Sunday, December 10, 2023
HomeAP Newsచేతిలో చెయ్యేసి చెబుతున్నా: జ‌గ‌న్ భ‌రోసా

చేతిలో చెయ్యేసి చెబుతున్నా: జ‌గ‌న్ భ‌రోసా

నష్టపోయిన ఏ ఒక్కరికి అన్యాయం జరగదు
ఇళ్లు, పంటలు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటాం
15 రోజుల్లో గ‌ణ‌న‌… సీజన్‌ ముగిసేలోగా సాయం
ఇది మీ ప్రభుత్వం… మీ మంచి కోరే ప్రభుత్వం
అంతే తప్ప డ్రామాలు ఆడే ప్రభుత్వం కాదు
కోన‌సీమ వ‌ర‌ద బాధితుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా
అమ‌లాపురం, జూలై 26:
ఇటీవ‌లి వ‌ర‌ద‌ల‌లో న‌ష్ట‌పోయిన బాధితులంద‌రికీ న్యాయం చేస్తాన‌నీ, ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌నీ ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇళ్ళు, పంట‌లు కోల్పోయిన వారంద‌రికీ ఆదుకుంటామ‌న్నారు. 15 రోజుల‌లో న‌ష్టంపై లెక్క‌లు క‌ట్టి, ఈ సీజ‌న్ ముగిసే లోగా సాయం అందిస్తామ‌ని సీఎం తెలిపారు. ఇది మీ ప్ర‌భుత్వ‌మ‌నీ, మీ మంచి కోరే ప్ర‌భుత్వ‌మ‌నీ తెలిపారు. మాది డ్రామాలాడే ప్ర‌భుత్వం కాద‌న్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మంగ‌ళ‌వారం పర్యటించారు. జి.పెదపూడి లంక, ఉడుముల్లంక, బూరుగులంకల్లో వరద బాధితులనుద్దేశించి ఆయ‌న‌ మాట్లాడారు.


సాయం అందిందా లేదా: జి.పెదపూడి లంకలో సీఎం
వరదల సమయంలో సహాయం సక్రమంగా అందిందా? లేదా? అంటూ ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘మీలో ప్రతి ఇంటికి ప్రభుత్వం సరఫరా చేసిన రేషన్‌.. బియ్యం, పప్పులు, నూనె, పాలు అందాయా? లేదా? ప్రతి ఇంటికి రూ.2 వేలు అందాయా? లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తమకు అన్నీ అందాయని అందరూ సమాధానం ఇచ్చారు. దీంతో కలెక్టర్‌కు మంచి మార్కులు వేయొచ్చా అని సీఎం అడగడంతో, అందరూ ఒకే కంఠంతో ఇవ్వొచ్చు అని చెప్పారు.


సీఎం స్పష్టమైన ఆదేశాలు
వరదలు వచ్చినప్పుడు మొత్తం అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశాం. ప్రతి ఇంటికీ అండగా నిలవాలని ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యంతో పాటు, సరుకులు. రూ.2 వేలు అందజేయాలని స్పష్టంగా చెప్పాం. పశువులనూ కాపాడుకోవాలని, వాటికే కనక నోరుంటే, అవి కూడా మెచ్చుకునే విధంగా పశువులను కూడా బాగా చూసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. అలా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మొత్తం వ్యవస్థ.. కలెక్టర్లు మొదలు జేసీలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు, ఏఎన్‌ఎంలు అందరూ కూడా కలిసి పని చేసి, ఏ ఒక్కరికి కూడా నష్టం కలగకుండా చూడాలని ఆదేశించాం.


వారం రోజులు టైమిస్తున్నా…
ఒక వారం రోజుల సమయం ఇస్తామని.. ఆ తర్వాత మేము గ్రామానికి వచ్చి అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా తమకు అందలేదని, మిస్‌ అయిందని చెప్పే మాట రాకూడదని, వారం తర్వాత నేనే స్వయంగా వచ్చి తనిఖీ చేస్తానని కలెక్టర్లు అందరికీ చెప్పాం. ముఖ్యమంత్రి అన్న వ్యక్తి చేయాల్సింది ఇదే అని నేను నమ్ముతా. సీఎం అనే వ్యక్తి అదేశాలు ఇవ్వాలి, ఆ ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా సంబంధిత కలెక్టర్లందరికీ నిధులు, తగిన వనులు అందించాలి.
అదే వరదలు వచ్చినప్పుడే నేనే కనుక ఇక్కడికి వచ్చి ఉంటే, కలెక్టర్లు, అధికారులంతా నా చుట్టూ తిరుగుతుండే వారు. నేను టీవీల్లో బాగా కనిపించే వాణ్ని. నో ఫోటోలు బాగా వచ్చేవి. కానీ ప్రజలకు మాత్రం మంచి జరిగి ఉండేది కాదు.


మంచి చేయాలంటే డ్రామాలు ప‌క్క‌న పెట్టాలి
ప్రజలకు మంచి జరగాలి అంటే, డ్రామాలు పూర్తిగా పక్కన పెట్టాలి. అధికారులను ఎంపవర్‌ చేయాలి. వారికి ఇవ్వాల్సిన వనరులు ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత ‘‘ఒక వారం తర్వాత నేనే వచ్చి స్వయంగా ప్రజలను అడుగుతాను. అప్పుడు ఏ ఒక్కరు కూడా తమకు మంచి జరగలేదన్న మాట రాకూడదు అని చెప్పి’’ వారికి గడువు ఇవ్వడం జరిగింది. మంచి చేశాం కాబట్టే, వారం తర్వాత ఇక్కడికి వచ్చి అడిగితే, ఏ ఒక్కరు కూడా తమకు ఇది అందలేదని చెప్పడం లేదు. నిజంగా ఇక్కడ పని చేసిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అభినందనలు. అధికారులు మంచి చేశారన్న మాట ప్రజల నోట నోట వింటుంటే చాలా మంచిగా అనిపిస్తోంది.


త్వరలోనే పనులు చేప‌డ‌తాం
గోదావరి నదీపాయపై ఇక్కడ బ్రిడ్జికట్టాలని ప్రజలు అడుగుతున్నారు. త్వరలోనే ఆ బ్రిడ్జికి సంబంధించి పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి, ఇక ఎన్యుమరేషన్‌ మొదలవుతుంది. కలెక్టర్లంతా 15 రోజుల్లోనే దాన్ని పూర్తి చేస్తారు. మన ప్రభుత్వం ఇంకో మంచి పని చేస్తోంది. ఏ సీజన్‌లో నష్టం జరిగితే, ఆ సీజన్‌ ముగిసేలోపే సహాయం ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ సీజన్‌ ముగియక ముందే, మీకు రావాల్సిన పరిహారాలన్నీ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఇల్లు కోల్పోయినా, పంటలు నష్టపోయినా ఏ ఒక్కరు కూడా బాధ పడొద్దు. మీ అందరినీ ఆదుకుంటాం.


ఉడిమూడిలంకలో సీఎం
అనంతరం ఊడుమూడిలంక చేరుకున్న ముఖ్యమంత్రి వరద బా«ధితులతో ముఖాముఖి మాట్లాడారు. వరదల్లో వారికి అందిన సహాయాల గురించి వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత గ్రామ కూడలిలో మాట్లాడారు.


కలెక్టర్‌కు 100కు 100 మార్కులు
‘ఈ గ్రామంలో దాదాపు 1000 మంది నివాసం ఉంటున్నారు. మీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీకు అందితే అందాయని, లేకపోతే లేదని చెప్పండి. మీరు చెప్పే దాన్ని బట్టి కలెక్టర్‌కు మార్కులు వేస్తాను’.


‘అందరికీ ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, 1 కేజీ దాల్, లీటర్‌ పామాయిల్, లీటర్‌ పాలు, కేజీ టమోటా, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డలు.. అందాయా? లేదా?’.. అని అడగడంతో, తమకు అన్నీ అందాయని అంతా ఏక కంఠంతో చెప్పారు.
అదే విధంగా ఇంటింటికీ రూ.2 వేలు ఇచ్చారా? లేదా? అని అడగ్గా, ఇచ్చారని అంతా ముక్త కంఠంతో సమాధానం చెప్పడంతో, స్పందించిన సీఎం, మరి కలెక్టర్‌కు మంచి మార్కులు వేయొచ్చా అని ప్రశ్నించారు. దీంతో మళ్లీ గ్రామస్తులంతా వేయొచ్చంటూ గట్టిగా సమాధానం చెప్పారు.
100కు 100 వేయొచ్చని అన్నారు.


గతంలో ఇలా ఎవరైనా పని చేశారా?
వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలు.. చివరకు జిల్లా కలెక్టర్, జేసీలు ఎస్పీ మొదలు.. ఎమ్మార్వో వరకు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పని చేశారు. ఏ కుటుంబంలో ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదన్న ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి మంచి చేయాలన్న తపనతో పని చేశారు. గతంలో ఇలా ఎప్పుడైనా పనులు జరిగాయా? అని అడగడంతో లేదని ప్రజలు చేతులు ఊపుతూ చెప్పారు.


అందుకే డ్రామా అనరు
ఈ స్థాయిలో, ఈ మాదిరిగా పనులు జరిగితే దాన్ని డ్రామాలు అనరు. మీ అందరికీ మంచి జరగాలని చెప్పి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేస్తూ, వారి చేతుల్లో వనరులు పెట్టి.. ఒక వారం రోజులు మీకు టైమ్‌ ఇస్తున్నాం. ఆలోగా మీరు చేయాల్సిందంతా చేయాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి వస్తారు. స్వయంగా బాధితులను వివరాలు అడిగితే, అప్పుడు ఏ ఒక్కరూ కూడా తమకు మంచి జరగలేదన్న మాట రాకూడదన్న గట్టి ప్రయత్నం మా ప్రభుత్వంలో జరిగింది. ఇలా చేస్తే డ్రామాలు అనేవి ఉండవు. అందరికీ మంచి జరుగుతుంది.


డ్రామా అంటే ఇదీ..
డ్రామాలు ఎక్కడ జరుగుతాయో తెలుసా. ఏదన్నా జరిగిన వెంటనే ముఖ్యమంత్రి అక్కడికి వచ్చేసి.. కలెక్టర్లు, అధికారులు ప్రజలకు మంచి చేయకుండా, ఈ ముఖ్యమంత్రి చుట్టు తిరుగుతూనే, ఫోటోలకు మాత్రం బాగా ఫోజులిచ్చి, టీవీల్లో బాగా కనబడేలా ఫోజులిచ్చి.. తీరా ప్రజలకు ఏం జరిగితే ఏముందిలే. మన టీవీలు, మన పేపర్లు ఉన్నాయి కదా. మనకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు, మనం ఫోజులిస్తే చాలు… అన్నదాంట్లో డ్రామాలు కనిపిస్తాయి. మన ఈనాడేమో… మన బాబు మహా బంగారంగా పని చేస్తారని రాస్తారు. మన ఆంధ్రజ్యోతి మన బాబు బంగారంగా పని చేస్తాడని రాస్తాడు. మన టీవీ5 మన బాబు ఇంకా బాగా పని చేశాడని చూపుతుంది. ప్రజలు ఏ ఒక్కరికి మంచి జరగకపోయినా సరే.. ఇలాంటి ప్రచారాలు గత పాలనలో చూశాం.


ఒక్కరినీ చూపించలేకపోయారు
నేను గర్వంగా కూడా చెబుతున్నాను. ఈ పెద్దమనిషి గత రెండు, మూడు రోజులు ఇక్కడే తిరిగాడు. అంత తిరిగినా ఏ ఒక్కరిని కనీసం చూపించలేకపోయాడు.. నాకు రేషన్‌ అందలేదని, తమ ఇంట్లో రూ.2 వేలు ఇవ్వలేదని కానీ, ఏ ఒక్కరంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు. అంత పారదర్శకంగా, సమర్థంగా ఈరోజు పనులు జరుగుతున్నాయంటే, ఆ పనులు చేసిన కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ల వరకు.. మీ అందరు కూడా ఇంత బాగా పని చేస్తున్నందుకు మీ అందరికీ మన్ననలు ఇవ్వాలి.


ఆనాడు అనవసర ఆర్భాటం
ఈ మాదిరిగా అందరూ కష్టపడ్డారు కాబట్టే, మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అదే గతంలో చంద్రబాబు హయాంలో ఏం జరిగేదో తెలుసా.. ఏం జరిగినా ఆయన వెంటనే పరుగెత్తుకు రావడం.. వీడు బాగా పని చేయలేదని, వాడు బాగా పని చేయలేదని డిస్మిస్‌ చేద్దాం.. అనేవాడు. దాన్ని పేపర్లు, టీవీల్లో ప్రచారం చేసుకునేవారు అదే ఈరోజు ప్రతి అధికారితో పని చేయించడం, ఆ విధంగా వారిని దారిలో పెట్టడం. వారికి తగిన వనరులు ఇచ్చి పరిపాలనలో మార్పుకు ఈరోజు శ్రీకారం చుడుతూ, అడుగులు ముందుకు పడుతున్నాయి.
ఇక్కడికి వచ్చే ముందు బ్రిడ్జి కావాలని అడిగారు. దాన్ని కట్టే బాధ్యత నాది. మరో నెలన్నర –2 నెలలోపు పనులు కూడా మొదలు పెడతాం. ఇక మిగిలినవన్నీ కూడా అడిగారు. ప్రతి లంక గ్రామంలో కావాల్సినవన్నీ చేస్తాం.


పూర్తి పారదర్శకంగా అంచనాలు
గోదావరి వరద తగ్గుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించుకున్నారు. క వరద నష్టం అంచనాలు మొదలుపెడతారు. ఏ ఒక్కరికి కూడా ఇంటిపరంగా కానీ, పంటల పరంగా కానీ నష్టం కలిగితే ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదు. ఇది మీ అందరి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీది. మీ మంచి కోసం పని చేస్తోంది.


ఒక్కరికీ అన్యాయం జరగదు
ఇంత మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. వలంటీర్లు ఉన్నారు. అన్నీ కూడా పూర్తి పారదర్శకంగా, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా, పూర్తి అంచనాలు వేయడం జరుగుతుంది. ఇల్లు నష్టపోయినా, పంటలు నష్టపోయినా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఎన్యుమరేషన్‌ కూడా మరో 15 రోజుల్లో పూర్తి చేసి, ఈ సీజన్‌ ముగిసేలోగానే.. అంటే మరో రెండు, మూడు నెలలలోపే మీ అందరికీ ఆ డబ్బుల చేతిలో పెడతామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Prof Shankar Chatterjee, Hyderabad on A Success Story of a Doctor
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on Peace keeping Force & Role of India
Prof Shankar Chatterjee, Hyderabad on My Experience in Eritrea
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Food for villagers organised by a sr citizen
Prof Shankar Chatterjee, Hyderabad on Keep focus on alternative livelihood opportunities
Prof Shankar Chatterjee, Hyderabad on The Power of a Diverse Diet
Prof Shankar Chatterjee, Hyderabad on Food for Health Rhymes
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Prof Shankar Chatterjee, Hyderabad on Every School Produces Stalwarts
Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ