌గ్స్‌ను పెకలించేయాల‌ని ఆదేశించారు. ఈ అంశంలో విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాల‌న్నారు. చీకటి ప్రపంచంలో వ్యవహారాలను సమూలంగా నిర్మూలించాల‌ని సీఎం స్ప‌ష్టంచేశారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని త‌న‌కు నివేదించాలని కోరారు. ఇందుకోసం ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబర్ ఏర్పాటుచేసుకోవాల‌ని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.


త‌మదైన ముద్ర‌ను వేయాలి
ప్రతి అంశంలో హోంమంత్రి, డీజీపీ విధినిర్వహణలో తమదైన ముద్రను వేయాల‌నీ, ఇది వారికి గర్వకారణంగా నిలుస్తుందనీ సీఎం చెప్పారు. నిర్దేశిత‌ లక్ష్యాలవైపు ఏకాగ్రతతో సాగాలని సూచించారు.
అవినీతి నిరోధానికి ఏసీబీలో ఏర్పాటుచేసిన 14400 నంబర్‌ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలన్నారు. ఏసీబీ విధులేంటి, ఎలా పనిచేస్తుందన్నది ప్ర‌జ‌ల‌కు వివ‌రంగా తెలియాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదని స్ప‌ష్టంచేశారు. ఏసీబీకి ఇది ప్రాధమిక విధి కావాలన్నారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌ సాక్ష్యాలున్నా వాటిని ఏసీబీ నెంబరుకు చేరవేసే ఏర్పాటు ఉండాలని చెప్పారు. అందుకు తగినట్టుగా నెంబరు ఏర్పాటుచేసి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్న విభాగాల్లో మరింత దృష్టిపెట్టాలని సీఎం కోరారు.
గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నాయ‌నీ, భవిష్యత్తులోకూడా ఈ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు కనిపించకూడదనీ స్ప‌ష్టంచేశారు. ఇందుకు త‌గిన‌ట్లుగా ఎస్‌ఓపీలు తయారు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోకి సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవస్థలు వస్తున్నాయనీ, సర్వేయర్లు వస్తున్నారనీ, భూముల పంపకాలవల్ల వచ్చే డివిజన్, సర్వే, రిజిస్ట్రేషన్‌ తదితర ప్రక్రియలన్నీ సచివాలయాల్లోనే జరుగుతాయనీ సీఎం వివ‌రించారు. ఏ సందర్భాల్లోనూ కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదని ఆదేశించారు.


ప్ర‌క్షాళ‌న చేసుకుంటూ వెళ్ళాలి
అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్‌ చేసుకుంటూ వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాల్లో అవినీతికి, లంచాలకు తావు ఉండకూడదన్నారు. అవినీతిపై ఆడియో రికార్డ్‌ ఉన్నా, దాన్ని పంపించినా సరే.. చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌నం ప్ర‌భుత్వంలోకి వ‌చ్చి మూడేళ్ళు కాకముందే రూ.1.35 లక్షల కోట్లను డీబీటీ పద్ధతుల్లో ప్రజలకు ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేశారు. మధ్యవర్తులు లేకుండా ఎక్కడా కూడా పైసా అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాలకు పంపామ‌ని చెప్పారు. రానున్న‌ రెండేళ్లతో కలిపితే సుమారు రూ.2.5లక్షల కోట్లు ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తున్నామ‌న్నారు.
మండ‌ల స్థాయిలో ఏసీబీని బ‌లోపేతం చేయ‌లి
మండలస్థాయిలో కూడా ఏసీబీని బలోపేతం చేయాలని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. అవినీతి నిరోధం, దిశ, ఎస్‌ఈబీ.. ఈమూడు అంశాలకు సంబంధించి మండలస్థాయిల్లో స్టేషన్లు ఉండాలనీ, ఈ మూడు అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలనీ ఆయ‌న సూచించారు. దిశమాదిరిగా అవినీతి నిరోధానికి ఒక యాప్‌ను పెట్టాలని ఆదేశించారు. నెలరోజుల్లోగా యాప్‌ను తయారుచేసి, కార్యాచరణకూడా సిద్ధంచేయాలని తెలిపారు. దీనిద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. తమ వద్దనున్న ఆడియో, వీడియో సహా పత్రాలను నేరుగా అప్‌లోడ్‌ చేయొచ్చన్నారు. వీటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్‌ వ్యవస్థలు కూడా ఉండాలని అభిప్రాయ‌ప‌డ్డారు. లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు కూడా పడాలని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను కూడా పరిశీలించి, మార్పులు, చేర్పులు ఉంటే చేసి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.


ఏ అవినీతి వ్యవహారంపైనైనా ఏసీబీ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో అవినీతిపైన వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టిపెట్టాలని కోరారు. సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలని సూచించారు. దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా చర్యలు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బాగా కనిపించేలా హోర్డింగ్స్ ఏర్పాటుచేయాల‌న్నారు. యాప్‌ ద్వారా ఎలా ఫిర్యాదు చేయొచ్చు.. అన్నదానిపై తగిన సూచనలు కూడా అందులో ఉండాలని కోరారు.


ప్ర‌తిష్ఠాత్మ‌కంగా దిశ
హోంమంత్రి, డీజీపీ దిశ అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం జ‌గ‌న్ కోరారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి బాలిక, మహిళ చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు.. భద్రతకు భరోసా లభించినట్లేన‌ని తెలిపారు. ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా ఫోన్‌ను 5 సార్లు అటూ, ఇటూ ఊపితే చాలు 10–15 నిమిషాల్లో పోలీసులు స‌మ‌స్యాత్మ‌క ప్రాంతంలో ఉంటారని తెలిపారు. ఈ రెస్పాన్స్‌ టైంను ఇంకా తగ్గించడంతో పాటు కచ్చితంగా వారికి సహాయం అందాలన్నారు. దిశను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి మరింత మెరుగైన ప్రోటోకాల్స్‌ రూపొందించాలని సూచించారు సీఎం జ‌గ‌న్‌. ఇందుకోసం ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. మన లక్ష్యం.. నేరాన్ని నివారించడమే కాదనీ, ఆ క్రైమ్‌ చేసిన వ్యక్తికి శిక్ష విధించడమ‌నీ చెప్పారు.


స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)
మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం తయారీని ఉక్కుపాదంతో అణిచివేయాలనీ, ఎస్‌ఈబీకి నిర్దేశించిన కార్యకలాపాలు కూడా అత్యంత కీలకమ‌నీ సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఎస్‌ఈబీకోసం కూడా ఒక కాల్‌సెంటర్‌ నంబర్‌ను ఏర్పాటుచేయాల‌న్నారు. మద్యం అక్రమరవాణా, అక్రమ మద్యం తయారీలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు. ఆధునిక నాగరికత పేరుతో వస్తున్న పెడధోరణులకు అడ్డుకట్టవేయాలని సూచించారు. డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిరోధించాలనీ, ఈ అంశంపై విద్యాసంస్థలమీద పూర్తిగా నిఘా పెట్టాలని సీఎం చెప్పారు. జూనియర్‌ కళాశాలలు మొదలుకుని, ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్‌ కాలేజీలు, యూనివర్సిటీలు మీద ఫోకస్‌ పెట్టాలన్నారు.
ఈ సమీక్షా సమావేసంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ